ఇదేదో ముందే ఉంటే పోలా?

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అతి విశ్వాసం అన్ని చోట్ల పనికిరాదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అతి విశ్వాసానికి పోయి ఇబ్బంది పడ్డారు. తనను గెలిపిస్తూ [more]

Update: 2021-09-10 16:30 GMT

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అతి విశ్వాసం అన్ని చోట్ల పనికిరాదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అతి విశ్వాసానికి పోయి ఇబ్బంది పడ్డారు. తనను గెలిపిస్తూ వచ్చిన భవానీపూర్ ను కాదని మమత బెనర్జీ మొన్నటి ఎన్నికల్లో నందిగ్రామ్ లో పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ వేవ్ కొనసాగింది. అధికారంలోకి రాగలిగింది. కానీ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ నందిగ్రామ్ లో ఓటమి పాలయింది.

రెండు స్థానాల నుంచి…

నిజానికి మమత బెనర్జీ రెండు స్థానాల నుంచి పోటీ చేసే వీలుంది. నందిగ్రామ్ లో సువేందు అధికారిపై పోటీ చేసి నెగ్గాలన్న బలమైన కోరికతోనే ఆమె అక్కడ పోటీకి దిగారు. అక్కడ సువేందు బలం తెలిసి కూడా మమత బెనర్జీ రెండో వైపు చూడలేదు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నుంచి పోటీ చేసినా సరిపోయేది. కానీ మమత బెనర్జీ మొండితనానికి పోయారు. తాను నందిగ్రామ్ ఒక్కదాంట్లోనే పోట ీచేస్తానని చెప్పి ఓటమి పాలయి భంగ పడ్డారు.

అధికారంలోకి వచ్చినా?

ఇక పార్టీకి గతంలో లేని విధంగా అఖండ విజయం లభించింది. 294 స్థానాలకు గాను 213 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. మమత బెనర్జీ ఎమ్మెల్యేగా గెలవకపోయినా పార్టీ అధికారంలోకి రావడంతో తానే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆరు నెలల్లోపు ఆమె తిరిగి శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఇప్పుడు మమత బెనర్జీ కి కళ్లు తెరుచుకున్నాయి. మళ్లీ భవానీపూర్ గుర్తొచ్చింది.

ఇప్పడు తెలిసొచ్చింది….

తాను భవానీపూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని మమత బెనర్జీ ప్రకటించారు. ఇక్కడ గెలిచిన శోవన్ దేవ్ చటర్జీ మమత కోసమే రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 30వ తేదీన పశ్చిమ బెంగాల్ లో మూడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3వ తేదీన ఫలితాలు రానున్నాయి. భవానీపూర్ నుంచి పోటీ చేసి మమత బెనర్జీ గెలవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ముఖ్యమంత్రి పదవికే ఇబ్బంది అవుతుంది. అయితే భవానీపూర్ మీద నమ్మకంతో అక్కడే పోటీ చేస్తున్నారు. ఇదే పని మొదటే చేసుంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు గదా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News