మమత అలెర్ట్ అయ్యారా?

బీహార్ ఎన్నికల నుంచి బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అనేక పాఠాలు నేర్చుకున్నట్లుంది. వరసగా నేతలు పార్టీని వీడి వెళ్లిపోతుండటం కూడా మమత బెనర్జీని ఆలోచనలో పడేసింది. [more]

Update: 2020-12-02 17:30 GMT

బీహార్ ఎన్నికల నుంచి బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అనేక పాఠాలు నేర్చుకున్నట్లుంది. వరసగా నేతలు పార్టీని వీడి వెళ్లిపోతుండటం కూడా మమత బెనర్జీని ఆలోచనలో పడేసింది. బీహార్ లో బీజేపీ పన్నిన వ్యూహాలు ఇక్కడ కూడా అమలు చేస్తారన్న భయం మమతలో ఉంది. అందుకే ఆమె ముందునుంచే అప్రమత్తమయ్యారు. బీజేపీ తనకు ప్రధాన శత్రువని మమత బెనర్జీకి తెలయంది కాదు. అందుకే ధీటైన అభ్యర్థులను మమత బెనర్జీ బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పలు దఫాల సర్వేల్లో…..

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ టీం పశ్చిమ బెంగాల్ లో పలు దఫాలు సర్వేలను నిర్వహించింది. ఈ సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని స్పష్టమయింది. అయితే సిట్టింగ్ లను కాదని వేరే వాళ్లకు సీట్లను ఇస్తే అసలుకే ఎసరు వస్తుందని మమత బెనర్జీ భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం అక్కడ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నా ప్రత్యామ్నాయ అభ్యర్థి పేరును కూడా సూచించింది. దాదాపు యాభై మంది సిట్టింగ్ లపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో వెల్లడయింది.

వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలపై….

దీంతో మమత బెనర్జీ అప్రమత్తమయ్యారు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలు తమ తప్పులు సరిదిద్దుకునే అవకాశం లేదు. అలాగని వారికి అవకాశం ఇవ్వకుంటే పార్టీ దెబ్బతింటుంది. అందుకే మమత బెనర్జీ అసంతృప్తి ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించే కార్యక్రమాన్ని పెట్టుకున్నారట. తిరిగి పార్టీ అధికారంలోకి వస్తే వారికి నామినేట్ పదవి ఇస్తానని హామీ ఇవ్వనున్నారని తెలిసింది. పోటీ చేస్తే గెలవరని సర్వే నివేదికలను కూడా వారి ముందు మమత బెనర్జీ పెట్టే అవకాశముందంటున్నారు.

బీజేపీ బీహార్ వ్యూహానికి…..

దీనికి తోడు తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో చీలిపోకుండా ఉండేందుకు కూడా మమత బెనర్జీ ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించారంటున్నారు. అవవసరమైతే ఎంఐఎం తో పొత్తు కుదుర్చుకోవడం, బలమున్న ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ వ్యూహానికి చెక్ పెట్టవచ్చని మమత బెనర్జీ భావిస్తున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాలతో బీహార్ తరహా బీజేపీ వ్యూహాలు ఇక్కడ అమలు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News