వీళ్లు.. చేయరు.. ఇంకొకళ్లను చేయనివ్వరు

అధిష్టానం తన చేతులో ఉందని అతి విశ్వాసంతో ఉంటారు. స్థానిక రాష్ట్ర నేతలను ఎవరినీ లెక్క చేయరు. తాను ఏం చెబితే అదే జరగాలనుకుంటారు. కానీ పార్టీకి [more]

Update: 2021-01-14 09:30 GMT

అధిష్టానం తన చేతులో ఉందని అతి విశ్వాసంతో ఉంటారు. స్థానిక రాష్ట్ర నేతలను ఎవరినీ లెక్క చేయరు. తాను ఏం చెబితే అదే జరగాలనుకుంటారు. కానీ పార్టీకి పూర్తి కాలం మాత్రం పనిచేయరు. ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటారు. ఎన్నికలకు ముందు వచ్చి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభిస్తారు. ఓటమి పాలయితే తిరిగి వెళ్లిపోతారు. ఆయనే మాజీ ఎంపీ మధు యాష్కి. ఇప్పడు కాంగ్రెస్ చీఫ‌ కావాలని మధు యాష్కి ఆశపడుతున్నారు. బీసీ కార్డును కొట్టినా పెద్దగా ఫలితం దక్కలేదు.

రాహుల్ కు సన్నిహితుడిగా…..

మధు యాష్కి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఎన్ఆర్ఐ కావడంతో ఢిల్లీలో హైకమాండ్ వద్ద మధు యాష్కి మంచి పట్టు సంపాదించారు. 2004, 2009 ఎన్నికల్లో మధు యాష్కి నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లడం, వైఎస్ చరిష్మాతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల గాలులు వీయడంతో మధు యాష్కి సులువుగా రెండు సార్లు విజయం సాధించారు.

అక్కడే ఎక్కువగా….

అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజనలోనూ మధు యాష్కి క్రియాశీలపాత్ర పోషించారు. అయినా ఆ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవితపై మధు యాష్కి ఓటమి పాలయ్యారు. దీంతో నాలుగేళ్ల పాటు ఆయన కన్పించకుండా పోయారు. అమెరికాలో తన బిజినెస్ వ్యవహారాలను చూసుకున్నారని తెలిసింది. మధు యాష్కి కుటుంబం కూడా ఇప్పటికీ అమెరికాలోనే ఉంటారు. దీంతో ఆయన ఎక్కువ సమయం అమెరికాలోనే గడుపుతారు. నిజామాబాద్ కు చుట్టపు చూపుగా వచ్చిపోతారు. కనీసం ఫోన్ లో కూడా స్థానిక నేతలకు అందుబాటులో ఉండరన్న విమర్శలున్నాయి.

పీసీసీ చీఫ్ పదవిలో…

ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి కోసం మధు యాష్కి ప్రయత్నించారు. అయితే రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయింది. తాను ఓటమి చెందినందునే పీసీసీ చీఫ్ ఇవ్వవద్దని కొందరు హైకమాండ్ కు చెప్పడంపై మధు యాష్కీ అభ్యంతరం తెలుపుతున్నారు. పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. డీఎస్ తో సన్నిహితులైన కాంగ్రెస్ నేతలు కూడా గత ఎన్నికల్లో తనకు సహకారం అందించలేదని ఆయన చెబుతున్నారు. మొత్తం మీద ఎప్పుడూ జనాలకు దూరంగా ఉండే నేతలు కూడా హైకమాండ్ వద్ద ఉన్న పలుకుబడితో పీసీసీ చీఫ్ నియామకంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారన్న విమర్శలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. అందుకే ముందుగా పీసీసీ చీఫ్ పదవి వచ్చిందన్న ప్రచారం జరగని వారికి పదవులు దక్కలేదు.

Tags:    

Similar News