మాధవుడి గాడ్ ఫాదర్ ఆయనేనట

ఏపీలో బీజేపీకి మూల పురుషుడు సీనియర్ మోస్ట్ నేత పీవీ చలపతిరావు. ఆయన 1980 కాలంలో పార్టీకి బీజం వేశారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. [more]

Update: 2020-05-24 00:30 GMT

ఏపీలో బీజేపీకి మూల పురుషుడు సీనియర్ మోస్ట్ నేత పీవీ చలపతిరావు. ఆయన 1980 కాలంలో పార్టీకి బీజం వేశారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన రాజకీయ వారసుడిగా దిగిన కుమారుడు మాధవ్ కూడా ఎమ్మెల్సీ అయ్యారు. అలా తండ్రి బాటలో నడచిన మాధవ్ కి ఇపుడు ఏపీ బీజేపీ పీఠం ఊరిస్తోంది. నిజానికి ఏపీలో అనేక మందిని శిష్యులుగా తయారుచేసుకున్న పీవీ చలపతిరావుని ఆ శిష్యులే తరువాత కాలంలో దెబ్బ కొట్టారు. రాజకీయాల్లో ఇది సహజమే అయినా ఆయన జీర్ణించుకోలేకపోయారు. అలాగని ఆయన గట్టిగా పోరాడలేకపోయారు. మొత్తానికి ఏదీ సాధించకుండానే పీవీ రాజకీయం జీవితం ముగించారు.

సయోధ్యతోనే…?

ఇపుడు కుమారుడు వంతు వచ్చింది. తనకు లాగానే అతను కూడా పెద్దల ఆశీస్సులు లేకుండా ఉంటే ఇబ్బందులు పడతారని పీవీ చలపతిరావు భావించి తనకు రాజకీయంగా ప్రత్యర్ధిగా సొంత పార్టీలో మారిన వెంకయ్యనాయుడు అప్పట్లో సన్నిహితం చేసుకున్నారు. వెంకయ్యనాయుడు చేసిన రాజకీయ మంత్రాంగం వల్లనే టీడీపీ నాడు సపోర్ట్ చేయడంతో మాధవ్ ఎమ్మెల్సీ అయిపోయారు. ఇపుడు ఆయన్ చూపులు ఏపీ బీజేపీ పీఠం మీద ఉన్నాయి. దాంతో ఆయన మరింతగా కేంద్ర పెద్దలను మంచి చేసుకునే పనిలో పడ్డారు. జాతీయ స్థాయిలో నేతలతో ఎప్పటికపుడు టచ్ లో ఉండడం ద్వారా ఏపీ బీజేపీ సారధి తానే కావాలని మాధవ్ వ్యూహాలు రచిస్తున్నారు.

లాబీయింగ్ తో….

ఢిల్లీ స్థాయిలో బాగానే లాబీయింగ్ చేస్తున్న మాధవ్ తన తండ్రితో గతంలో పరిచయం ఉన్న నేతలతో పాటు, గతంలో బీజేపీలో ఉంటూ ఇపుడు రాజ్యాంగబధ్ధ పదవిలో ఉన్న వెంకయ్యనాయుడుతోనూ సత్సంబంధాలు నెరుపుతున్నారు. వెంకయ్యనాయుడుకి ఇప్పటికీ ఏపీలోని బీజేపీ మెజారిటీ గ్రూప్ సలాం చేస్తుంది. వారందరికీ ఆయన గాడ్ ఫాదర్. దాంతో వెంకయ్యనాయుడు ద్వారా అటునుంచి నరుక్కు వస్తున్న మాధవ్ కేంద్ర పెద్దల ముందు తన అభ్యర్ధితత్వం గట్టిపరచుకుంటున్నారు. ఏపీలో ఓ బలమైన సామాజికవర్గం దన్నును కూడా ఆయన లౌక్యంగా సంపాదిస్తున్నారు. మొత్తానికి వారి మద్దతుతోనే తన పేరు జాతీయ నాయకత్వం పరిశీలించేలా తెలివిగా చేసుకుంటున్నారని అంటున్నారు.

కీలక నేతగా….

గత కొంతకాలంగా ఏపీ బీజేపీలో కీలక నాయకునిగా ఎదిగుతున్న మాధవ్ ప్రస్తుత బీజీపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం చెప్పని పార్టీ విధానపరమైన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. అనేక జాతీయ అంశాలను ఆయన మీడియా ముఖంగా చర్చిస్తున్నారు. ఏపీలో వైసీపీ మీద మరీ దూకుడు కాకుండా అలాగనీ మెత్తగా కాకుండా మధ్యేవాదాన్ని అనుసరిస్తున్నారు. కన్నాను తొందరలొనే తప్పిస్తారని అంతా అంటున్న నేపధ్యంలో తరువాత తానే ప్రెసిడెంట్ అని మీడియా సైతం అంచనా వేసేలా తన యాక్షన్ ప్లాన్ ని రూపొందించుకున్నారు. మొత్తానికి మాధవ్ మనసులో మాట బయటకు చెప్పకుండానే తెరవెనక తతంగం మాత్రం నడిపిస్తున్నారని అంటున్నారు. ఆయన‌కు ఇపుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన హరిబాబు వంటి వారి మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే తొందరలోనే ఏపీ కొత్త కమలనాధుడిగా మాధవ్ పేరు ప్రకటించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

Tags:    

Similar News