ఇక ప్రతీ ఏటా లాక్ డౌన్ ?

లాక్ డౌన్. ఈ పదం ఇపుడు సామాన్యుడికి కూడా అర్ధమైపోయింది. ఈ శతాబ్దంలో ఉన్న వారు మాత్రమే చవి చూసిన విచిత్ర అనుభవం ఇది. మానవాళి మొత్తం [more]

Update: 2020-04-18 17:30 GMT

లాక్ డౌన్. ఈ పదం ఇపుడు సామాన్యుడికి కూడా అర్ధమైపోయింది. ఈ శతాబ్దంలో ఉన్న వారు మాత్రమే చవి చూసిన విచిత్ర అనుభవం ఇది. మానవాళి మొత్తం కరోనా వైరస్ వంటి పెను విపత్తుని ఇంతవరకూ చూడలేదని చరిత్రకారులు చెబుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ వంటివి కూడా ఈ తరమే చూస్తోంది. ఇక లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో అంతగానూ గరిష్టమైన లాభాలూ ఉన్నాయని అంటున్నారు. పర్యావరణ పరంగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్న, ఆర్ధికంగా చూసుకున్నా కూడా లాక్ డౌన్ కంటే మంచి మందు ఈ ప్రపంచానికి వేరే లేదని కూడా మేధావులు, నిష్ణాతులు స్పష్టం చేస్తున్నారు.

ఆగి చూసుకుంటే….?

ఒక వేళ కరోనా వైరస్ ముప్పు కనుక రాకుంటే ఈ ప్రపంచం ఎన్నో గొప్ప విష‌యాలను, పాఠాలను నేర్చుకోకుండానే ముందుకు సాగేదన్న భావన కూడా మేధావులు చేస్తున్నారు. బిజీ జీవితంలో ఓ మనిషీ తిరిగి చూడు అన్నట్లుగా లాక్ డౌన్ చెప్పినట్లైంది. ఓ విధంగా గడచిన శతాబ్దాలతో పోలిస్తే వర్తమాన కాలంలో మనిషి సాధించిన సాంకేతిక అభివృధ్ధి ప్రకృతినే సవాల్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు సైన్స్ కి అందని వైరస్ లు వెల్లువలా వచ్చే అవకాశం ఉందని గతంలోనే పలు హెచ్చరికలు వచ్చాయి. ఇపుడు కరోనా వైరస్ ద్వారా వాటి విపరిణామాలను ప్రపంచం చూస్తోంది.

గంగ శుధ్ధి ……

పాలకులు వేల కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా మన పవిత్ర గంగానది పరిశుధ్ధి కాలేదు. కానీ లాక్ డౌన్ మొదలైన పది రోజుల తరువాత చూస్తే యాభై శాతానికి పైగా గంగానది శుద్ధి అయింది. పరిశ్రమలకు తలుపులు వేశాక అక్కడికి పరిశ్రమల వ్యర్ధాలు ఒక్కటీ చేరలేదు. అలాగే అక్కడ సంప్రదాయ పిండ ప్రదానాలు, ఇతరత్రా కార్యక్రమాల వల్ల వచ్చే వ్యర్ధాలు లేకుండా గంగ ఉరకలు వేస్తూ నిర్మలంగా ప్రవహించిన సంగతిని మన పర్యావరణవేత్తలు గుర్తించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఢిల్లీలో కాలుష్యం పెచ్చరిల్లి మానన జీవితానికే పెను విఘాతం ఏర్పడింది. అయితే లాక్ డౌన్ తరువాత కాలుష్యం రేటు బాగా తగ్గిపోవడమే కాదు మరో మూడేళ్ళ వరకూ ఢిల్లీకి కాలుష్యం బెడద ఉండదన్న భరోసా ఇచ్చేలా తయారైందని కూడా చెబుతున్నారు.

ఇంటి వంటతో…?

ఇక ఇంటి వంటతో ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగా మెరుగుపడుతోంది. చిల్లర తిళ్ళు, అల్లరి వేషాలు ఆగిపోయాయి. మందు దుకాణాలు బంద్ కావడంతో మధ్య నిషేధాలు ఎన్ని పెట్టినా రాని కట్టడి వచ్చిపడింది. అవసరం మేరకే డబ్బు ఖర్చు పెడుతూండడంతో పొదుపు కూడా తన‌కు తానుగా అబ్బేసింది. కుటుంబ బంధాలు పెరిగాయి. మనిషి విలువ, మానవత్వపు పరిమళాలు కూడా పెరిగాయి. ఇంతవరకూ ఒకే ఇంటి చూరు కింద ఉన్నా కూడా ఎవరు ఎవరికే తెలిసేది కాదు. అంత బిజీ లైఫ్. ఇపుడు గంటల తరబడి మాట్లాడుకుంటున్నారు. అంతేనా తనను తాను కూడా తెలుసుకునే అవకాశం మనిషికి లాక్ డౌన్ వల్లనే దక్కింది. ఏది అవసరమో, ఏది అనవసరమో బాగా తెలిసింది. లాక్ డౌనా, అయితే ఎలా బతకాలి అన్న భయాల నుంచి ఇలా కూడా బతకవచ్చు. ఇలాగే కదా బతకాలి అన్న నీతిని మానవాళి నేర్చుకుంది.

పదేళ్ళు పెట్టాలి….

ఈ పరిణామాలన్నీ చూసిన తరువాతనే తెలంగాణా మంత్రి కేటీఆర్ తాజాగా ఒక మాట అన్నారు. లాక్ డౌన్ మంచిదేనని, ప్రపంచ దేశాలు అంగీకరిస్తే ఒక పదేళ్ళ పాటు ప్రతీ ఏటా నిర్ణీత సమయంలో విశ్వమంతా లాక్ డౌన్ పాటిద్దామని ఆయన తనదైన అభిప్రాయం చెప్పుకొచ్చారు. అవును మంచిదే కదా. రోడ్డు ప్రమాదాలు లేని రోజులు, పరిశుభ్రతను ప్రతీ రోజూ పాటించే మనుషులు, ఒకరికి ఒకరుగా అంతా ఒకటిగా కలసి నడిచే ఉత్తమమైన కల్చర్ ఇవన్నీ లాక్ డౌన్ వల్లనే కదా నేర్చుకున్నది. కేటీయార్ విలువైన అభిప్రాయమే చెప్పారు. అంతా సరేనంటే ప్రతీ ఏటా కొన్నాళ్ళైనా అన్ని దేశాలూ ఒక్కటై లాక్ డౌన్ పాటిద్దాం. మన కోసం, మన ప్రకృతి కోసం, ముందు తరాల‌ వారి కోసం.

Tags:    

Similar News