అయినా… ఏం చేయలేరు గదా..??

వాళ్లు పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్నవాళ్లు. పార్టీ జెండా నీడనే తలదాచుకున్న వాళ్లు. వాళ్లు ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు? ఈ వయసులో పార్టీకి వ్యతిరేకంగా చేసి తమ [more]

Update: 2019-04-09 17:30 GMT

వాళ్లు పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్నవాళ్లు. పార్టీ జెండా నీడనే తలదాచుకున్న వాళ్లు. వాళ్లు ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు? ఈ వయసులో పార్టీకి వ్యతిరేకంగా చేసి తమ రాజకీయ జీవితంపై మచ్చను తమకు తామే తెచ్చుకోగలరా? ఇప్పుడు బీజేపీ పార్టీ సీనియర్ నేతలు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషిల పరిస్థితి ఇది. పార్టీ కేంద్ర నాయకత్వం తమ సినియారిటీని చూడకుండా వయసు సాకుగా చూపి పక్కన పెట్టినా బాధను గుండెల్లో దిగమింగుకుని పార్టీ కోసం పనిచేయడం తప్ప వారి ముందు మరో మార్గం లేదు.

మార్పులకు తానే….

ఎల్.కె. అద్వానీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. భారతీయ జనతా పార్టీ రెండు స్థానాల నుంచి అధికారం వరకూ పయనించడానికి కారకుల్లో ఒకరు. ఆయన చేపట్టిన రధయాత్ర పార్టీకి దేశ వ్యాప్తంగా జోష్ తెచ్చిందనే చెప్పాలి. పార్టీ సిద్ధాంతాలనే నమ్ముకున్న అద్వానీ ఎన్ని అవమానాలు జరిగినా దిగమింగుకునే ఉన్నారు. ముఖ్యంగా మాజీ ప్రధాని వాజ్ పేయి అనారోగ్యం పాలయిన తర్వాత ఆయన ప్రభ తగ్గిందనే చెప్పాలి. వాజ్ పేయి నాయకత్వం తర్వాత పార్టీలో జరిగిన మార్పులకు తానే కారణమయినా ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తోంది.

సీటు దక్కకుకన్నా…..

గాంధీ నగర్ సీటు తనకే దక్కుతుందని అద్వానీ ఆశపడ్డారు. అయితే 90 పదుల వయసు కావడంతో పార్టీ టిక్కెట్ ను నిరాకరించింది. తాను దీర్ఘకాలంగా పోటీ చేస్తూ వస్తున్న గాంధీనగర్ నియోజకవర్గాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లాగేసుకున్నా కిమ్మనడం తప్ప మరో మార్గం లేదు. అందుకే అద్వానీ బీజేపీని మరోసారి గెలిపించాలని కోరుతున్నారు. కానీ అద్వానీ మాత్రం తనలో ఉన్న అసంతృప్తిని సన్నిహితుల వద్ద వెళ్లగక్కుతూనే ఉన్నారు. గత ఐదేళ్లుగా పార్టీ లో జరుగుతున్న అవమానాలు తనకు మింగుడు పడటం లేదని ఆవేదన చెందుతున్నారు.

మరోసారి అధికారంలోకి వస్తే…..

మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఆయన ప్రధాని నరంద్ర మోదీ కోసం తాను పోటీ చేసే వారణాసి సీటును వదులుకున్నారు. కాన్పూరుకు తరలి వెళ్లారు. కానీ ఈసారి కాన్పూరు సీటు కూడా దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఇద్దరు నాయకులు బీజేపీ మ్యానిఫేస్టో విడుదలకు కూడా హాజరు కాలేదు. వారిలో ఉన్న అసంతృప్తిని గ్రహించిన అమిత్ షా స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి చర్చలు జరిపారు. అయినా పార్టీని నమ్ముకుని తమ రాజీకీయ జీవితాన్ని కొనసాగించిన ఈ నేతలు పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తారు..? బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఈ ఇద్దరు నేతలకు గౌరవప్రదమైన పదవులు ఇస్తామన్నది బీజీపీ నుంచి వస్తున్న లీకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News