డియర్ కామ్రేడ్…??

పశ్చిమ బెంగాల్….. ఈ పేరు చెబితేనే ఎర్రదండు గుర్తుకు వస్తుంది. దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్ ను ఏలిన కమ్యునిస్టు పార్టీ ఇప్పుడు కుదేలైపోయింది. కనీస స్థానాలను [more]

Update: 2019-03-25 18:29 GMT

పశ్చిమ బెంగాల్….. ఈ పేరు చెబితేనే ఎర్రదండు గుర్తుకు వస్తుంది. దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్ ను ఏలిన కమ్యునిస్టు పార్టీ ఇప్పుడు కుదేలైపోయింది. కనీస స్థానాలను గెలుచుకునే స్థాయిలో కూడా లేకపోవడానికి ప్రధాన కారణం నాయకత్వ లేమి అని చెప్పకతప్పదు. జ్యోతిబసు, బుద్దదేవ్ భట్టాచార్య వంటి నేతలున్న కాలంలో కమ్యునిస్టులకు కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు అరకొర సీట్ల కోసం ఎర్రసైన్యం పాకులాడే పరిస్థితి తలెత్తింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఎంట్రీతో కమ్యునిస్టుల కంచుకోట బద్దలయిపోయింది. ఇప్పడు అక్కడ ఆపార్టీకి దిక్కులేకుండా పోయింది.

క్యాడర్ కకావికలం…..

సిద్ధాంతపరంగా బలంగా ఉన్నా…ఓటు బ్యాంకు పరంగా పశ్చిమ బెంగాల్ లో సీపీఎం బాగా పలుచనై పోయింది. దశాబ్దాలకాలం రాష్ట్రాన్ని ఏలినా అభివృద్ధి ఏమాత్రం జరగకపోవడం ఇందుకు కారణమన్నది ఒక అంచనా. పెట్టుబడులు రాకపోవడం, పరిశ్రమలు రాక ఉపాధి అవకాశాలు మెరుగుపడక పోవడంతో కమ్యునిస్టులకు కాలం చెల్లిందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. 1977 నుంచి అజేయంగా రాష్ట్రాన్ని ఏలిన కమ్యునిస్టు పార్టీలో చాలా వరకూ క్యాడర్ కకావికలమై పోయిందంటున్నారు. చాలా మంది ద్వితీయ శ్రేణినేతలు కొందరు తృణమూల్ కాంగ్రెస్ లోకి, మరికొందరు బీజేపీలోకి వెళ్లిపోవడంతో చేష్టలుడిగి చూడటం తప్ప అక్కడ కామ్రేడ్లు చేయగలిగిందేమీ లేదన్నది వాస్తవం.

బలంగా టీఎంసీ….

గతకొంతకాలంగా తృణమూల్ కాంగ్రెస్ బలోపేతమయింది. ప్రాంతీయ పార్టీగా అవతరంచిన టీఎంసీ కమ్యునిస్టు పార్టీని కకావికలం చేసింది. దాదాపు 35 పోలింగ్ స్టేషన్లలో కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా ఆ పార్టీకి దొరకకపోవడం ఆ పార్టీ దైన్య స్థితిని తెలియజేస్తోంది. 1980లో మాత్రం కమ్యునిస్టు పార్టీ ఇక్కడ 38 సీట్లను గెలుచుకుని రికార్డు సృష్టించింది. అది చరిత్రకే పరిమితమవుతోంది. 2014 ఎన్నికలలో కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఈసారి ఆ పరిస్థితి కూడా లేదంటున్నారు. రెండు సిట్టింగ్ స్థానాల్లో కూడా ఈసారి చెమటోడ్చాల్సిందే. గత ఎన్నికల్లో బెంగాల్ లోని మొత్తం 42 పార్లమెంటు స్థానాలకు గాను టీఎంసీ 34 స్థానాలను సాధించింది. కాంగ్రెస్ నాలుగు, బీజేపీ,సీపీఎం రెండు స్థానాలు దక్కించుకున్నాయి.

బీజేపీ పుంజుకుంటోందా?

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ క్రమంగా బలపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటింది. భారతీయ జనతా పార్టీ బెంగాల్ లో ప్రత్యేక ఆపరేషన్ కు తెరలేపింది. దీంతో గతంలో రెండు సీట్లకే పరిమితమైన కమలం పార్టీ మరిన్ని గెలుచుకునేందుకు వ్యూహాలను రచించుకుంటుంది. ఇక్కడ బీజేపీ యేతర కూటమి ఏర్పాటు సాధ్యం కాకపోవడం కూడా కమలం పార్టీకి ప్లస్ గా మారుతుందంటున్నారు. ఇక మమత బెనర్జీ ఒంటరిగా తిరిగి సిట్టింగ్ స్థానాలను 34 ను గెలుచుకోవాలన్న కసితో ఉన్నారు. మొత్తం మీద ఎటు చూసినా కమ్యునిస్టు పార్టీ కంచుకోటలో కనుమరుగు కాక తప్పేట్లు లేదు.

Tags:    

Similar News