కాపు కాసేవారే లేరా ?

ఏపీలో రాజకీయం రంగు రుచి వాసన మార్చుకున్నాయి. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వేసుకున్న సమీకరణకు, అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. గత ఏడాది ఏపీ అంతా కాపుల [more]

Update: 2020-10-27 08:00 GMT

ఏపీలో రాజకీయం రంగు రుచి వాసన మార్చుకున్నాయి. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వేసుకున్న సమీకరణకు, అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. గత ఏడాది ఏపీ అంతా కాపుల చుట్టూనే రాజకీయం చేస్తూ సాగింది. నిజానికి చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాపుల జపం అందుకున్నారు. వారిని బీసీలో చేరుస్తానంటూ పెద్ద ఎత్తున ఉన్న వారి ఓటు బ్యాంక్ ని టీడీపీకి శాశ్వతం చేయాలనుకున్నారు. ఆ ఉత్సాహంలో ఆయన తరచూ కాపుల కోసం భారీ ప్రకటనలు చేస్తూ వచ్చారు. దాంతో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి కూడా చేతినిండా పని దొరికేది.

జగన్ తెలివి…..

ఇక నాడు ఏపీలో రెండవ వైపు ఉన్న వైసీపీ మాత్రం కాపుల అంశాన్ని మరీ ఎక్కువగా పట్టించుకోలేదు. జగన్ అంతకంటే పెద్ద ఓటు బ్యాంక్ గా ఉన్న బీసీలకే గేలం వేశారు. టీడీపీ కాపులను బుజ్జరించే చర్యలకు దిగుతున్న వేళ జగన్ టీడీపీకి దశాబ్దాలుగా మద్దతు ఇస్తున్న బీసీలను తన వైపు లాగేశారు. కాపుల కోటలో నిలిచి వారిని బీసీలలో చేర్చలేమంటూ జగన్ చేసిన సంచలన ప్రకటన బీసీలను ఒక్కసారిగా ఆకట్టుకుంది. ఆ మీదట ఆయన ఏలూరులో చేసిన బీసీ డిక్లరేషన్ కూడా వారిని మరింతగా దగ్గర చేసింది. ఇంత జరిగినా టీడీపీ మేలుకోకపోవడం వల్లనే 2019 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించాల్సివచ్చింది.

మాట నిలబెట్టుకున్నారుగా ….

ఇక అధికారంలోకి వచ్చాక జగన్ బీసీల కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. మంత్రివర్గ కూర్పు నుంచి అన్ని విషయాల్లో వారికే పెద్ద పీట వేశారు. దాంతో బీసీల సర్కార్ గా జగన్ పేరు తెచ్చుకున్నారు. ఇక దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీల కోసం ఏపీవ్యాప్తంగా 56 ప్రత్యేక కార్పోరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా జగన్ బీసీల దేవుడుగా మారిపోయారు. ఇది టీడీపీ రాజకీయాన్ని చావు దెబ్బ తీసే అంశమే. దాంతో తమ్ముళ్ళు గంగవెర్రులెత్తుతున్నారు. ఒక విధంగా టీడీపీ అధినాయకత్వం కూడా జగన్ చర్యలతో వణుకుతోంది.

బీసీలే దిక్కా..?

పోయిన చోటనే వెతుక్కోవాలని ఇపుడు టీడీపీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీసీలే తమ బలం, దాన్ని జగన్ లాగేశారు, పైగా జగన్ కి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మద్దతు కూడా ఉంది. దాంతో ఆయన రాజకీయంగా అజేయంగా నిలుస్తారన్న కంగారు పట్టుకుంది. దాంతో చంద్రబాబు హడావుడిగా పార్టీ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేశారు. కానీ అధికార పదవులు జగన్ ఇచ్చాక వాటి ముందు ఈ పార్టీ పదవులు సరితూగుతాయా అన్నది ఒక చర్చ. జగన్ మలుపు తిప్పిన ఏపీ రాజకీయం పుణ్యమాని ఇపుడు కాపులు ఎక్కడా పెద్దగా ప్రస్థావనకు రాకుండా పోతున్నారు. కాపులను నెత్తిన పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్న బాబు ఇపుడు కాపుల వూసే ఎత్తడంలేదు. బీసీల మంత్రమే పఠిస్తున్నారు. చూడాలి మరి ఇది ఎటు దారితీస్తుందో.

Tags:    

Similar News