నాయినన్నా…. నువ్వేమయిపోయినవే…..?

కార్మికులకు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది…. కార్మికులకు ఏ కష్టమెచ్చినా మా సర్కార్ ఆదుకుంటుంది….. మీ కోసమే మా ప్రభుత్వం ఉంది…… కేసీఆర్ మాట చెబితే…… అది [more]

Update: 2019-10-26 00:30 GMT

కార్మికులకు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది….

కార్మికులకు ఏ కష్టమెచ్చినా మా సర్కార్ ఆదుకుంటుంది…..

మీ కోసమే మా ప్రభుత్వం ఉంది……

కేసీఆర్ మాట చెబితే…… అది మూటే…..

ఈ మాటలు అన్నది ఎవరో తెలిసిందా….. ఎవరో కాదు నాయిని నర్సింహారెడ్డి. కార్మిక సంఘాల నాయకుడిగా ఎన్నో కంపెనీల్లో కార్మిక నాయకుడిగా ఉంటూ కార్మికుల కష్టసుఖాల కోసం పోరాటం చేసే లీడర్ గా గుర్తింపు పొందారు నాయిని నర్సింహారెడ్డి. ఇలా కార్మిక సంఘం నేతగా గుర్తింపు పొందడంతోనే ప్రజలతో మమేకమై ఉంటారనే ఉద్దేశ్యంతోనే దశాబ్ధాల కాలంగా ఎన్నో ప్రభుత్వాలు ఆయనకు ఎంతో గౌరవమిచ్చాయి. కార్మిక నాయకుడిగా పేరుపొందిన నాయిని నర్సింహారెడ్డి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీయే కాదు, కీలకమైన జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖ, హోంమంత్రి త్వ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. ఎప్పుడూ కార్మికుల పక్షమే నంటూ చెప్పే నాయిని నర్సింహారెడ్డి కి మరి ఇప్పుడు ఏమైందని అందరూ ప్రశ్నిస్తున్నారు. 20 రోజులుగా ఆర్టీసీలో సమ్మె చేస్తున్న కార్మికుల గురించి నాయిని ఎందుకు మాట్లడడం లేదు.

కోపం వచ్చిందా….?

గత మంత్రి వర్గంలో కీలకబాధ్యతలు చేపట్టిన నాయిని నర్సింహారెడ్డికి ఈ సారి కేబినెట్ లో చోటు దక్కలేదు. దీంతో నాయిని నర్సింహారెడ్డికి కోపమెచ్చినట్టుంది. ఎన్ని సార్లు కేసీఆర్ ముందు గోడు వెల్లబోసుకున్నా ఆయన కూడా పట్టించుకోకపోవడంతో నాయినికి ఏం చేయాలో తోచడం లేదు. ఏదైనా మాట్లాడితే ఉన్న పదవీ పోయే పరిస్థితి తలెత్తుతుందని అనుచరులతో అంటున్నట్లు వినికిడి. ఎన్నో కార్మిక కంపెనీల్లో నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షులుగా, గౌరవాధ్యక్షులుగా పనిచేశారు. చేస్తున్నారు. ఇంత అనుభవంఉన్న నర్సింహారెడ్డి సైలెంట్ అవడం పట్ల కార్మికలోకం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఆయన చెబితే వింటారా….?

కార్మిక సంఘాల్లో ఎంతో అనుభవమున్న నాయిని నర్సింహారెడ్డి కార్మికుల పక్షాన మాట్లాడలేని పరిస్థితి. టి.ఆర్.ఎస్ లోనే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన కేసీఆర్ కు ఎదురుమాట్లాడలేని దుస్థితి. ఎందుకంటే గతంలో నాయిని నర్సింహారెడ్డి సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి కేసీఆర్ మాటతప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారని నాయిని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కేసీఆర్ నాయినిని లెక్కచేయడం లేదు. ఎటువంటి పదవి ఇవ్వకుండా పక్కన బెట్టేశారు. దీంతో నాయిని సైలెంట్ అయ్యారు. ఇటీవల పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావు కూడా కేసీఆర్ అంగీకరిస్తే సమ్మెకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించారు. కాని ఒక్కరోజు తరువాత ఆయన కూడా మౌనం దాల్చారు.

చుట్టుకుంటుందనే భయమా…?

తెలంగాణ‌లో జ‌రిగిన ఈఎస్ఐ కుంభ‌కోణం స్కాంతో మాజీ హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి అల్లుడు, కార్పోరేట‌ర్ శ్రీ‌నివాస‌రెడ్డి కూడా పీక‌ల్లోతు కుంభ‌కోణంలో చిక్కున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. దీంతో అల్లుడిని కాపాడుకోవాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి. దీంతో నాయిని నర్సింహారెడ్డి అడ కత్తెరలో పోకచెక్కలా మారాడనట్లు కనిపిస్తోంది. కార్మిక నాయకుడిగా ఎదిగిన నాయిని నర్సింహారెడ్డి ఇటు ఆర్టీసీ పక్షాన మాట్లాడలేక, అటు కేసీఆర్ కు ఎదురుచెప్పలేక మౌనం వహిస్తున్నారు.

 

 

Tags:    

Similar News