జానన్న సొంత పార్టీ నేతలకు పెడుతున్న షరతులివేనట

నాగార్జు సాగర్ ఉప ఎన్నిక జానారెడ్డికి వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా మారింది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన జానారెడ్డి ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒంటిచేత్తోనే గెలవాలన్న నిర్ణయానికి [more]

Update: 2021-01-26 11:00 GMT

నాగార్జు సాగర్ ఉప ఎన్నిక జానారెడ్డికి వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా మారింది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన జానారెడ్డి ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒంటిచేత్తోనే గెలవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. ఇప్పటి నుంచే జానారెడ్డి నాగార్జున సాగర్ లో ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్దాయన గడప గడపకూ ఎక్కే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉత్సాహంగా ఉన్నాయి. ముందుగానే ఓటర్లను కలవడం తనకు కలసివచ్చే అంశంగా జానారెడ్డి భావిస్తున్నారు.

సొంత పార్టీ నేతలే…..

అయితే జానారెడ్డి నియోజకవవర్గంలో ప్రజల కన్నా, సొంత పార్టీలో నేతల వల్లనే ఇబ్బందులు ఎదురవుతాయన్న భయం పట్టుకుంది. అందుకే ఆయన స్వయంగా అధిష్టానానికి లేఖ రాశారు. సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకూ పీసీసీ చీఫ్ పదవిని నియమించవద్దని ఆయన కోరారు. దీనికి హైకమాండ్ కూడా ఓకే చెప్పింది. పీసీసీీ చీఫ్ పదవి భర్తీ అయితే వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ బలహీనతలన్నీ బయటపడతాయని భావించిన జానారెడ్డి దానిని వాయిదా వేయించగలిగారు.

ప్రచారంలో వివాదాలకు….

ఇప్పుడు ప్రచారంలోనూ నేతలు ఎవరూ రానవసరం లేదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ లో నేతలందరూ అనేక వర్గాలు విడిపోయి ఉన్నారు. ప్రచారంలోకి వచ్చి వారేదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అది తన మెడకు చుట్టుకుంటుందన్న భయం జానారెడ్డిలో ఉంది. అందుకే ముఖ్యమైన నేతలతో నిర్వహించే బహిరంగ సభలకే వారిని హాజరయ్యేలా చూడాలని జానారెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ ను కోరనున్నారని తెలిసింది.

కొందరు రావద్దంటూ…..

ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, వి.హనుమంతరావు, మధు యాష్కి వంటి నేతలు ప్రచారానికి రావడం కంటే దూరంగా ఉండటమే బెటరని జానారెడ్డి భావిస్తున్నారని తెలిసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలు సంయమనంతో మాట్లాడతారు. వారితో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా కొందరితో తనకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని జానారెడ్డి భావిస్తున్నారు. మొత్తం మీద జానారెడ్డి అన్ని రకాలుగా ఆలోచించి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News