ఓల్డ్ రైవల్స్ కదా…అందుకేనేమో….!!

కర్ణాటకలో కుమారస్వామికి సిద్ధరామయ్యే శత్రువుగా కన్పిస్తున్నాడా? ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినా… తనను సీఎంగా కుదురుకోనివ్వకుండా చేస్తున్నాడని కుమారస్వామి అభిప్రాయపడుతున్నారా? అవును ఇదే జరుగుతుంది కర్ణాటకలో. కర్ణాటకలో [more]

Update: 2019-01-28 18:29 GMT

కర్ణాటకలో కుమారస్వామికి సిద్ధరామయ్యే శత్రువుగా కన్పిస్తున్నాడా? ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినా… తనను సీఎంగా కుదురుకోనివ్వకుండా చేస్తున్నాడని కుమారస్వామి అభిప్రాయపడుతున్నారా? అవును ఇదే జరుగుతుంది కర్ణాటకలో. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని తమంతట తామే కూలదోసుకునే పనిలో పడ్డారు రెండు పార్టీల నేతలు. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకునేందుకు అతి తక్కువ స్థానాలు వచ్చిన జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవిని అయిష్టంగానే కాంగ్రెస్ ఇచ్చింది.

సిద్ధరామయ్యకు ఇష్టం లేకున్నా…

ముఖ్యమంత్రిగా కుమారస్వామిని కూర్చోబెట్టేందుకు తొలుత సిద్ధరామయ్య ససేమిరా అంగీకరించలేదు. అయితే గులాం నబీ ఆజాద్, పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి వేణుగోపాల్ తదితరులు నేరుగా దేవెగౌడతో చర్చలు జరిపి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేశారు. ఇది సిద్ధరామయ్యకు సుతారమూ ఇష్టంలేదు. కుమారస్వామి సీఎం పదవి చేపట్టిన నాటి నుంచే సిద్దరామయ్య ఏదో ఒకటి అడ్డుతగులుతున్నారన్నది జేడీఎస్ ఆరోపణ. బడ్జెట్ విషయంలోనూ సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే అధికారుల బదిలీల విషయంలోనూ సిద్ధరామయ్య జోక్యం పెరిగిందని కుమారస్వామి ఆరోపిస్తున్నారు.

జేడీఎస్ నుంచే రావడంతో….

సిద్ధరామయ్య తొలుత జనతాదళ్ ఎస్ లోనే ఉండేవారు. అక్కడ దేవెగౌడ తో పొసగక బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో చాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సిద్దరామయ్య ఓటమి పాలయ్యారు. ఇక్కడ జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవెగౌడ చేతిలో ఓడిపోవడం గమనార్హం. అలా పాత కలహాలు మరోసారి తలెత్తాయన్నది పరిశీలకుల భావన. అందుకే కుమారస్వామి సిద్ధరామయ్యను టార్గెట్ చేశారంటున్నారు. తాను ముఖ్యమంత్రిగా దిగిపోవడానికి కూడా సిద్ధమని ప్రకటించడం వెనక సిద్ధరామయ్యను కట్టడి చేయడానికేనన్నది అందరికీ తెలిసిందే.

బీజేపీ కాలు దువ్వుతున్న సమయంలో….

సిద్ధరామయ్యను రెండు పార్టీల సమన్వయ కమిటీ ఛైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. దీంతో సిద్ధూ చెప్పినట్లే ఎమ్మెల్యేలు నడుచుకుంటున్నారని, తమ నియోజకవర్గ సమస్యలను తరచూ లేవనెత్తుతూ తనపై బురద జల్లే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్నారని, దీని వెనక సిద్ధరామయ్య ఉన్నారన్నది కుమారస్వామి ఆరోపణ. సిద్ధరామయ్యే తమ నేత అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తరచూ వ్యాఖ్యానించడం కూడా కుమారస్వామికి చికాకు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక పక్క బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న సమయంలోనే కుమారస్వామి కరుకు వ్యాఖ్యలు చేయడం రెండు పార్టీలను ఇబ్బందుల్లోకి నెట్టడమేనన్నది విశ్లేషకుల అంచనా. బడ్జెట్ సమావేశాల ముందు జేడీఎస్, కాంగ్రెస్ వివాదం ఏ పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News