అపనమ్మకం….అన్నీ అనుమానాలే….!!!

అంతటా అపనమ్మకం…. కాంగ్రెస్ సహకరిస్తుందో? లేదో? అన్న అనుమానం. అధిష్టానం అనుకూలంగా ఉన్నా స్థానిక నాయకత్వం చేయి వేయకుంటే పరిస్థితి తారుమారవుతుంది. ఇప్పుడు జనతాదళ్ ఎస్ అధినేతలు [more]

Update: 2019-04-02 18:29 GMT

అంతటా అపనమ్మకం…. కాంగ్రెస్ సహకరిస్తుందో? లేదో? అన్న అనుమానం. అధిష్టానం అనుకూలంగా ఉన్నా స్థానిక నాయకత్వం చేయి వేయకుంటే పరిస్థితి తారుమారవుతుంది. ఇప్పుడు జనతాదళ్ ఎస్ అధినేతలు దెవెగౌడ, కుమారస్వామిలో నెలకొన్న భయం ఇదే. లోక్ సభ ఎన్నికలు పార్టీ పుట్టి ముంచుతాయేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్త మవుతోంది. పోటీ చేసేది తక్కువ స్థానాలయినప్పటికీ గెలవకుంటే పరువుతో పాటు భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి ప్రమాదం పొంచి ఉంటుందన్నది కుమారస్వామి బలంగా నమ్ముతున్నారు.

సంకీర్ణమైనా…..

కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ స్థానాల్లో విజయం సాధించినా కాంగ్రెస్ మాత్రం జేడీఎస్ నేత కుమారస్వామికే ముఖ్యమంత్రి పీఠం ఇచ్చింది. సంకీర్ణ ప్రభుత్వం అన్న మాటే గాని ధర్మాన్ని రెండు పార్టీలూ పాటించడం లేదు. మంత్రి పదవుల విషయంలో గాని, పదవుల నియామకాలు, అధికారుల బదిలీల వంటివి రెండు పార్టీల అగ్రనేతల్లో అగ్గిని రాజేశాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామిల మధ్య అస్సలు పడటం లేదన్నది బహిరంగ రహస్యమే.

కొన్ని స్థానాలయినా….

ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. మొత్తం 28 లోక్ సభ స్థానాలుండగా కాంగ్రెస్ 21, జేడీఎస్ ఏడు స్థానాల్లో పోటీ చేస్తోంది. మాండ్య, హాసన్, తుముకూరు నియోజకవర్గాల నుంచి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ, రేవణ్ణ తనయుడు ప్రజ్వల్, దేవెగౌడలు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సహకారం అందుతుందా? లేదా? అన్నది పార్టీలో అంతర్గతంగా చర్చనీయాంశమైంది. తుముకూరులో రెబల్ అభ్యర్థిని సముదాయించి పోటీ నుంచి తప్పించినా క్యాడర్ దేవెగౌడకు సహకరిస్తుందన్న నమ్మకం లేదు.

మంత్రులపైనే అనుమానాలు…

కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాలకు మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. అయితే మంత్రుల మీదే కుమారస్వామికి డౌట్లు వస్తున్నాయి. తనపై ఉన్న కోపాన్ని మంత్రులు ఈ ఎన్నికల్లో తీర్చుకుంటారా? అన్న అనుమానమూ లేకపోలేదు. అందుకే పదే పదే రాహుల్ గాంధీతో చర్చించి ఇక్కడ రాష్ట్ర పెద్దలను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు దేవెగౌడ, కుమారస్వామి. కానీ కొన్ని చోట్ల కాంగ్రెస్ క్యాడర్ జేడీఎస్ అభ్యర్థులను సహకరించడం లేదన్న నిఘా వర్గాల నివేదిక మేరకు కుమారస్వామి అప్రమత్తమై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపారు. మరి నిజంగానే జేడీఎస్ ను కాంగ్రెస్ దెబ్బకొడుతుందా? సహకరిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News