ప్రెజర్ మాములూగా లేదుగా….!!!

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తాను అనుకున్నట్లే జరుగుతోంది. తాను ముఖ్యమంత్రిని కాదని, గుమాస్తా ఉద్యోగం చేస్తున్నానని గతంలో కుమారస్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా లోక్ సభ [more]

Update: 2019-05-31 18:29 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తాను అనుకున్నట్లే జరుగుతోంది. తాను ముఖ్యమంత్రిని కాదని, గుమాస్తా ఉద్యోగం చేస్తున్నానని గతంలో కుమారస్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కుమారస్వామిపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల నుంచి పనులు వేగిరం చేయాలంటూ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఒకవైపు తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలా? ఎమ్మెల్యేల గొంతెమ్మ కోర్కెలను తీర్చాలా? అన్నదానిపై కుమారస్వామి మల్లగుల్లాలు పడుతున్నారు.

కుదురుకున్నట్లే కన్పించినా…..

కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటయిన తర్వాత కుమారస్వామి కొంత కుదురుకున్నట్లే కన్పించారు. అయితే ఆయన కాంగ్రెస్ నేతల్లో చీలిక తెద్దామనుకున్న తీరు బెడిసికొట్టిందంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను సంకీర్ణ సర్కార్ లు సమన్వయ కమిటీ ఛైర్మన్ గా నియమించారు. సిద్ధరామయ్య అంటే దేవెగౌడ కుటుంబానికి పడదు. జనతాదళ్ ఎస్ నుంచే సిద్ధరామయ్య బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి కావడాన్ని వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి సిద్ధరామయ్యను టార్గెట్ చేశారంటున్నారు.

ఆయనకు వ్యతిరేకంగా….

ఇందులో భాగంగా ఉపముఖ్యమంత్రి పరమేశ్వర, మంత్రి డీకే శివకుమార్ లను తన కోటరీలో చేర్చుకునే ప్రయత్నం చేశారు. సిద్ధరామయ్య సమన్వయ కమిటీ ఛైర్మన్ గా తీసుకున్న నిర్ణయాలను వీరు అడ్డుకునేలా కొంత ప్రయత్నాలు చేశారు. అయితే సిద్ధరామయ్య కూడా కుమారస్వామి ఎత్తులను ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ సయితం సిద్ధరామయ్యకు మంచి ప్రయారిటీ ఇస్తుండటంతో కాంగ్రెస్ నేతలు సయితం సిద్ధూకే జైకొట్టే పరిస్థితి నెలకొంది.

ఫలితాలతో సిద్ధూ…..

అయితే లోక్ సభ ఎన్నికల కోసమే రాహుల్ గాంధీ సిద్ధరామయ్యకు ప్రయారిటీ ఇచ్చారన్నది వాస్తవం. కానీ ఫలితాలు దారుణంగా రావడంతో సిద్ధూను కూడా పక్కన పెడతారన్న చర్చ పార్టీలో నడుస్తోంది. సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను కర్ణాటక రాజకీయాల్లో కీలకం అవుతారని కూడా ఒక వర్గం వాదన. ఇలా ఇన్ని వర్గాలగా విడిపోయిన కాంగ్రెస్ నేతల నుంచి కుమారస్వామిపై వత్తిడి మరింత పెరుగుతోంది. తమ పనులు చేయకుంటే…? అంటూ హెచ్చరిక స్వరం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి విన్పిస్తుంది. దీంతో కుమారస్వామి వారి కోర్కెలను తీర్చే పనిలో పడ్డారంటున్నారు.

Tags:    

Similar News