ఆ…రిజల్ట్ ను బట్టే… నిర్ణయమా..?

మాండ్య నియోజకవర్గం ఫలితం సంకీర్ణ సర్కార్ పై ప్రభావం చూపనుంది. ఇది ఖచ్చితంగా జరిగేదే. మాండ్యలో ఏమాత్రం కుమారస్వామి కుమారుడికి భంగపాటు ఎదురైతే జనతాదళ్ ఎస్ సంకీర్ణ [more]

Update: 2019-04-09 18:29 GMT

మాండ్య నియోజకవర్గం ఫలితం సంకీర్ణ సర్కార్ పై ప్రభావం చూపనుంది. ఇది ఖచ్చితంగా జరిగేదే. మాండ్యలో ఏమాత్రం కుమారస్వామి కుమారుడికి భంగపాటు ఎదురైతే జనతాదళ్ ఎస్ సంకీర్ణ సర్కార్ నుంచి వైదొలగడం ఖాయమని దాదాపుగా తేలిపోయింది. మాండ్యలో కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ్ గెలిస్తేనే ప్రభుత్వం కొనసాగుతుంది. ఇదీ ఇప్పుడు కర్ణాటకలో జోరుగా జరుగుతున్న చర్చ. అందుకే మాండ్య ఫలితంపై అందరూ ఆసక్తిగా ఉన్నారు.

మాండ్యలో ఓడిపోతే…

మాండ్య నియోజకవర్గంలో దేవెగౌడ మనవడు, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు. తొలిసారి రాజకీయాల్లోకి నిఖిల్ గౌడ వస్తుండటంతో ఆయన గెలుపు పార్టీకి, దేవెగౌడ కుటుంబానికి అవసరం. అయితే అక్కడ ఈక్వేషన్లు సరిగా లేవు. స్వతంత్ర అభ్యర్థిగా సినీనటి సుమలత బరిలోకి దిగడంతో భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. అక్కడ పోటీకి తమ పార్టీ అభ్యర్థిని దింపలేదు. దేవెగౌడ మనవడిని ఓడించాలన్నది యడ్యూరప్ప లక్ష్యంగా కన్పిస్తుంది. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు సయితం సుమలత వైపే ఉన్నారు.

ససేమిరా అంటున్న…..

మాండ్యలో అంబరీష్ అభిమానులు ఎక్కువ కావడం, వారంతా నిన్న మొన్నటి వరకూ అంబరీష్ నే అంటిపెట్టుకుని ఉండటంతో ఆయన సతీమణికి మద్దతుగా నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాండ్య కాంగ్రెస్ నేతలతో సమావేశమై చర్చించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కొంచెం కటువుగానే ఆదేశించారు. అయినా వారు మాత్రం కుమారస్వామి కుటుంబంపై పీకల వరకూ కోపాన్ని పెట్టుకుని ఉండటంతో వారు ససేమిరా అంటున్నారు. పరిస్థితిని తాము అదుపులోకి తెస్తామని సిద్ధరామయ్య చెబుతున్నా పోలింగ్ సమయంలో సుమలత వైపే వీరంతా మొగ్గు చూపే అవకాశం ఉంది.

కుమార వార్నింగ్…..

కాంగ్రెస్ అధిష్టానం సస్పెన్షన్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఫలితం ఉండబోదన్న సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్లు, వాటిని ఎత్తివేయడం సర్వ సాధారణమే. అయితే ఇదే సమయంలో కుమారస్వామి కూడా కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. తన కుమారుడిని ఓడించి తన రాజకీయ జీవితాన్ని పతనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అందులో కాంగ్రెస్ నేతలున్నారని ఆయన అనడం చర్చనీయాంశమైంది. తుముకూరు, హాసన్ లోనూ కాంగ్రెస్ నేతల తీరు ఇలాగే ఉందన్నారు. జాతీయ అవసరాల కోసమే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నామన్నారు. మొత్తం మీద మాండ్య ఫలితం సంకీర్ణ సర్కార్ భవిష్యత్తును తేల్చనుందన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News