అన్ని ప్రయత్నాలు చేస్తున్నారే….!!

కుమారస్వామి తన ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకునే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగాలనుకుంటున్న ఆయన అసంతృప్తులను మంత్రి పదవుల ద్వారా మచ్చిక చేసుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల [more]

Update: 2019-06-10 18:29 GMT

కుమారస్వామి తన ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకునే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా కొనసాగాలనుకుంటున్న ఆయన అసంతృప్తులను మంత్రి పదవుల ద్వారా మచ్చిక చేసుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కుమారస్వామి డీలా పడ్డారు. మాండ్యలో కుమారుడు, తుముకూరులో తండ్రి దేవెగౌడ ఓటమి పాలు కావడంతో ఆయన బాగా నీరసపడిపోయారు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కుమారస్వామి పాలనపై దృష్టి పెట్టారు.

తండ్రితో మంతనాలు….

దేవెగౌడ ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కర్ణాటక రాజకీయాలపై చర్చించి వచ్చారు. కుమారస్వామి ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా ఉండబోదని రాహుల్ నుంచి హామీని పొంది వచ్పారు. తాను ఓటమిపాలయినా కుమారస్వామి ప్రభుత్వం కొనసాగాలంటే కొన్ని సర్దుబాట్లు చేయకతప్పదని దేవెగౌడ సయితం భావిస్తున్నారు. దేవెగౌడ తో కుమారస్వామి దఫదఫాలుగా చర్చలు జరిపారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపై ఆయన నుంచి సలహాలు తీసుకున్నారు.

ఇక్కడి నేతలు సహకరించక….

అయితే రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు మాత్రం ఒకింత కుమారస్వామి పట్ల కినుకగానే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సహా మరికొందరు కుమారస్వామి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే రాహుల్ నుంచి పూర్తి స్థాయి హామీ ఉండటంతో పరోక్షంగా కుమారస్వామికి చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ జరిగితే ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి సూచిస్తున్నారు.

మంత్రి వర్గ విస్తరణతో…..

కానీ కుమారస్వామి మాత్రం మంత్రి వర్గ విస్తరణకు రెడీ అయిపోయారు. ఆయన ఈ నెల 12వతేదీన మంత్రి వర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు గవర్నర్ ను కూడా కలిశారన్న వార్తలు వస్తున్నాయి. తన మంత్రివర్గంలోకి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యేలను ఇద్దరిని తీసుకుంటున్నారు. ఆర్.శంకర్, నగేష్ లను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరికి ఈ విస్తరణలో చోటు దక్కే అవకాశముంది. మొత్తం మీద కుమారస్వామి సర్కార్ కూలిపోకుండా ఉండేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. యడ్యూరప్ప సవాల్ కు ధీటుగా జవాబు చెప్పాలని యోచిస్తున్నారు.

Tags:    

Similar News