జన్మలో వారితో కలిసేది లేదట

కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీలో అలకలు, బుజ్జగింపులు కామన్. కానీ అధికారంలో లేకపోయినా ఏదో రకంగా ప్రజల్లో నలగడం కన్నడ [more]

Update: 2020-12-13 17:30 GMT

కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీలో అలకలు, బుజ్జగింపులు కామన్. కానీ అధికారంలో లేకపోయినా ఏదో రకంగా ప్రజల్లో నలగడం కన్నడ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికల్లో జనతాదళ్ ఎస్ పూర్తిగా డీలా పడిపోయింది. కుమారుడు నిఖిల్ గౌడ, తండ్రి దేవెగౌడ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కుమారస్వామి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

కాంగ్రెస్ వల్లనే నష‌్టం….

దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ అని కుమారస్వామి ఆరోపణ. అయితే తాను చెప్పదలచుకుంది ఏదీ ఆయన మనసులో దాచుకోవడం లేదు. బహిరంగంగానే చెబుతున్నారు. కాంగ్రెస్ పై అసంతృప్తిని ఎప్పటికప్పుడు వెళ్లగక్కుతూనే ఉన్నారు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించడం వెనక సిద్ధరామయ్య ఉన్నారని ఎప్పటి నుంచో కుమారస్వామి ఆరోపిస్తున్నారు. అయితే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ తో ఇక కలవబోమని చెప్పకనే చెప్పాయి.

ఓటు బ్యాంకు మొత్తం…..

కాంగ్రెస్ తో పొత్తు కారణంగానే తాము రాష్ట్రంలో ఉనికి కోల్పోవాల్సి వచ్చిందని, అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నామని కుమారస్వామి అంటున్నారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో సయితం ఓటు బ్యాంకు కోల్పోవడానికి కాంగ్రెస్ తో పొత్తు అని కుమారస్వామి కుండబద్దలు కొట్టేశారు. తన తండ్రి దేవెగౌడ వత్తిడితోనే కాంగ్రెస్ తో జతకలిశామని, తనకు వ్యక్తిగతంగా ఇష్టంలేదని కూడా కుమారస్వామి చెప్పారు.

సిద్దూ పన్నిన కుట్రలో….

తమ పార్టీని కాంగ్రెస్ డ్యామేజీ చేసినంతగా బీజేపీ ఎప్పుడూ చేయలేదని కుమారస్వామి కమలం పార్టీ పట్ల సాఫ‌్ట్ కార్నర్ ను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన కుమారస్వామి కనీసం వంద స్థానాల్లో బలం పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక జన్మలో కాంగ్రెస్ తో కలిసేది లేదని చెబుతున్నారు. సిద్ధరామయ్య తనపై కుట్రపన్నారని కూడా కుమారస్వామి ఆరోపణలు చేశారు. చూస్తుంటే కుమారస్వామి వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ ఎలా ఉన్నా కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News