కుమార కౌశలానికి అగ్ని పరీక్ష ?

భారతాన కురు కుమారుల కౌశలానికి పెద్దల సమక్షంలో పరీక్ష నిర్వహిస్తారు. అందులో అతిరధులు, మహారధులు ఎవరో ముందే గ్రహించి పెద్దలు దీవిస్తారు. ఆధునిక రాజకీయాల్లో ఏలికల కుమారులకూ [more]

Update: 2020-11-28 15:30 GMT

భారతాన కురు కుమారుల కౌశలానికి పెద్దల సమక్షంలో పరీక్ష నిర్వహిస్తారు. అందులో అతిరధులు, మహారధులు ఎవరో ముందే గ్రహించి పెద్దలు దీవిస్తారు. ఆధునిక రాజకీయాల్లో ఏలికల కుమారులకూ సిసలైన పరీక్షలు తప్పవు. కుర్చీ ఎక్కాలంటే జనం ముందే తేల్చుకోవాలి. 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తొలి పరీక్ష అలవోకగా పాస్ అయిన ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ నాడు రాజకీయంగా బాహుబలిని అనిపించుకున్నాడు. ఆ తరువాత 2018 సార్వత్రిక ఎన్నికలను ఒంటి చేత్తో నడిపించిన కేటీఆర్ కాబోయే సీఎం అన్నంతగా పేరు తెచ్చుకున్నారు.

మోజు కరిగిన వేళ …

ఇపుడు చూస్తే టీయారెస్ సర్కార్ కి ప్రతికూలత పెరుగుతోంది. 2018 లో కాట్ వాక్ విజయాన్ని అందుకున్న టీయారెస్ కి 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలు పెద్ద ఝలక్ ఇచ్చెశాయి. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లు గెలుచుకుని టీయారెస్ బలాన్ని సగానికి తగ్గించాయి. తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక అయితే ఏకంగా టీయారెస్ పెద్ద ఎసరే పెట్టింది. దాంతో గ్రేటర్ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలి. అది కూడా గత ఎన్నికల ఫలితాలను మరపించేలా ఉండాలి.

కేటీఆర్ కి సవాల్…

ఇక కేసీయార్ కి ముఖ్యమంత్రి కుర్చీ అవసరం లేదు. ఆయన 2023లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే టీయారెస్ ని గెలిపించి కొడుకు కేటీఆర్ కి పట్టాభిషేకం చేయాలని తెగ ఉబలాటపడుతున్నాడు. తాను వీలైతే జాతీయ రాజకీయ యవనిక మీద కనిపించాలని తహతహలాడుతున్నాడు. మరి కంట్లో నలుసులా కమలం తెలంగాణాలో హడావుడి చేస్తోంది. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని కేసీయార్ మంత్రాంగం వేశారు. తన కుమారుడిని ముందు పెట్టి గ్రేటర్ లో విజయానికి దీక్ష చేపట్టారు. ఇక కేటీఆర్ చరిష్మా అయిదేళ్ళ క్రితం భాగ్యనగరంలో చెల్లింది. ఇక ఇపుడు ఆ హవా నడుస్తోందా అంటే చెప్పడం కష్టమే.

ఒక్కటి తగ్గినా సెగలే ……

గత ఎన్నికల్లో టీయారెస్ గ్రేటర్ పరిధిలో 99 డివిజన్లను గెలుచుకుంది. ఈసారి సెంచరీ కొడతామని ఢంకా భజాయిస్తోంది. అందులో ఒక్కటి తగ్గినా పులిలా మీద పడిపోయేందుకు కాషాయం పార్టీ రెడీగా కాచుకుని కూర్చుంది. ఇక గత ఎన్నికల్లో కమలానికి కేవలం మూడు సీట్లే వచ్చాయట. ఈసారి మేయర్ సీటు అని పైకి అంటున్నా కూడా ఆ పార్టీ టార్గెట్ 50 డివిజన్లు. కనీసం ముప్పయి నుంచి నలభై సీట్లు గెలుచుకున్నా బీజేపీని ఆపడం ఎవరి తరం కాదు, అపుడు కేటీఆర్ సీఎం కలలు కరిగిపోవాల్సిందే. పైగా గతంలో ఉన్నంత సానుకూలత టీయారెస్ కి గ్రేటర్ లో లేని వేళ కేటీఆర్ కదనరంగంలో దూకారు. మరి ఎప్పటిలాగానే గెలుచుకుని వస్తారా. లేక కమలానికి హుషార్ కలిగిస్తారా. చూడాల్సిందే.

Tags:    

Similar News