ఈయనకు ఇక్కడే సేఫ్.. కానీ బాబుపై ప్రెజర్ తో?

రాజ‌కీయాల్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి ఏకంగా మంత్రి ప‌ద‌వి రావ‌డం పెద్ద ల‌క్ చిక్కిన‌ట్టే అనుకోవాలి. అయితే ఈ ల‌క్కీ ఛాన్స్ వ‌చ్చిన వారిలో కొద్ది [more]

Update: 2020-08-14 00:30 GMT

రాజ‌కీయాల్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి ఏకంగా మంత్రి ప‌ద‌వి రావ‌డం పెద్ద ల‌క్ చిక్కిన‌ట్టే అనుకోవాలి. అయితే ఈ ల‌క్కీ ఛాన్స్ వ‌చ్చిన వారిలో కొద్ది మంది మాత్రమే త‌మ‌దైన ముద్ర వేయ‌డంతో పాటు పార్టీకి ప్రజ‌ల‌కు మ‌రింత చేరువ అవుతారు. టీడీపీ ప్రభుత్వంలో టీచ‌ర్ నుంచి మూడేళ్లకే మంత్రి అయిపోయారు కేఎస్‌.జ‌వ‌హ‌ర్‌. కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన జ‌వహ‌ర్ కొన్ని ద‌శాబ్దాలుగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరులో స్థిర‌ప‌డిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో కొవ్వూరులో పోటీ చేసి తొలి ప్రయ‌త్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన జ‌వ‌హ‌ర్ మూడేళ్లకే స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో మంత్రి అయ్యారు. ఎమ్మెల్యేగా మూడేళ్లలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో రెండేళ్లలో మంత్రిగా నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇందులో జ‌వ‌హ‌ర్ స్వయంకృతాప‌రాథం కొంత ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉండే క‌మ్మ సామాజిక వ‌ర్గం కోట‌రీ ఆయ‌న్ను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

వారు వ్యతిరేకించడంతో…

జ‌వ‌హ‌ర్‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చాక కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం చాలా అభివృద్ధి చెందిన మాట వాస్తవం. ముఖ్యంగా మీడియాలో జ‌వ‌హ‌ర్ పార్టీ త‌ర‌పున ఎప్పుడూ త‌న బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తూ వ‌చ్చారు. పార్టీతో పాటు తాను ఓడిపోయినా కూడా జ‌వ‌హ‌ర్ మాత్రం పార్టీ త‌ర‌పున వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చాక బ‌ల‌మైన మాదిగ సామాజిక వ‌ర్గంలో పార్టీకి చాలా ప్లస్ అయ్యింది. ఈ వ‌ర్గం నుంచి ఎంతో మంది కీల‌క నేత‌ల‌ను ఆయ‌న పార్టీలోకి తీసుకువ‌చ్చారు. అటు హిందూపురం పార్లమెంటు స్థానానికి పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవ‌హ‌రించారు. పార్టీలో త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌దైన ముద్ర వేయ‌డంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. ఇవ‌న్నీ చంద్రబాబుకు, లోకేష్‌కు తెలియ‌నివి కావు. అయినా ఎన్నిక‌ల ద‌గ్గర‌కు వ‌చ్చే స‌రికి జ‌వ‌హ‌ర్‌ను ఆయ‌న ఇష్టానికి వ్యతిరేకంగా ఆయ‌న‌కు ప‌ట్టున్న కొవ్వూరును కాద‌ని కృష్ణా జిల్లా తిరువూరుకు పంపారు.

వారి వత్తిడితోనే……

కేవ‌లం కొవ్వూరులో త‌న సామాజిక వ‌ర్గమైన క‌మ్మ వ‌ర్గం ఒత్తిళ్లకు త‌లొగ్గే జ‌వ‌హ‌ర్‌ను చంద్రబాబు అక్కడ నుంచి త‌ప్పించారు. వాస్తవానికి అక్కడ టీడీపీ రాజ‌కీయాన్ని కొన్ని ద‌శాబ్దాలుగా శాసిస్తోన్న ఒక‌రిద్దరు జ‌మిందారులకు మిన‌హా సామాన్య జ‌నానికి, ప్రజ‌ల‌కు జ‌వ‌హ‌ర్ ప‌ట్ల మంచి అభిప్రాయం ఉంది. జ‌వ‌హ‌ర్‌ను త‌ప్పించిన చంద్రబాబు ఎక్కడో విశాఖ జిల్లా నుంచి తీసుకు వ‌చ్చి అనిత‌ను పోటీ పెట్టగా ఆమె ఓడిపోయిన వెంట‌నే అడ్రస్ లేరు. ఇక ఇప్పుడు కొవ్వూరు టీడీపీ ఇన్‌చార్జ్ ఖాళీగా ఉంది. స్థానిక కేడ‌ర్ అంతా జ‌వహ‌ర్‌ను మాత్రమే కోరుకుంటున్నారు. ఇటు త‌న‌కు అనువ‌ణువు ప‌ట్టున్న కొవ్వూరులో కాకుండా తిరువూరులో ఉండ‌డం జ‌వ‌హ‌ర్‌కు క‌ష్టంగానే ఉంది. పైగా తిరువూరులో మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు సైతం త‌న‌కు ఇక్కడ బాధ్యత‌లు ఇవ్వరా ? అని వెయిటింగ్‌లో ఉన్నారు.

అదయితేనే మేలు……

ఇప్పటికే గుంటూరు లాంటి కీల‌క జిల్లాలో ఖాళీగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఆయ‌న ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక‌టి రెండు నెల‌ల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు. అందుకే ఇప్పుడు కొవ్వూరు ఇన్‌చార్జ్ కూడా తేల్చేయాల‌ను కుంటున్నార‌ట‌. వాస్తవంగా చూస్తే ఇప్పటికే పార్టీ వ‌రుస‌గా నాలుగు సార్లు ఓడిపోతూ వ‌స్తోన్న తిరువూరు కంటే జ‌వ‌హ‌ర్‌కు కొవ్వూరు కంచుకోట అవుతుంది అన‌డంలో డౌట్ లేదు. అయితే జ‌వ‌హ‌ర్ కొవ్వూరులో స‌రి చేసుకోవాల్సిన అంశాలు కూడా చాలానే ఉన్నాయి. అక్కడ ఆయ‌న‌కు వ్యతిరేకంగా ఉన్న కొంద‌రు ద్వితీయ శ్రేణి కేడ‌ర్‌ను కూర్చోపెట్టి మాట్లాడుకుంటే స‌మ‌స్య సులువుగా ప‌రిష్కారం అయిపోతుంది. మ‌రి చంద్రబాబు జ‌వ‌హ‌ర్‌కు కొవ్వూరు ప‌గ్గాలు అప్పగిస్తారా ? లేదా త‌న వ‌ర్గంలో ఒక‌రిద్దరు జ‌మిందారుల‌కు ఎక్కడ కోపం వ‌స్తుందో ? అని నాన్చుకుంటూ పోతారా ? అన్నది చూడాలి. ఒక్క కొవ్వూరులోనే కాదు క‌మ్మ సామాజిక వ‌ర్గ ఆధిప‌త్యం ఉన్న అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితులు ఉన్నాయి.

Tags:    

Similar News