కొలుసుకు ఎదురీత‌.. పార్టీలో స‌హ‌కారం అంతంత మాత్రమేనా?

కొలుసు పార్థసార‌ధి. కృష్ణాజిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు. విజ‌య‌వాడ‌కు స‌మీపంలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌. మాజీ మంత్రి. [more]

Update: 2020-06-06 03:30 GMT

కొలుసు పార్థసార‌ధి. కృష్ణాజిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు. విజ‌య‌వాడ‌కు స‌మీపంలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌. మాజీ మంత్రి. అయితే, ఇప్పుడు ఆయ‌న‌కు వైసీపీలోనే ఎదురీదాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో వైఎస్ అనుచ‌రుడిగా ఎదిగిన కొలుసు పార్థసారధి ఆయ‌న కేబినెట్‌లోనే మంత్రి ప‌ద‌విని అలంక‌రించారు. 2009 ఎన్నికల్లో జిల్లాలో మ‌హామ‌హులు ఓడిపోవ‌డంతో నాడు వైఎస్ పార్థసార‌ధికి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆయ‌న రోశ‌య్య, కిర‌ణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో సైతం మంత్రిగా ప‌నిచేశారు. చాలా మంది నాయ‌కులు వైఎస్ మృతి త‌ర్వాత‌.. జ‌గ‌న్‌కు అండ‌గా నిలిచినా..కొలుసు పార్థసారధి మాత్రం రాలేదు. అయితే, ఎట్టకేల‌కు 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

బలమైన సామాజిక వర్గానికి చెందిన….

అయితే, జ‌గ‌న్ మాట కోసం త‌నకు క‌లిసి వ‌చ్చిన పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం వ‌దులుకుని మ‌చిలీప‌ట్నం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే, ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత కూడా పార్టీలోనే కొన‌సాగిన కొలుసు పార్థసారధి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి పెన‌మ‌లూరు సాధించి విజ‌యం ద‌క్కించుకున్నారు. అదే స‌మయంలో జ‌గ‌న్ కేబినెట్‌లో సీటు ఆశించారు. బీసీల్లో బ‌ల‌మైన యాద‌వ సామాజిక వ‌ర్గం కోటాలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రావాలి కూడా. కానీ, కొలుసు పార్థసారధికి అనుకున్న విధంగా ప‌ద‌వి ద‌క్క‌లదు. విప్ ప‌ద‌విని ఇస్తాన‌ని జ‌గ‌న్ ఆఫ‌ర్ చేసినా.. కాద‌న్నారు. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు మెంబ‌ర్‌గా అవ‌కాశం క‌ల్పించారు. ఇంత వ‌రకు బాగానే ఉన్నప్పటికీ.. రెండున్న‌రేళ్ల త‌ర్వాత అయినా.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కక‌పోతుందా? అని కొలుసు పార్థసారధి ఆశ పెట్టుకున్నారు.

నిధుల కోసం ప్రయత్నిస్తున్నా….

అయితే, మారిన స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో కృష్ణాజిల్లాలోనే ఆయ‌న‌కు ఎగ‌స్పార్టీ ఏర్పడింద‌ని, సొంత పార్టీకి చెందిన నాయ‌కులు కొలుసు పార్థసారధికి స‌హ‌క‌రించ‌డం లేద‌ని అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు నియోజ‌క‌వర్గంలో వైసీపీ తాలూకు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల్సి ఉంది. అయితే, దీనికి సంబంధించిన నిధుల కోసం ఆయ‌న చేస్తున్న ప్రయ‌త్నాల‌కు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఒకరు అడ్డు ప‌డుతున్నార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో ఇంచార్జ్ మంత్రిగా ఉన్న నాయ‌కుడు కూడా కొలుసును పెద్దగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

భవిష్యత్తులోనూ దక్కదా?

ఇటు మంత్రి ప‌ద‌వి లేదు. అటు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు కూడా కావ‌డం లేదు.. ఒక‌ప్పుడు జిల్లాను శాసించిన కొలుసు పార్థసారధి నేడు అన్ని అర్హత‌లు ఉండి… అధికార పార్టీలో ఉండి కూడా చేష్టలుడిగి చూస్తున్నార‌న్న చ‌ర్చలు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికే సార‌ధి ప‌ద‌వి లాక్కుపోయిన అనిల్‌కుమార్ యాద‌వ్ దూకుడుగా ఉండ‌డంతో పాటు జ‌గ‌న్ కోట‌రీలో కీల‌కంగా ఉండ‌డంతో కొలుసు పార్థసారధికి రెండున్నరేళ్ల త‌ర్వాత అయినా మంత్రి ప‌ద‌వి వ‌స్తుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సార‌ధి రాజ‌కీయంగా తీవ్ర సంక‌ట స్థితి అయితే ఎదుర్కొంటున్నార‌ని అంటున్నారు.

Tags:    

Similar News