kodandaram : పెద్దాయన మళ్లీ తప్పు చేస్తున్నారా?

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయంగా ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే కాంగ్రెస్ తర్వాత కోదండరామ్ అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషిని [more]

Update: 2021-10-04 09:30 GMT

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయంగా ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే కాంగ్రెస్ తర్వాత కోదండరామ్ అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినా అన్ని పార్టీలను ఏకం చేసి రాజకీయ జేఏసీ ఛైర్మన్ గా నాడు కోదండరామ్ పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ప్రొఫెసర్ గా ఎందరికో పాఠాలు చెప్పిన కోదండరామ్ రాజకీయ పాఠాలు నేర్చుకోవడంలో విఫలమయ్యారని మాత్రం చెప్పకతప్పదు.

కాంగ్రెస్ పార్టీకి…..

మరోసారి కోదండరామ్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఆయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహాకూటమికి ఆయనే పెద్దదిక్కు అయ్యారు. టీఆర్ఎస్ ను ఓడించడానికి ఆయన పోటీ నుంచి కూడా తప్పుకున్నారు. జనగామ నుంచి కోదండరామ్ పోటీ చేయాలని భావించినా పొన్నాల లక్ష్మయ్య కోసం ఆలోచనను పక్కనపెట్టి, కూటమి విజయం కోసం పనిచేశారు.

పక్కన పెట్టినా….

కానీ కాంగ్రెస్ మాత్రం కోదండరామ్ ను గుర్తించలేదు. తర్వాత కాలంలో పెద్దాయనను పక్కన పెట్టింది. పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లోనూ కోదండరామ్ కు మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలోకి దించింది. దీంతో గెలుస్తారనుకున్న ప్రొఫెసర్ పరాజయం పాలయ్యారు. ఇది ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టింది. చివరకు కమ్యునిస్టు పార్టీలు కూడా కోదండరామ్ సార్ ను వదిలించుకునే దిశగానే ప్రయత్నించాయి.

రేవంత్ రాకతో….

అయితే తాజాగా జరిగిన పరిణామాలు మరోసారి కోదండరామ్ కాంగ్రెస్ కు మద్దతుదారుగా నిలిచే అవకాశాలున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా రావడంతో మరోసారి కాంగ్రెస్ తో కలసి ప్రయాణం చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ జనసమితి పార్టీ తరుపున బలమున్న చోట అభ్యర్థులను పోటీ చేయించి, కాంగ్రెస్ కు మద్దతివ్వాలన్నది పెద్దాయన ఆలోచనగా ఉంది. మరోసారి కోదండరామ్ నిర్ణయం రాజకీయంగా లాభం చేకూరుస్తుందా? నష్టపరుస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News