నాని భయపడుతున్నదందుకేనా?

ఆయ‌న నోరు విప్పితే.. ఘాటైన విమ‌ర్శలు. దూకుడైన వ్యాఖ్యలు. ఘాటు విమ‌ర్శల‌కు ఆయ‌న కేరాఫ్‌. ఆయ‌నే వైసీపీ మంత్రి, కృష్ణా జిల్లాకు చెందిన నాయ‌కుడు, గుడివాడ సీనియ‌ర్ [more]

Update: 2020-01-05 08:00 GMT

ఆయ‌న నోరు విప్పితే.. ఘాటైన విమ‌ర్శలు. దూకుడైన వ్యాఖ్యలు. ఘాటు విమ‌ర్శల‌కు ఆయ‌న కేరాఫ్‌. ఆయ‌నే వైసీపీ మంత్రి, కృష్ణా జిల్లాకు చెందిన నాయ‌కుడు, గుడివాడ సీనియ‌ర్ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంక‌టేశ్వర‌రావు ఉర‌ఫ్ నాని. ఆదిలో టీడీపీతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న కొన్నాళ్లు టీడీపీ నుంచే గుడివాడ‌లో ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే, త‌ర్వాత కాలంలో ఆయ‌న చంద్రబాబుతో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్రమంలోనే వైసీపీకి మ‌ద్దతుదారుగా మారి.. అనంత‌రం పార్టీ అధినేత జ‌గ‌న్‌కు చేరువ‌య్యారు. ఇక‌, ఆ త‌ర్వాత కూడా వైసీపీ త‌ర‌ఫున వ‌రుస‌గా ఆయ‌న విజ‌యాలు సాధిస్తూనే ఉన్నారు. ఇదిలావుంటే, టీడీపీ అంటే మండిప‌డే కొడాలి నాన దూకుడు విమ‌ర్శలు చేయ‌డంలోనూ గుర్తింపు పొందారు.

బాబును ఇరకాటంలోకి నెట్టడంలో…

ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, సీనియ‌ర్ నాయ‌కుడు, సీఎంగా సీనియ‌ర్ అయిన‌ చంద్రబాబును ఏక‌వ‌చ‌నంతో సంబోధిస్తూ.. వ్యాఖ్యలు చేయ‌డంలోనూ కొడాలి నానిని మించిన నాయ‌కులు లేరు. ఇటీవ‌ల కూడా స‌న్నబియ్యం విష‌యంలో టీడీపీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో కొడాలి నాని దుమ్మెత్తి పోశారు. నీ అమ్మ మొగుడికి చెప్పానా? అంటూ.. తీవ్ర ప‌రుష ప‌దాల‌తో ఆయ‌న దూకుడు ప్రద‌ర్శించారు. దీంతో వైసీపీకి మంచి ఫైర్ బ్రాండ్ దొరికాడ‌నే ఆనందం వైసీపీలోను ఆయ‌న‌తో మ‌న‌కెందుకులే అనుకునే త‌త్వం టీడీపీలోనూ క‌నిపించింది. అయితే, అలాంటి కొడాలి నాని ఇప్పుడు కీల‌క‌మైన రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో మాత్రం సైలెంట్ అయిపోయారు. అమ‌రావ‌తి విష‌యంలో టీడీపీ మొత్తంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమ‌ర్శలుగుప్పిస్తోంది.

సామాజికవర్గం నేపథ్యంలోనేనా?

ఈ నేప‌థ్యంలో మంత్రి పేర్ని నాని వంటి సౌమ్యులు ప్రతివిమ‌ర్శలు కౌంట‌ర్లు ఇస్తున్నారు. అయితే, ఇదే జిల్లాకు చెందిన కొడాలి నాని మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో అస‌లు ఎందుకు ఆయ‌న ఇంత మౌనం పాటిస్తున్నారు ? అనే సందేహం అంద‌రిలోనూ వ్యక్తమ‌వుతోంది. రాజ‌ధాని ప్రాంతంలో క‌మ్మ వ‌ర్గానికి చెందిన కొంద‌రికి మేలు చేయాల‌నే లక్ష్యంతోనే చంద్రబాబు అక్కడ అమ‌రావ‌తి ఏర్పాటు చేశార‌ని వైసీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. దీంతో క‌మ్మ వ‌ర్గంలో ఒకింత ఆవేద‌న ఉంది. గుడివాడ‌లోని క‌మ్మ సామాజిక వ‌ర్గంలోనూ జ‌గ‌న్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆవేద‌న క‌నిపిస్తోంది.

ఓటు బ్యాంకు దెబ్బతింటుందనేనా?

కృష్ణా జిల్లాలో వైసీపీ క‌మ్మలే కాకుండా.. ఆ పార్టీ వీరాభిమానులుగా ఉన్న మిగిలిన నేత‌లు సైతం జ‌గ‌న్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. పైకి ఎవ‌రూ కామెంట్లు చేయ‌క‌పోయినా.. జ‌గ‌న్ ప్రభుత్వం అమ‌రావ‌తి విష‌యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోన‌ని వారంతా వేచి చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అదే సామాజిక వ‌ర్గానికి చెందిన తాను మీడియా ముందుకు వ‌చ్చి చంద్రబాబును కానీ, అమ‌రావ‌తి విష‌యంలో కానీ జోక్యం చేసుకుంటే గుడివాడ‌లోని క‌మ్మ ఓటు బ్యాంకుపై ప్రభావం ప‌డుతుంద‌ని కొడాలి నాని భావిస్తున్నట్టు చెబుతున్నారు. నిన్నటి వ‌ర‌కు లోకేష్‌, బాబు, ఉమాతో పాటు టీడీపీ నేత‌ల‌పై ఒంటికాలితో లేచిన కొడాలి నాని ప్రస్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలోనే ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నార‌నే ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి ఎన్నాళ్లు మౌనంగా ఉంటారో చూడాలి.

Tags:    

Similar News