ఆపరేషన్ సక్సెస్… వాట్ నెక్ట్స్…..?

బీజేపీ ఏ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనివ్వదు. చివరకు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనూ కక్ష సాధింపు చర్యలకు దిగడం బీజేపీకి అలవాటుగా మారింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే [more]

Update: 2021-02-27 17:30 GMT

బీజేపీ ఏ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనివ్వదు. చివరకు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనూ కక్ష సాధింపు చర్యలకు దిగడం బీజేపీకి అలవాటుగా మారింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే ఇదే అనిపించక మానదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చగలిగింది. అనేక మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రభుత్వం ఎన్నికల వేళ దిగిపోయే పరిస్థితికి బీజేపీ తెచ్చింది.

వరస రాజీనామాలతో….

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో వరసగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం బలం కోల్పోయింది. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అధికార, విపక్ష సభ్యుల బలం సమానంగా మారింది. దీంతో ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి బీజేపీ షాకిచ్చింది. దీంతోపాటు తన తప్పేమీ లేదని తెలియజెప్పడానికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీని తప్పించింది. ఇది కంటితుడుపు చర్యగానే చూడాలి.

నాలుగేళ్ల నుంచి…..

దాదాపు నాలుగేళ్ల నుంచి పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి నారాయణస్వామి లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో పోరాడుతూనే ఉన్నారు. ప్రతి పనికీ కిరణ్ బేడీ అడ్డుతగులుతున్నారని నారాయణస్వామి రాష్ట్రపతి నుంచి అందరికీ ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయినా ఫలితం లేదు. చివరకు ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రమాదంలోకి పడిపోయేలా బీజేపీ వ్యూహరచన చేసింది. నమ్మకమైన నేతలే కాంగ్రెస్ పార్టీని వీడటం ఆ పార్టీకి షాక్ అనే చెప్పాలి.

ఆపరేషన్ సక్సెస్…..

బీజేపీ ఎప్పటి నుంచో పుదుచ్చేరిలో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కిరణ్ బేడీని అందుకే లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ముందుగా తీసుకువచ్చింది. కిరణ్ బేడీ తన ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా ముగించేశారు. నారాయణస్వామి ప్రభుత్వాన్ని గత మూడున్నరేళ్లుగా ముప్పుతిప్పలు పెట్టారు. ఇక మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరుగుతుండటంతో పుదుచ్చేరిలో బీజేపీ బలం పెంచుకోవడానికి చేసిన ప్రయత్నమే ఎమ్మెల్యేల రాజీనామాకు కారణమని చెప్పక తప్పదు. మొత్తం మీద కిరణ్ బేడీ తనకు అప్పగించిన బాధ్యతలను సక్సెస్ ఫుల్ గా ముగించారు.

Tags:    

Similar News