అదే జరిగితే… నిర్ణయం అదేనా?

ఉత్తరాంధ్రా జిల్లాలలో టీడీపీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మట్టికొట్టుకుపోయింది. ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు దక్కింది. అదీ బలమైన బీసీ వర్గానికి చెందిన కింజరాపు కుటుంబ [more]

Update: 2020-08-16 15:30 GMT

ఉత్తరాంధ్రా జిల్లాలలో టీడీపీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మట్టికొట్టుకుపోయింది. ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు దక్కింది. అదీ బలమైన బీసీ వర్గానికి చెందిన కింజరాపు కుటుంబ వారసుడు రామ్మోహననాయుడు రెండవసారి గెలిచాడు. యువకుడు, విద్యావంతుడు కావడంతో కొంత మొగ్గు కనిపించింది. అయితే ఇపుడు ఆ సీటు కూడా ఎగిరిపోతుందా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీకి ఏమంత బాగాలేదు అన్న అభిప్రాయం ఉంది. అమరావతి అంటూ చంద్రబాబు గొంతు చించుకోవడంతో ఇక్కడ బాగానెగిటివిటీ పెరుగుతోంది. ఇది చాలదన్నట్లుగా అధికార వైసీపీ దూకుడు రాజకీయం కూడా తమ్ముళ్లను కలవరపెడుతోంది. ఈ ప్రభావం ఏకైక టీడీపీ ఎంపీ రామ్మోహననాయుడు మీద పడినట్లుగా ఉందంటున్నారు.

కుటుంబం బాధేనా..?

బాబాయ్ అచ్చెన్నాయుడు పెద్ద గొంతు వేసుకుని జిల్లాలో తిరిగేవారు. చంద్రబాబు తరువాత తానేనని కూడా బిల్డప్ ఇచ్చేవారు. బీసీ వర్గం అంతా తన వెనకాలేన‌ని కూడా కలరింగ్ ఇచ్చేవారు. ఇపుడు ఆ మబ్బులన్నీ క్రమంగా తొలగిపోయాయి. ఎందుచేతనంటే అచ్చెన్నను అరెస్ట్ చేస్తే ఊగిపోతుందనుకున్న ఉత్తరాంధ్ర పూర్తిగా సైలెంట్ గా ఉంది. బీసీలు ఎవరూ చొక్కాలు చింపుకోలేదు. టీడీపీ నుంచి పెద్దగా నిరసన వ్యక్తం కావడం లేదు. మొత్తానికి అచ్చెన్న బాధ జనం బాధ కాదు, కుటుంబం బాధే అయింది. రామ్మోహననాయుడు ఎంపీ గా ఉంటూ కూడా బాబాయిని బెయిల్ మీద తీసుకురాలేకపోతున్నాడు అంటూ సొంత పార్టీలోనే ఎకసెక్కాలు మొదలయ్యాయట.

బాబాయ్ కోసమా…?

ఈ నేపధ్యంలో రామ్మోహననాయుడు మీద తీవ్ర వత్తిడి పెరిగిపోతోందిట. యువ నేతగా ఉండడంతో పాటు దూకుడుగా రాజకీయం ఎరగని రామ్మోహన్నాయుడుకు ఇదంతా కొత్తగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సవాల్ గా కూడా ఉంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి రెండు నెలలు పైదాటిపోతోంది. వైసీపీ సర్కార్ పక్కాగా అన్ని ఆధారాలతో ఆయన్ని జైలు పాలు చేసింది. దాంతో బెయిల్ రావడం కష్టంగా మారింది. ఇలా అయితే ఎన్నాళ్ళు అయినా బెయిల్ వస్తుందన్న నమ్మకం లేకుండా పోతోంది. ఓ వైపు కుటుంబ సభ్యుల వత్తిడి, మరో వైపు ఏం చేస్తారో చూస్తున్న పార్టీ నేతల మధ్య కుర్ర ఎంపీ నలిగిపోతున్నారుట. దీంతో ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారుట. తన బాబాయిని బయటకు తీసుకురావడానికి అవసరం అయితే టీడీపీని వదిలేస్తానని చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

బీజేపీలోకా…?

ఇపుడున్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ దూకుడు రాజకీయాల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరడమే మార్గమని రామ్మోహననాయుడు ఆలోచిస్తున్నట్లుగా బోగట్టా. మరో వైపు టీడీపీ అధినాయక‌త్వం మీద యువ ఎంపీ గుస్సా అవుతున్నట్లుగా చెబుతున్నారు. అచ్చెన్నను వైసీపీ వారు ఇరికిస్తే ఆయన ఖర్మానికి టీడీపీ పెద్దలు వదిలేశారని కూడా రామ్మోహన్ మండుతున్నట్లుగా వినికిడి. రామ్మోహననాయుడిని అప్పట్లోనే బీజేపీ వారు చేరమని అడిగారు, లోక్ సభలో స్వచ్చమైన ఆయన హిందీ ప్రసంగం చూసి బీజేపీ పెద్దలే ముచ్చట పడ్డారని చెబుతారు. ఇక బీజేపీకి కూడా ఉత్తరాంధ్రాలో పార్టీ విస్తరణ అవసరం. దాంతో రామ్మోహననాయుడుని చేర్చుకోవడానికి కాషాయం పార్టీ ఎపుడూ రేడీనే. మరి బాబాయ్ విడుదల కోసం బీజేపీ నుంచి సహకారం ఉంటుందా. ఆ షరతులకు వారు అంగీకరిస్తారా అన్నది చూడాలి. అదే కనుక జరిగితే టీడీపీకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో గట్టి దెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News