కుదిపేసేటట్లున్నాడే…?

ఏపీలో బలపడాలని అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. మరో వైపు పడమర దిక్కుకు జారిపోతున్న పార్టీలు కూడా ఇక్కడే ఉన్నాయి. రాజకీయాల్లో ఎపుడూ ఎవరికీ అధికారం శాశ్వతం [more]

Update: 2019-09-29 03:30 GMT

ఏపీలో బలపడాలని అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. మరో వైపు పడమర దిక్కుకు జారిపోతున్న పార్టీలు కూడా ఇక్కడే ఉన్నాయి. రాజకీయాల్లో ఎపుడూ ఎవరికీ అధికారం శాశ్వతం కాదు, ఇక తరతరాలుగా మాదే అధికారం అని ఎవరైన అనుకుంటే తాజా ఎన్నికల ఫలితాలు కనువిప్పు లాంటివే అనుకోవాలి. ఏపీలో అతి బలమైన పార్టీగా టీడీపీ ఆరు నెలల క్రితం వరకూ కనిపించేది. అది అధికారం వాపు తప్ప అసలు కధ వేరేగా ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నలభయ్యేళ్ల టీడీపీలో ఇపుడు వ్యవహారం చరమాంకానికి వచ్చేసిందా అన్నట్లుగా ఘటనలు వరసగా సాగుతున్నాయి. నేత‌ల్లో ధీమా క్రమంగా సన్నగిల్లుతోంది. దాంతో తమ్ముళ్ల చూపులు కూడా వేరే దిక్కుల వైపునకు సాగుతున్నాయి. రామ్మోహన్ నాయుడు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారా?

అబ్బాయికి గేలమా…?

శ్రీకాకుళం జిల్లాలో బీజేపీకి అసలు బలం లేదు. ఆ పార్టీకి ఉన్న సత్తా అంతా విశాఖ అర్బన్ జిల్లాలో కొన్ని ప్యాకెట్లలో పట్టు మాత్రమే. అది కూడా ఒకప్పుడు విశాఖ కార్పొరేషన్ గెలుచుకున్న ప్రభావంతో పాటు, గట్టి నాయకులు కూడా ఇక్కడ వారు ఉండడం మరో కారణం. ఇక మేధావులు, విద్యావంతులు ఉన్న చోట గతంలో బీజేపీకి ఆదరణ బాగా ఉండేది. ఇపుడు కూడా విశాఖ సిటీ వరకూ బీజేపీకి కొంత అనుకూలత ఉంది. అది దాటి ముందుకు వెళ్తే మాత్రం కమలం జాడలే ఎవరికీ తెలియవు. వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలో బీజేపీకి ఎపుడూ డిపాజిట్ వచ్చిన దాఖలాలు కూడా లేవు. అయితే కేంద్రంలో నరేంద్ర మోడీని చూపించి ఏపీలొ టీడీపీ గడ్డు పరిస్థితిని సొమ్ము చేసుకుని బలపడదామని బీజేపీ ఎత్తులు వేస్తోంది. దాంతో ఇక్కడ టీడీపీ, వైసీపీ ల నుంచి బలమైన నేతలకు గాలం వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా అనగానే దివంగత నేత, రాజకీయ పోరాటయోధుడు కింజరపు ఎర్రన్నాయుడు గుర్తుకువస్తారు. ఆయనకు అక్కడ మంచి పట్టు ఉంది. దాంతోనే ఆయన రాజకీయ వారసులుగా కుమారుడు రామ్మోహన్నాయుడు, తమ్ముడు అచ్చెన్నాయుడు వరసగా గెలుస్తూ వస్తున్నారు. ఇపుడు అబ్బాయి రామ్మోహన్నాయుడు మీద బీజేపీ దృష్టి పడిందంటున్నారు.

ముగ్గురిలో ఎవరో…?

ఏపీలో టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారిలో అంతా వరసగా రెండవమారు గెలిచిన వారే. విజయవాడ ఎంపీ కేశినేని నాని, గుంటూరు ఎంపీ గల్ల జయదేవ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు చురుకుగా ఉంటూ వస్తున్న వారే. ఇక రామ్మోహన్ న్నాయుడు కాకుండా మిగిలిన ఇద్దరూ బాబు సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. నాని కొన్నాళ్లు అటూ ఇటూ ఊగినా ఆయన ఇపుడు పెద్దగా మాట్లాడడంలేదు. ఇక ఈ మధ్యనే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డిని కలిశారని వార్తలు వచ్చాయి. ఏపీలో శాంత్రిభద్రతలు లేవని ఫిర్యాదు చేయడానికి వీరు కలిశారని అంటున్నా కూడా అంతకు మించి ఏదో ఉందన్న టాక్ కూడా నడుస్తోంది. ఇపుడు ఆ ప్రచారంలో రామ్మోహన్ నాయుడు పేరు కూడా జత కలుస్తోంది. రామ్మోహన్నాయుడు బీజేపీలో చేరుతారా అన్నది పెద్ద చర్చగా ఉంది. రానున్న రోజుల్లో ఏపీ నుంచి పెద్ద ఎత్తున బడా నాయకులు తమ పార్టీలోకి వస్తారని బీజేపీ ప్రచారం చేస్తున్న తరుణంలో సిక్కోలు రాజకీయాల్లో పెద్ద కుదుపు ఉంటుందని అంటున్నారు. వైసీపీకి చెందిన కీలక నేత కూడా ఒకరు టచ్ లో ఉన్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News