కేశినేని కూతురిని అలా చేయలనేనా?

రాజ‌కీయాల్లోకి రావ‌డం అంటే.. ప‌దవులు ద‌క్కించుకోవ‌డం.. అధికారం చ‌లాయించ‌డం కోస‌మే అన‌డంలో ఎలాంటి స‌ందేహం లేదు. నేత‌లు ఎవ‌రైనా.. ఎలాంటి వారైనా ఖ‌చ్చితంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక చేతులు [more]

Update: 2021-05-22 12:30 GMT

రాజ‌కీయాల్లోకి రావ‌డం అంటే.. ప‌దవులు ద‌క్కించుకోవ‌డం.. అధికారం చ‌లాయించ‌డం కోస‌మే అన‌డంలో ఎలాంటి స‌ందేహం లేదు. నేత‌లు ఎవ‌రైనా.. ఎలాంటి వారైనా ఖ‌చ్చితంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక చేతులు ముడుచుకుని మాత్రం ఎవ‌రూ కూర్చోరు. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే టీడీపీలోనూ చోటు చేసుకుంది. టీడీపీ త‌ర‌ఫున వ‌రుస‌గా పార్లమెంటుకు విజ‌యం సాధిస్తున్న విజ‌య‌వాడ నాయ‌కుడు కేశినేని నాని.. ఇటీవ‌ల జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను స‌వాలు తీసుకుని పోరాటం చేశారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో….

ఈ క్రమంలోనే విజ‌య‌వాడ న‌గ‌ర మేయ‌ర్‌గా త‌న కుమార్తె శ్వేత కేశినేనిని ప్రమోట్ చేసుకునేందుకు, ఆమెను విజ‌యవాడ మేయ‌ర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు.. రేయింబ‌వ‌ళ్లు పోరాటం చేశారు. ఇక‌, త‌న పార్టీ నేత‌ల నుంచి ఎదురైన అసంతృప్తిని కూడా త‌ట్టుకుని కేశినేని నాని ముందుకు సాగారు. అయితే.. ఇంత చేసినా.. ఆయ‌న స‌క్సెస్ కాలేక పోయారు. శ్వేత కేశినేని కార్పొరేట‌ర్‌గా అయితే.. గెలిచినా.. మేయ‌ర్ పీఠం ద‌క్కించుకోలేక పోయారు. టీడీపీ పూర్తిగా చ‌తికిల ప‌డ‌డంతో శ్వేత కు అవ‌కాశం ద‌క్కకుండా పోయింది.

పశ్చిమ నియోజకవర్గంపై…

అయితే.. రాజ‌కీయాల్లోకి ఎలాగూ వేలు పెట్టిన త‌ర్వాత‌.. ఒక ఛాన్స్ మిస్సయితే.. మ‌రొక‌టి దొర‌క‌క‌పోతుందా? అనే ఆశావ‌హ దృక్ఫథంతో ఇప్పుడు ఏకంగా ఆమె.. ఎమ్మెల్యే పీఠంపై దృష్టి పెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యవాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే అవ‌కాశంపై ఆమె ఇప్పటి నుంచి దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. ప్రస్తుతం క‌రోనా నేప‌థ్యంలో మ‌ధ్యాహ్నం నుంచి లాక్‌డౌన్‌(క‌ర్ఫ్యూ) అమ‌ల్లో ఉన్నందున‌.. కేశినేని నాని కుమార్తె శ్వేత‌.. ఇక్కడ పేద వారికి ఆహారం ఇత‌ర‌త్రా నిత్యవ‌స‌రాల‌ను పంచుతున్నారు. ఇదే స‌మ‌యంలో పార్టీ నేత‌ల‌కు కూడా చేరువ అవుతున్నారు.

గత ఆరేళ్ల నుంచి…..

అటు కేశినేని నాని పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయ‌న పార్టీ నేత‌లు బుద్ధా వెంక‌న్న, షేక్ నాగుల్ మీరాతో గ్యాప్ పెంచుకున్నారు. ఇక గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేళ కూడా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగానే టీడీపీలో పెద్ద ర‌చ్చ న‌డిచింది. ప‌శ్చిమ‌లో కేశినేని నాని ఎందుకు వేలు పెడుతున్నార‌నే బుద్ధా, నాగుల్ మీరా రెచ్చిపోయారు. అయితే నాని మాత్రం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపై గ‌త ఆరేడేళ్లుగా ప‌ట్టు పెంచుకోవ‌డానికి కార‌ణం ఏంట‌న్నది పెద్దగా అంతుప‌ట్టలేదు. దీని వెన‌క త‌న కుమార్తెను అక్కడ పోటీ చేయించే స్కెచ్ ఉంద‌ని ఇప్పుడు అర్థమ‌వుతోంది.

పార్టీకి నేత లేకపోవడంతో…?

మొన్న ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో కార్పొరేట‌ర్‌గా గెలిచిన శ్వేత ఆ నియోజ‌క‌వ‌ర్గంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ ప్రస్తుతం టీడీపీని నిల‌బెట్టే నాయ‌కుడు అంటూ ఎవ‌రూ లేక‌పోవ‌డం .. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ తెచ్చుకుని పోటీ చేసి ఓడిపోయిన ష‌బానా ఖ‌తూన్ అమెరికాలో ఉండ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రూ బ‌లమైన అభ్యర్థి టీడీపీలో ఎద‌గ‌క‌పోవ‌డం వంటి ప్రధాన కార‌ణాల నేప‌థ్యంలో శ్వేత‌కు ఇక్కడ టిక్కెట్ ఇప్పించుకోవాల‌ని కేశినేని నాని వ‌ర్గం భావిస్తోంది. ట్రయ‌ల్‌గా భావించిన కార్పొరేటర్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం ఆమెకు క‌ల‌సి వ‌చ్చింది. అయితే ఎంపీతో పాటు న‌గ‌రంలోనే తూర్పు సీటు నుంచి క‌మ్మ నేత‌లే ప్రాతినిధ్యం వ‌హిస్తుండడంతో ప‌శ్చిమ‌లో బీసీ, వైశ్య, ముస్లిం వ‌ర్గాల‌ను కాద‌ని మ‌ళ్లీ క‌మ్మల‌కు ఛాన్స్ ఇవ్వడం అయితే క‌ష్టమే ? మ‌రి కేశినేని నాని స్కెచ్‌లు ఎంత వ‌ర‌కు నెర‌వేర‌తాయో ? చూడాలి.

Tags:    

Similar News