వెరీ..వెరీ..స్పెషల్ కేసీఆర్

ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శైలి ప్రత్యేకం. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడమే కాదు ఆయన వ్యూహాలు ప్రత్యర్థులకు ఏమాత్రం అంతుచిక్కకుండా ఉంటాయి. రాజకీయంగా [more]

Update: 2019-01-21 08:00 GMT

ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శైలి ప్రత్యేకం. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడమే కాదు ఆయన వ్యూహాలు ప్రత్యర్థులకు ఏమాత్రం అంతుచిక్కకుండా ఉంటాయి. రాజకీయంగా ఆయన వ్యవహార శైలి కూడా ఆసక్తికరంగా ఉంటుంది. తాను రాజకీయంగా ఎవరినీ శత్రువుగా భావించరు. తాను ఎవరినైనా విమర్శించినా, తనను ఎవరైనా విమర్శించినా అదే కేవలం రాజకీయంగానే కానీ వ్యక్తిగతంగా వైరానికి వెళ్లరు. పైగా తనను తిట్టిన వారి చేతనే పొగిడించుకోవడం ఆయన నైజాం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనపై అనేక విమర్శలు చేసిన నేతలంతా ఇవాళ టీఆర్ఎస్ లో ఉన్నారు. వారంతా ప్రతీ రోజు కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

తిట్టిన వారే పొగుడుతున్నారు…

ఇటీవలి ఎన్నికల వరకు గజ్వేల్ కు చెందిన వంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ను ఓడించడమే తన ధ్యేయమన్నారు. అదే, ప్రతాప్ రెడ్డి నెల రోజుల్లోనే టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. అది కేవలం ప్రతాప్ రెడ్డికే పరిమితం కాలేదు. కేసీఆర్ ను హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వను అన్నట్లు మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా టీఆర్ఎస్ లో చేరారు. తనను గతంలో విమర్శించారని కేసీఆర్ కూడా మనస్సులో పెట్టుకోరు. అందుకే తలసానికి మంత్రి పదవి దక్కింది. ఇక, తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు వంటి అనేక మంది నాయకులు కేసీఆర్ పై గతంలో అనేక విమర్శలు చేసి మళ్లీ కేసీఆర్ వద్దకు వచ్చి పదవులు పొందిన వారే. ఇక, హైదరాబాద్ లో దానం నాగేందర్ కూడా అంతే. ఆయనా కేసీఆర్ ని గతంలో తీవ్రంగా విమర్శించి ఇప్పుడు అదే పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక, కొండా దంపతులు సైతం కేసీఆర్ ని అనరాని మాటలు అని మళ్లీ టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత మళ్లీ దూరమైన సంగతి తెలిసిందే.

వైరాలను పక్కన పెట్టినందునే…

వాస్తవానికి, ఇదీ ఒక రాజకీయ వ్యూహం. 2014కి ముందు వరకు కూడా టీఆర్ఎస్ కు తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో పట్టు లేదు. అయితే, ఈ విమర్శలను, వైరాలను పట్టించుకోకుండా అందరినీ పార్టీలో చేర్చుకుని గతం మరిచిపోయి ప్రాధాన్యత ఇచ్చినందుకే ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బలోపేతం అయ్యింది. తనను విమర్శించిన వాళ్లనే కాదు… తాను విమర్శించిన వారిని కూడా కేసీఆర్ కలుపుకొని పోవడానికి ఏమాత్రం వెనుకడుగు వేయరు. గతంలో తాను విభేదించిన చంద్రబాబు నాయుడుతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. ఇక, తాను తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ఆర్ కుమారుడు జగన్ ను ఫెడరల్ ఫ్రంట్ లో చేర్చుకోవడానికి తానే ముందడుగు వేసి చర్చలు ప్రారంభించారు. మొత్తానికి తిట్టిన నోళ్లతోనే పొగిడించుకోవడం కేసీఆర్ నైజం. రాజకీయాలను రాజకీయాలుగానే చూస్తారు కానీ వ్యక్తిగత వైరానికి దిగరు.

Tags:    

Similar News