కేసీఆర్.. జగన్ కు అలా…?

విజయం మత్తు అలాంటిది మరి. దానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అతీతుడేమీ కాదు. గత ఏడాది బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కి పార్లమెంట్ ఎన్నికల్లో [more]

Update: 2019-10-25 09:30 GMT

విజయం మత్తు అలాంటిది మరి. దానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అతీతుడేమీ కాదు. గత ఏడాది బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఇబ్బంది కలిగినా ఇపుడు జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయం దక్కడం విశేషం. దాంతో గత కొంతకాలంగా ఇబ్బందులు ఇరకాటాలతో సతమవుతున్న పెద్దాయన తన బాధనంతా ఒక్కసారిగా వెళ్ళగక్కేశారు. ఆయన్ని ఆర్టీసీ సమ్మె ఎంతలా పట్టిపీడిస్తుందో తన మాటల ద్వారానే చెప్పేసుకున్నారు. అలాగే ఇటువంటి పరిస్థితి తలెత్తడానికి పరోక్షకారణమైన ఏపీ సీఎం జగన్ ని కూడా ఆయన విడిచి పెట్టలేదు. ఇక మరో వైపు ప్రతిపక్షాలు కొంతకాలంగా పైచేయి సాధించాలని ఆరాటపడుతూ కేసీఆర్ మీద బాణాలు ఎక్కుపెట్టాయి. దాంతో వారి మీద కూడా కేసీఆర్ విసుర్లు విసిరారు.

కఠినమేనట…..

ఇంతకాలం చూసిన కేసీఆర్ వేరు, ఇపుడు చూడబోయే కధ వేరు అని గులాబీబాస్ చెప్పేస్తున్నారు. తాను సౌమ్యంగా ఉంటేనే ఎవరైనా ఆటలాడేది, మూడో కన్ను తెరిస్తే అంతే మరి అంటూ గర్జించారు కేసీఆర్. మొత్తానికి ఆయ‌నలో చాలాకాలానికి ఉద్యమ నేత కనిపించారు. ఆనాటి ఆవేశం కూడా కట్టలుతెంచుకుంటూ బయటకు వచ్చేసింది. తనను తేలిగ్గా చూస్తున్నారని, తక్కువ చేసి మాట్లాడుతున్నారన్న ఆక్రోశం కూడా కేసీఆర్ వెళ్ళగక్కారు. ఏది ఏమైనా కేసీఆర్ తాను ఇకపైన మరింత కఠినంగా ఉంటానని స్పష్టంగా ప్రకటించేశారు. అందులో ఎటువంటి మొహమాటాలు ఉండబోవని కూడా పక్కాగా నొక్కి వక్కాణించేశారు. అటు ఉద్యోగులైనా, ఇటు ప్రతిపక్ష నేతలైనా మరో వైపు జగన్ లాంటి కొత్త దోస్తులైనా కూడా తన వైఖరి ఇదేనని ఆయన కుండబద్దలు కొట్టేశారు.

ఎవరి చోటు వారికి చూపిస్తారా..?

ఆర్టీసీ సమ్మె మీద తొలి దెబ్బ కేసీఆర్ వేస్తారని ఇప్పటికే అర్ధమైపోతోంది. మరో వైపు మద్దతుగా నిలిచిన రెవిన్యూ ఉద్యోగలకు గట్టి హెచ్చరికలు పంపారు. ఇక లోక్ సభ ఎన్నికల తరవాత బీజేపీ ఏదో ఎగిరిఎగిరి పడుతోంది, కానీ ఆ పార్టీకి హుజూర్ నగర్లో డిపాజిట్లు గల్లంతు అయిన సంగతి చూపించి మరీ ఇకపైన కేసీఆర్ ఆడుకుంటారని అర్ధమైపోతోంది. అలాగే ఎటువంటి వ్యూహాం లేకుండా తన సతీమణిని నిలబెట్టుకుని తన పరువుకు, పదవికి ముప్పు తెచ్చుకున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారి విష‌యంలో ఉపేక్షించే ప్రసక్తే లేదని కూడా కేసీఆర్ కామెంట్స్ స్పష్టం చేశాయి. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి అయినా బీజేపీ కిషన్ రెడ్డి అయినా కూడా రాజకీయంగా చెలగాటమేనంటూ కేసీఆర్ రెచ్చిపోనున్నారు. మొత్తానికి కేసీఆర్ చెప్పుకున్నట్లుగా ఒక్క ఉప ఎన్నిక ఆయనకూ పార్టీకి ఓ టానిక్ లా పనిచేసింది. దాంతో బాహుబలి అవతారమే ఎత్తేశారు కేసీఆర్, ఇక కాస్కో అంటున్నారు. మరిక చూస్కోవడమే మిగిలింది ప్రత్యర్ధులకు.

Tags:    

Similar News