జగన్ పక్కలో బల్లెంలా తయారయ్యాడే?

2014 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ సంక్షేమ పథకాల అమలులో ముందున్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోల్చుకుంటే సంక్షేమ పథకాలను ఏపీ కంటే తెలంగాణలో [more]

Update: 2021-02-16 12:30 GMT

2014 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ సంక్షేమ పథకాల అమలులో ముందున్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోల్చుకుంటే సంక్షేమ పథకాలను ఏపీ కంటే తెలంగాణలో బాగా అమలు చేశారన్న ప్రచారం జరిగేది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, పింఛన్ మొత్తాన్ని పెంచుతూ కేసీఆర్ ఏపీ సీఎం కంటే ముందులో ఉన్నారు. వృద్ధులకు కంటి అద్దాలు పంపిణీ చేయడం దగ్గర నుంచి ఒంటరి మహిళలకు అండగా నిలబడి కేసీఆర్ సంక్షేమంలో ముందున్నారనిపించారు.

అనేక పథకాలతో….

కానీ 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ సయితం కోరుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పడు కేసీఆర్ వెళ్లి ఆశీర్వదించి వచ్చారు. చంద్రబాబు రాజకీయంగా తనపై చేసిన కుట్రతో ఆయన జగన్ వైపు నిలిచారు. అయితే జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయి 20 నెలలు దాటుతోంది. ఈ ఇరవైనెలల్లో అనేక సంక్షేమ పథకాలను జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.

రైతుల కోసం…..

కేవలం ఇరవై నెలల్లోనే దాదాపు 73 వేల కోట్ల రూపాయల నిధులను జగన్ సంక్షేమానికి కేటాయించారు. అంతేకాదు అనేక పథకాలను జనంలోకి తీసుకెళ్లారు. ప్రధానంగా వ్యవసాయ బోర్లు ప్రభుత్వమే ఉచితంగా వేయించడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. తెలంగాణలో వ్యవసాయం ఎక్కువగా బోర్లు, బావుల ఆధారంగా జరుగుతుంది. ఇక్కడ కూడా రైతులకు ఉచిత బోర్ల పథకాన్ని ప్రవేశపెట్టాలని కేసీఆర్ పై డిమాండ్ పెరుగుతుంది.

పోలిక చూస్తూ…..

ఇక జగన్ ఇంటికే రేషన్ అందించడం, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటివి కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ ఇమేజ్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. గతంలో సంక్షేమ పథకాలకు కేసీఆర్ చిరునామాగా చెప్పుకునే జనం ఇప్పడు జగన్ పేరు తలుస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పక్కలో బల్లెంలా తయారయ్యారు.

Tags:    

Similar News