కేసీఆర్ కూడా రెడీ అయిపోయారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు లాక్ డౌన్ నిబంధనలపై నిర్ణయం తీసుకోనున్నారు. నేడు జరగనున్న మంత్రి మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత లాక్ డౌన్ [more]

Update: 2020-05-18 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు లాక్ డౌన్ నిబంధనలపై నిర్ణయం తీసుకోనున్నారు. నేడు జరగనున్న మంత్రి మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత లాక్ డౌన్ లో ఇచ్చిన మినహాయింపులపై చర్చించనున్నారు. తెలంగాణలో కరోనా కేసులు అనుకున్నంత స్థాయిలో ప్రబలడం లేదు. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ప్రతిరోజూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులను వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.

కేంద్ర సడలింపులను….

తెలంగాణలో మే 29వ తేదీ వరకూ కేసీఆర్ లాక్ డౌన్ ను విధించారు. ముఖ్యంగా వలస జీవులు, గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలోని 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గ్రీన్, ఆరెంజ్ జోన్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను వినియోగించుకునేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రజలు విసుగెత్తి పోయి ఉన్నారు. లాక్ డౌన్ నిబంధనలను కూడా బేఖాతరు చేస్తున్నారు.

ప్రజా రవాణా వ్యవస్థను….

ప్రధానంగా ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్ధరించేందుకు కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే రెండు నెలలుగా ఆర్టీసీ బస్సులు నడవక పోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ కూడా వందల కోట్ల నష్టాన్ని చవి చూస్తుంది. దీనిపై ఇప్పటికే కేసీఆర్ నివేదిక తెప్పించుకున్నారు. భౌతిక దూరం పాటించేలా ఆర్టీసీ బస్సులను ఆ సంస్థ ఇప్పటికే రెడీ చేసింది. కంటెయిన్ మెంట్ జోన్లు తప్పించి అన్ని ప్రాంతాలకు బస్సులు నడపాలని కేసీఆర్ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇతర రాష్ట్రాలకు మాత్రం….

అయితే అంతరాష్ట్ర బస్సు సర్వీసులను మాత్రం ఈ నెలాఖరు వరకూ అనుమతించే అవకాశాలు కన్పించడం లేదు. పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల బస్సులను తెలంగాణలోకి అనుమతించే అవకాశం లేదు. తెలంగాణలో చిక్కుకుపోయిన ఏపీ ప్రజలను మాత్రం అక్కడి ప్రభుత్వం తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. మొత్తం మీద కేంద్ర మార్గదర్శకాలపై నేడు కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News