అంబులెన్స్ లకు బ్రేక్ లు అందుకేనా ?

విపత్తు సమయంలో తెలంగాణ బోర్డర్ లో ఎపి అంబులెన్స్ లకు బ్రేక్ లు పడ్డాయి. అయితే టి హై కోర్ట్ పుణ్యమా అంటూ మృత్యుముఖంలో జాతీయ రహదారిపై [more]

Update: 2021-05-17 00:30 GMT

విపత్తు సమయంలో తెలంగాణ బోర్డర్ లో ఎపి అంబులెన్స్ లకు బ్రేక్ లు పడ్డాయి. అయితే టి హై కోర్ట్ పుణ్యమా అంటూ మృత్యుముఖంలో జాతీయ రహదారిపై నానా అగచాట్లు పడిన కరోనా రోగులకు కొంత ఆలస్యం అయి ఒకరిద్దరు ప్రాణాలు పోయినా ఉపశమనం లభించింది. ఆంధ్రప్రదేశ్ కు మరో మూడేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఎవరు కాదన్నా అవునన్నా హైదరాబాద్ నే ఉంటుంది. అయితే అమరావతి రాజధానిగా చంద్రబాబు ప్రకటించి తట్టా బుట్టా సర్దేసుకుని రాత్రికి రాత్రి ఓటుకు నోటు కేసులో వచ్చేశారన్న ప్రచారం నేపథ్యంలో ఎపి హక్కును కోల్పోయిందని ఇప్పుడు అంతా పాత గొడవ పైకి లేపారు. ఇది రాజకీయంగా ఎలా ఉన్నా సరిహద్దుల్లో అంబులెన్స్ లకు తెలంగాణ సర్కార్ బ్రేక్ లు వేయడానికి రెండు ప్రధాన కారణాలు ఇప్పడు చర్చనీయంగా మారాయి.

సెంటిమెంట్ వీక్ కావడంతో …

తెలంగాణ రాష్ట్ర సమితి టీఆరెస్ ఏర్పడిందే ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ తో. ఇప్పుడు రెండో దఫా కూడా టీఆర్ఎస్ తెలంగాణ గడ్డపై గెలిచాకా గత కొంతకాలంగా దుబ్బాక, భాగ్యనగర్ ఎన్నికల్లో ఎదురు దెబ్బలే తగిలాయి. ఆ తరువాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ , వరంగల్ ఖమ్మం వంటి కార్పొరేషన్ లలో గులాబీ జండా ఎగిరినప్పటికీ గతంలో ఉన్న జోష్ మన తెలంగాణ అనే భావన తమపార్టీకి ఉన్న పేటెంట్ బలహీనపడుతున్నట్లు కారు పార్టీ గుర్తించింది అంటున్నారు విశ్లేషకులు. మరోపక్క కరోనా ఉదృతిని మించి ఈటెల రాజేంద్ర ఎపిసోడ్ సైతం మీడియా లో జోరుగా సాగింది. ఇవన్నీ పక్కకు పోయి పూర్వపు సెంటిమెంట్ తెలంగాణ వాసుల్లో పురుడు పోసుకోవాలి అంటే ఎపి తదితర రాష్ట్రాల అంబులెన్స్ లను అడ్డుకొని తమ పౌరులకు మాత్రమే ప్రథమ ప్రాధాన్యాన్ని కెసిఆర్ ఇస్తారన్న భావన ప్రోది చేసేందుకే ఈ ఎత్తుగడ అన్న ప్రచారం గట్టిగానే ఉంది. అందుకే ప్రస్తుత విపత్కర సమయాన్ని అస్త్రంగా చేసుకుని గులాబీ పార్టీ అధినేత వ్యూహాత్మకంగా ఈ చర్యకు పాల్పడ్డారని చెబుతున్నారు విశ్లేషకులు.

సెటిలర్స్ లో బలహీనపడతారా ?

మొన్నటి భాగ్యనగర్ ఎన్నికల్లో సెటిలర్స్ బిజెపి ని సైతం కాదని కారు పార్టీ వైపు పూర్తిగా టర్న్ అయినట్లు తేలింది. టీఆర్ఎస్ గెలిచిన పలు డివిజన్లలో సెటిలర్స్ ఎక్కువగా ఉన్నవారు కావడం అప్పుడు చర్చనీయమే అయ్యింది. ఉద్యమ సమయంలో తమ వైఖరి వేరని ఇప్పుడు వేరని అందరిని కడుపులో పెట్టుకునే చూసుకుంటామంటూ గులాబీ దళం సెటిలర్స్ కు అభయం ఇచ్చింది. 2014 లో విభజన అనంతరం కెసిఆర్ సైతం సెటిలర్స్ పట్ల వ్యవహరించిన తీరు సైతం వారిలో మరింత నమ్మకం పెంచింది. దాంతో కాషాయదళం వైపు కానీ, కాంగ్రెస్ వైపు వాలకుండా సెటిలర్స్ కారెక్కేశారు ఇటీవల ఎన్నికల్లో. ప్రస్తుతం గులాబీ బాస్ కరోనా సమయంలో అంబులెన్స్ లను అడ్డుకున్న వ్యవహారం లో మాత్రం సెటిలర్స్ లో విభజనకు ముందు ఉన్న భయాందోళనలు తిరిగి తొంగి చూస్తున్నాయి.

మెడికల్ హబ్ లో ఆంధ్రుల పాత్ర లేదా ?

మెడికల్ హబ్ గా భాగ్యనగర్ తీర్చిదిద్దబడిన దాంట్లో ఆంధ్రుల పాత్ర లేదా అన్న ప్రశ్నే వారిని వేధిస్తుంది. ఇది గ్రేటర్ పరిధిలో వచ్చే ఎన్నికల్లో గులాబీ ని చాలావరకు దెబ్బతీసే అవకాశం ఉందన్న టాక్ బయల్దేరింది. చూడాలి ఇలాంటి ఒకటి రెండు సీన్స్ రిపీట్ చేసి తెలంగాణ సెంటిమెంట్ కోసం సెటిలర్స్ మనోభావాలు గాయపరిస్తే మాత్రం గులాబీ కి గట్టి ఎదురు దెబ్బలు తగలవచ్చనే ప్రచారం మొదలైంది. అయితే మాటల మాంత్రికుడు కెసిఆర్ ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చడంలో చతురత ఉన్నవారు కావడంతో వచ్చే ఎన్నికల నాటికి అందరిని అక్కున చేర్చుకోవడానికి విశాఖ ఉక్కుకు మా మద్దత్తు అన్న నినాదం తరహాలోనే కొత్త స్లోగన్ అందుకుంటారని కూడా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:    

Similar News