సాగర్ దక్కాలంటే ఆ రెండు ఎన్నికల్లో….?

నాగార్జుసాగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఉన్నారు. సాగర్ ఉప ఎన్నికలకు ముందు జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ [more]

Update: 2021-03-14 11:00 GMT

నాగార్జుసాగర్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఉన్నారు. సాగర్ ఉప ఎన్నికలకు ముందు జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో విజయం ఖచ్చితంగా దక్కుతుందన్న అంచనా లేదు. రెండు స్థానాల్లో కేసీఆర్ బలమైన అభ్యర్థులను బరిలోకి దించినా ప్రభుత్వ వ్యతిరేకత ఇబ్బందిగా మారనుంది. అయితే ఎక్కువ మంది పోటీ చేస్తుండటంతో వ్యతిరేక ఓట్లు చీలి తమ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరూ గెలుస్తారన్న అంచనాలో కేసీఆర్ ఉన్నారు.

బలమైన అభ్యర్థిగా…..

మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి కేసీఆర్ పీవీ కుమార్తె వాణిదేవిని ఎంపిక చేశారు. ఆలోచించి తీసుకున్న నిర్ణయంతోనే పార్టీకి కొంత హైప్ వచ్చింది. పీవీ కుమార్తె కావడంతో కొంత గెలుపు అవకాశాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ పడుతుండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి టీఆర్ఎస్ లబ్ది పొందుతుందని అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి…

ఇక ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమచంద్ రెడ్డి పోటీ చేస్తున్నా తెలంగాణ జనసమితినేత కోదండరామ్ బరిలో ఉన్నారు. వీరితో పాటు మరికొందరు తెలంగాణ ఉద్యమ కారులు సయితం పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలుతుందని కేసీఆర్ బలంగా విశ్వసిస్తున్నారు.

లేకుంటే సాగర్ లో కూడా…

ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తేనే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో విజయం లభిస్తుందని, ప్రజలు కూడా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అందువల్ల కేసీఆర్ ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలపై నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ వ్యూహాలను రచిస్తున్నారు. ఈ రెండు ఎన్నికల్లో పెర్ ఫార్మెన్స్ బాగా ఉంటేనే సాగర్ ఉప ఎన్నికలలో విజయం దక్కనుంది. అందుకే కేసీఆర్ ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలపై టెన్షన్ పడుతున్నారు.

Tags:    

Similar News