ఐదుగురు ఎమ్మెల్యేల‌పై కేసీఆర్ ఫైర్‌… ఇద్దరు మంత్రులు కూడా ?

కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక పార్టీ నాయ‌కుల ప‌ట్ల కాస్త ఉదాసీన‌తతో ఉన్న ప‌రిస్థితి. దీనిని అలుసుగా తీసుకుని అధికార టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా… చివ‌ర‌కు [more]

Update: 2021-03-09 00:30 GMT

కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక పార్టీ నాయ‌కుల ప‌ట్ల కాస్త ఉదాసీన‌తతో ఉన్న ప‌రిస్థితి. దీనిని అలుసుగా తీసుకుని అధికార టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా… చివ‌ర‌కు జిల్లా స్థాయి నేత‌లు కూడా రెచ్చిపోతున్నారు. ఇదే తెలంగాణ‌లో అధికార పార్టీకి మైన‌స్ అయ్యింది. అందుకే పార్టీకి ప‌ట్టున్న గ్రామ‌స్థాయి నుంచే టీఆర్ఎస్‌పై వ్యతిరేక‌త స్టార్ట్ కావ‌డంతో పాటు అటు వ‌రుస ఎన్నిక‌ల్లోనూ ఎదురు దెబ్బలు త‌గులుతున్నాయి. 2014 నుంచి తెలంగాణ‌లో ఏ ఎన్నిక లేదా ఉప ఎన్నిక జ‌రిగినా టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు జంకు ఉండేది కాదు. మారిన ప‌రిస్థితులు…. బీజేపీ దూకుడు నేప‌థ్యంలో ఇటు దుబ్బాక ఉప పోరులో దెబ్బ… గ్రేట‌ర్ లో అంచ‌నాలు త‌ల్లకిందులు కావ‌డంతో కేసీఆర్‌లో క‌ద‌లిక వ‌చ్చింది.

మంత్రుల స్థాయి నుంచే….

దీంతో పార్టీలో మంత్రుల స్థాయి నుంచే ప్రక్షాళ‌న ప్రారంభించేశారు. ఎన్నిక‌ల్లో వారి ప‌రిధిలో రిజల్ట్ రాక‌పోతే ప‌ద‌వులు పీకేయ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు కూడా ఉండ‌వ‌ని సీరియ‌స్‌గా ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. తెలంగాణ‌లో ఇప్పుడు వ‌రుస ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌తో పాటు రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు సైతం ఎన్నిక‌లు త్వర‌లోనే ఉన్నాయి. దీంతో ఈ ఎన్నిక‌ల్లో గెలుపు బాధ్యత‌ల‌ను కేసీఆర్ పూర్తిగా మంత్రులు, ఎమ్మెల్యేల మీదే వేసేశారు. వారికి టార్గెట్లు, కండీష‌న్లు కూడా పెట్టేసిన‌ట్టు తెలుస్తోంది.

అతి ధీమాకు పోయి….

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నేతలకు పీవీ కుమార్తె సుర‌భి వాణిని గెలిపించుకురావాల‌ని ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఒక్కో జిల్లాకు ముగ్గురు మంత్రుల‌కు ఇన్‌చార్జ్ బాధ్యత‌లు కేసీఆర్ ఇచ్చారు. ఇక ఇటీవల గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు స‌రిగా రాబ‌ట్టలేక‌పోయినా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, త‌లసాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్ ( రాజేంద్రన‌గ‌ర్‌) – దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ( ఎల్బీన‌గ‌ర్‌) – ముఠాగోపాల్ ( ముషీరాబాద్ ) కు త‌లంటేశార‌ట‌. అతి ధీమాతో పాటు మీ ఉదాసీన వైఖ‌రి వ‌ల్లే మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఓడిపోవ‌డంతో పాటు ప‌రువు పోయింద‌ని ఫైర్ అయ్యార‌ట‌.

ఫలితాలు రాబట్టలేకుంటే…?

ఈ సారి ఎన్నిక‌ల్లో అయినా మంచి ఫ‌లితాలు రాబ‌ట్టక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు క‌ష్టమని చెప్పేశార‌ట‌. ఇదే రూల్ ఇప్పుడు సాగ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, రెండు ఎమ్మెల్సీ స్థానాల బాధ్యుల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని అంటున్నారు. సాగ‌ర్ బాధ్యత‌లు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డిపై పెట్టారు. వ‌రంగ‌ల్ బాధ్య‌త‌లు ఆ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేల‌కు అప్పగించారు. ఖమ్మం బాధ్యత ప్రధానంగా మంత్రి పువ్వాడ అజ‌య్‌పైనే ఉంది. మ‌రి ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రెండిట్లోనూ కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అభ్యర్థుల‌ను నిల‌బెట్టారు. పైగా పీవీ కుమార్తెను లాగారు. అక్కడ పార్టీకి అంత సానుకూల‌త లేదు. రిజ‌ల్ట్ తేడా వ‌స్తే పీవీ కుటుంబానికే అవ‌మానం. అందుకే అక్కడ బాధ్యత‌లు తీసుకున్న వారు ఏం చేయాలో తెలియ‌క త‌ల ప‌ట్టుకుంటున్నార‌ట‌. ఏదేమైనా కేసీఆర్‌కు కోపం వ‌స్తే ఏం జ‌రుగుతుందో ? ఆ పార్టీ మంత్రులు, ఇత‌ర నాయ‌కులు, ఎమ్మెల్యేల‌కు ఇప్పుడిప్పుడే అర్థమ‌వుతోంది.

Tags:    

Similar News