సంబరపడితే ఎలా యడ్డీ…?

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. ఆయనకు ఆరు నెలల పాటు తిరుగుండదు. ఎందుకంటే అవిశ్వాసం పెట్టాలంటే ఎవరైనా ఆరునెలలు ఆగాల్సిందే. ఈ ఆరునెలల్లో యడ్యూరప్ప [more]

Update: 2019-07-29 16:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. ఆయనకు ఆరు నెలల పాటు తిరుగుండదు. ఎందుకంటే అవిశ్వాసం పెట్టాలంటే ఎవరైనా ఆరునెలలు ఆగాల్సిందే. ఈ ఆరునెలల్లో యడ్యూరప్ప సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే సంకీర్ణ సర్కార్ కు పట్టిన గతే యడ్యూరప్పకు పట్టక తప్పదు. ఇప్పుడు శాసనసభలో యడ్యూరప్ప సర్కార్ కూడా అరకొర మెజారిటీతోనే నెట్టుకొస్తోంది. భవిష్యత్తులో బీజేపీ కూడా బలం కోల్పోయే అవకాశాలు అయితే లేకపోలేదు.

కేంద్ర నాయకత్వమే….

ప్రస్తుతం యడ్యూరప్ప ముందున్న సవాల్ మంత్రి వర్గ విస్తరణ. బీజేపీ నేతల్లో అత్యధిక మంది మంత్రివర్గంలో చోటు కోసం తపిస్తున్నారు. దాదాపు యాభై మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముడుసార్లు వరసగా గెలవడం యడ్యూరప్పకు ఎంపిక కష్టం కావచ్చు. ఇందులో కేంద్ర నాయకత్వం జోక్యం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పక తప్పదు. ఇప్పటికే కేంద్ర నాయకత్వం నుంచి యడ్యూరప్పకు జాబితా అందినట్లు తెలుస్తోంది. పాలనపై కూడా కేంద్ర నాయకత్వం ఒక కన్నేసి ఉంచాలని నిర్ణయించింది.

అనుకూలంగా ఇచ్చినా….

ఇక మరో సమస్య 17 మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల విషయం. యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధాన కారణం వీరే. వీరిపై అనర్హత వేటు పడటంతో కొంత ఇబ్బందుల్లో ఉన్నారు. కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి వచ్చే తీర్పు ఆధారంగా యడ్యూరప్ప వీరందరికీ న్యాయం చేయాల్సి ఉంటుంది. రెబల్ ఎమ్మెల్యేలకు కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే వీరిలో అత్యధిక మందిని మంత్రివర్గంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.

ఉప ఎన్నికలు జరిగితే….

అలాకాకుండా స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తే 17 శాసనసభ స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవు. ఈ ఉప ఎన్నికల్లో వీరి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇవ్వాల్సి ఉంటుంది. వారిని గెలిపించుకునే బాధ్యత కూడా యడ్యూరప్ప మీదనే ఉంది. ఉప ఎన్నికల ఖర్చును కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే భరించాల్సి ఉంటుంది. వీరిలో ఎనిమిది మందిని గెలిపించుకుంటేనే యడ్డీ నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇక పార్టీలో గత కొంతకాలంగా ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను కూడా యడ్యూరప్ప బుజ్జగించాల్సి ఉంటుంది. ఇక సరైన బలం లేకపోవడంతో నిత్యం యడ్యూరప్పకు కష్టాలు తప్పవన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News