అంకె అధిష్టానానిదేనట

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు ఆయన మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. యడ్యూరప్పకు కేంద్ర నాయకత్వం మంత్రివర్గవిస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో [more]

Update: 2019-08-19 18:29 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు ఆయన మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. యడ్యూరప్పకు కేంద్ర నాయకత్వం మంత్రివర్గవిస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినప్పటికి ఇరవై రోజుల నుంచి మంత్రి వర్గ విస్తరణ చేయలేదు. కేంద్ర నాయకత్వం అనేక కారణాలతో బిజీగా ఉండటం, వరదల కారణంగా మంత్రి వర్గవిస్తరణ వాయిదా పడుతూ వచ్చింది.

అందరికీ న్యాయం జరిగేలా….

చివరకు రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన యడ్యూరప్ప చివరకు మంత్రివర్గం ఏర్పాటుకు రెడీ అయిపోయారు. 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం, ఆ కేసు సుప్రీంకోర్టులో నలుగుతుండటంతో ప్రస్తుతానికి పదమూడు నుంచి పదిహేను మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ అంకె కూడా అధిష్టానం యడ్యూరప్పకు చెప్పి పంపింది. తక్కువ మందితో అన్ని సామాజికవర్గాల వారికీ న్యాయం జరిగేలా మంత్రివర్గం ఉండాలని కేంద్ర నాయకత్వం యడ్యూరప్పకు సూచించింది.

సీల్డ్ కవర్ లో….

అయితే యడ్యూరప్ప కు సీల్డ్ కవర్ ను అధిష్టానం అందించింది. అధిష్టానం తమ నిర్ణయమే ఫైనల్ అని చెప్పడంతో యడ్యూరప్ప సీల్డ్ కవర్ తో కర్ణాటకకు తిరిగి వచ్చారు. ప్రమాణస్వీకారానికి కొద్ది గంటల ముందే పేర్లు తెలిసే అవకాశముందని చెబుతున్నారు. అయితే అధిష్టానానికి యడ్యూరప్ప ఒక జాబితాను అందించారు. ఆ జాబితాలో కొన్ని పేర్లను తొలగించి మరికొన్నింటిని కేంద్ర నాయకత్వం చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది.

యడ్డీని కట్టడి చేసేలా….

గతంలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొందరికి ఈ జాబితాలో చోటు దక్కిందని చెబుతున్నారు. లింగాయత్, ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన 7 మంది ఎమ్మెల్యేలకు ఈ మంత్రివర్గంలో చోటు దక్కిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. యడ్యూరప్ప ను కట్టడి చేసేలా బీజేపీ పెద్దలు మంత్రివర్గాన్ని కూర్పు చేశారంటున్నారు. గతంలో యడ్యూరప్ప పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో అధిష్టానం ఆయనను నామమాత్రంగా పెట్టి మంత్రుల్లో తమకు అత్యంత సన్నిహితులు ఉండేలా చూసుకుందన్నది పార్టీలో విన్పిస్తున్న మాట. మరి రేపు జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఎవరు ఉంటారనేది సస్పెన్స్ గా మారింది.

Tags:    

Similar News