కరణం చేరుతుంది ఆ కారణంగానే?

కరణం బలరాం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ జిల్లా రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు. కరణం బలరాం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన [more]

Update: 2020-03-12 08:00 GMT

కరణం బలరాం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ జిల్లా రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు. కరణం బలరాం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతే. అద్దంకి నియోజకవర్గంలోనే ఉంటూ దశాబ్బాల కాలం నుంచి ఆయన పాలిటిక్స్ ను నడిపారు. అయితే కరణం బలరాం ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. అధికారికంగా కాకున్నా అనధికారికంగా ఇక ఆయన వైసీపీ ఎమ్మెల్యే అనే చెప్పక తప్పదు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి తరహాలోనే ఆయన ఇక అసెంబ్లీలో ప్రత్యేక స్థానంలో కూర్చుంటారు.

ఎప్పటి నుంచో విన్పిస్తున్నా….

నిజానికి కరణం బలరాం పార్టీ మారతారని ఎప్పటి నుంచో విన్పిస్తుంది. ఇప్పుడు చేరిక టీడీపీకి కొత్త విషయమేమీ కాకపోయినా కరణం బలరాం ఎందుకు పార్టీని వీడుతున్నారు. వైసీపీలో ఆయనకు లభించిన హామీ ఏమిటన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. కరణం బలరాం అద్దంకి నియోజకవర్గంలో బలమైన నేత. 2009, 2014 ఎన్నికల్లో కరణం కుటుంబం టీడీపీ నుంచి పోటీ చేసి ప్రత్యర్థి గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓటమి పాలయింది. 2014 ఎన్నికలలో గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత అధికారంలో ఉన్న టీడీపీలో చేరిపోయారు. కరణం, గొట్టిపాటి మధ్య చంద్రబాబు జమ్మలమడుగు తరహాలో సయోధ్య కుదర్చబోయారు. కానీ ఎన్నికల నాటి వరకూ అది ఆయనకు సాధ్యం కాలేదు.

చీరాల ఇష్టం లేకనేనా?

చివరకు ఎన్నికల సమయంలో కరణం బలరాంను అద్దంకి నియోజకవర్గం నుంచి చీరాలకు పంపించి వేశారు. కరణం బలరాం తన వారసుడు కరణం వెంకటేష్ రాజకీయ భవితవ్యంపై ఆందోళన బయలుదేరింది. చీరాలలో మొన్న కరణం బలరాం గెలిచినప్పటికీ అది వైసీపీ వ్యూహ లోపం కారణంగానే గెలిచారు. ఆమంచిపై ఉన్న వ్యతిరేకత కరణానికి ప్లస్ అయింది. వాస్తవానికి అద్దంకిలోనే కరణం బలరాంకు బలమైన వర్గముంది. టీడీపీలోనే కొనసాగితే ఇక అద్దంకి నియోజకవర్గానికి దూరమయినట్లే. గత కొద్దిరోజులుగా తన కుమారుడు వెంకటేష్ కు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జి ఇవ్వాలని కరణం బలరాం కోరుతున్నారు. కానీ అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

అద్దంకి ఇస్తారనే?

ఇదే సమయంలో వైసీపీలోకి వస్తే అద్దంకి నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతను కరణం వెంకటేష్ కు ఇస్తామని డీల్ సెట్ చేశారట మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. గతంలో పార్టీ ఫిరాయించిన గొట్టిపాటిని దెబ్బతీయాలంటే కరణం ఫ్యామిలీని దగ్గరకు తీయాలని ఎప్పటినుంచో వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే అద్దంకి ని ఎరవేశారంటున్నారు. కరణం బలరాం పార్టీకి మద్దతుగా నిలుస్తారు. కరణం వెంకటేష్ కు అద్దంకి నియోజకవర్గ బాధ్యతలు ఇస్తారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం చీరాల నియోజకవర్గం ఆమంచికే దక్కనుంది. దీంతో మళ్లీ అద్దంకిలో కరణం, గొట్టిపాటి వార్ మొదలవుతుంది. డీల్ అయితే కుదిరింది కాని, వచ్చే ఎన్నికల్లోనైనా కరణం కుటుంబం అద్దంకిలో గట్టెక్కుతుందా? అంటే పెదవి విరుపులే సమాధానాలుగా వస్తున్నాయి.

Tags:    

Similar News