క‌ర‌ణం.. అంటే కలహాలేనా? ఇంత వయసొచ్చినా?

ప్రకాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయకుడు, ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణమూర్తి రాజ‌కీయాలు పరిప‌క్వత‌కు నోచుకోవ‌డం లేదా ? ఆయ‌న సీనియ‌ర్ అన్నమాటే కానీ, ఆయ‌న [more]

Update: 2020-09-26 05:00 GMT

ప్రకాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయకుడు, ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణమూర్తి రాజ‌కీయాలు పరిప‌క్వత‌కు నోచుకోవ‌డం లేదా ? ఆయ‌న సీనియ‌ర్ అన్నమాటే కానీ, ఆయ‌న చేస్తున్న వ‌న్నీ పిల్ల‌రాజ‌కీయాలేనా ? నిబద్ధత లేక‌పోవ‌డం, నోటి దురుసు, సొంత పార్టీ నేత‌ల‌తోనూ క‌య్యం.. వంటివి ఆయ‌న ష‌రా అన్నట్టుగా మారిపోయాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు చీరాల ప్రజ‌లు. దాదాపు ముప్పయ్యేళ్లకు పైగానే రాజ‌కీయాల్లో ఉన్న క‌ర‌ణం బలరాం నిజానికి త‌లుచుకుంటే.. నేటి త‌రం యువ నేత‌ల‌కు పాఠాలు చెప్పే స్థాయిలో ఉన్నారు.

నిత్యం వివాదాలే…?

కానీ, క‌ర‌ణం బలరాం వ్యవ‌హారం మాత్రం సీనియార్టీకి త‌గిన విధంగా లేద‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఆయ‌న ఎక్కడ ఉన్నప్పటికీ.. నిత్యం వివాదాల‌తోనే కాలం వెళ్ల‌దీస్తార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆదిలో క‌ర‌ణం బలరాం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే టీడీపీలోకి వ‌చ్చి మార్టూరు ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌ర్వాత గొట్టిపాటి హ‌నుమంత‌రావు కుమారుడి హ‌త్య కేసులో ఇరుక్కోవ‌డంతో ఆ కేసు నుంచి బ‌య‌ట ప‌డేందుకు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ద‌య‌తో తిరిగి క‌ర‌ణం బలరాం టీడీపీలో చేరి ఒంగోలు నుంచి 1999లో ఎంపీగా టికెట్ తెచ్చుకుని గెలుపు గుర్రం ఎక్కారు.

మంత్రి పదవిపై కన్నేసి…

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. త‌ర్వాత మ‌ళ్లీ అద్దంకి కావాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఈ క్రమంలోనే 2004లో పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న భావ‌న‌తో మంత్రి ప‌ద‌విపై క‌న్నేసి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ప‌ట్టుబ‌ట్టారు. అద్దంకిలో టీడీపీ నాయ‌కుడిగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెంచు గ‌ర‌ట‌య్యను త‌ప్పించి.. అక్కడ టికెట్ ఇచ్చేవ‌ర‌కు క‌ర‌ణం బలరాం నిద్రపోలేదు. 2009లో గొట్టిపాటి ర‌విపై ఓట‌మిపాల‌య్యారు. ఇక‌, 2014లో త‌న కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌కు ప‌ట్టుబ‌ట్టి టికెట్ ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో వైసీపీలో ఉన్న గొట్టిపాటి ర‌విపై క‌ర‌ణం వెంక‌టేష్ ఓట‌మిపాల‌య్యారు. అయితే, పార్టీ అధికారంలోకి రావ‌డంతో గొట్టిపాటిపై పైచేయి సాధించేందుకు నిత్యం ఏదో ఒక‌ర‌కంగా ప్రయ‌త్నించారు.

ఎప్పుడూ ఏదో ఒక పంచాయతీనే…..

ఇదిలావుంటే, వైసీపీని దెబ్బకొట్టేందుకు.. చంద్రబాబు.. ర‌విని టీడీపీ సైకిల్ ఎక్కించుకున్నారు. అయినా కూడా క‌లిసి మెలిసి ప‌నిచేయ‌కుండా.. ఏదో ఒక పంచాయితీ పెట్టుకున్నారు.క‌ర‌ణం బలరాం నిత్యం ఏదో ఒక విష‌యంతో వివాదాలు, విమ‌ర్శల‌తో మునిగి తేలారు. గ‌త ఎన్నిక‌ల్లో అప్ప‌టి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహ‌న్ వైసీపీలోకి వెళ్లడంతో చంద్రబాబు క‌ర‌ణంను చీరాల‌కు పంపారు. ఆ ఎన్నిక‌ల్లో చీరాల నుంచి పోటీ చేసి విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. ఇప్పుడు వైసీపీలోకి మారిపోయారు.

ఇక్కడ కూడా అంతే….

పోనీ.. ఇప్పుడు ఇక్కడైనా ప్రశాంతంగా ఉన్నారా ? అంటే.. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహ‌న్‌తో క‌ర‌ణం బలరాం నిత్యం క‌ల‌హాలు పెట్టుకుంటున్నారు. ఏకంగా ఆమంచిని ఇక్కడ నుంచి త‌ప్పించేలా.. వ్యూహాత్మకంగా చ‌క్రం తిప్పుతుండ‌డంతో క‌ర‌ణంపై తీవ్ర విమ‌ర్శలు వ‌స్తున్నాయి. నాడు టీడీపీలో ఉన్నప్పుడు గొట్టిపాటిని రెచ్చగొట్టేలా మాట్లాడిన క‌ర‌ణం బలరాం ఇప్పుడు ఆమంచిని కూడా అలాగే రెచ్చగొట్టే ధోర‌ణితో వ్యవ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శలు ఉన్నాయి. క‌ర‌ణం త‌న‌యుడు వెంక‌టేష్ సైతం అధో ధోర‌ణితో వెళుతున్న ప‌రిస్థితి ఉంది.

కొడుకు కూడా అంతేనా?

కొద్ది రోజుల క్రితం వెంక‌టేష్ చీరాల ప్రజ‌ల‌కు తాను స్వేచ్ఛ ఇస్తాన‌ని ఎన్నిక‌ల‌కు ముందే ప్రమాణం చేశామ‌ని.. ఇక్కడ ఎవ‌రి ఆట‌లు చెల్లవ‌న్న అర్థంతో మాట్లాడుతూ ప‌రోక్షంగా ఆమంచిని రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఈ ప‌రిణామాలతో క‌ర‌ణం బలరాం సీనియార్టీనే ప్రశ్నార్థకంగా మారింది. క‌ర‌ణం బలరాం కు తోడు ఆయ‌న కుమారుడు కూడా నిత్యం ఘ‌ర్షణ‌లు, వివాదాల‌నే న‌మ్ముకుని రాజ‌కీయం చేయ‌డం మ‌రింత వివాదానికి దారితీస్తోంద‌ని… క‌ర‌ణం ఫ్యామిలీ పార్టీ మారినా వారి వివాదాలు మాత్రం ఆగ‌లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News