కన్నా హడావిడి పూర్తయినట్లేనా?

ఏడాది కింద‌ట‌.. బీజేపీ నేత‌ల నోటి నుంచి వినిపించిన మాట‌.. మేం ఏపీలో ప్రత్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎదుగుతాం. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒంట‌రిగానే పోటీ చేసినా.. వ్యూహం [more]

Update: 2020-06-16 13:30 GMT

ఏడాది కింద‌ట‌.. బీజేపీ నేత‌ల నోటి నుంచి వినిపించిన మాట‌.. మేం ఏపీలో ప్రత్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎదుగుతాం. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒంట‌రిగానే పోటీ చేసినా.. వ్యూహం మాత్రం.. ఏ ప‌దో ప‌దిహేనో స్థానాల్లో ఎమ్మెల్యేల‌ను గెలిపించుకుని, ఒక‌టో రెండో ఎంపీల‌ను గెలిపించుకుని ప్రత్యామ్నాయంగా ఎదగాల‌ని బీజేపీ భావించింది. ఈ క్రమంలోనే సామాజిక వర్గాల వారిగా కూడా బ‌లం పుంజుకునేందుకు ప్రయ త్నించింది. ఈ ప‌రిణామాల‌ను గ్రహించిన వారు ఇంకేముంది.. బీజేపీ ఎదుగుతోంద‌ని అనుకున్నారు. కానీ, ఒక్కటంటే ఒక్క సీటు రాక‌పోగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులువారు.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గారే.. డిపాజిట్ కోల్పోయారు.

తమకు తిరుగులేదంటూ…..

ఆ ఎన్నిక‌ల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో న‌ర‌సారావుపేట ఎంపీగా పోటీ చేసిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాజీ కేంద్ర మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వరి వైజాగ్ నుంచి, మ‌రో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు న‌ర‌సాపురం నుంచి ఎంపీలుగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఇక కామినేని శ్రీనివాస్‌, కంభంపాటి హ‌రిబాబు లాంటి వాళ్లు అస‌లు ఎన్నికల్లోనే పోటీ చేయ‌లేదు. అయితే, స‌హ‌జంగా మ‌నుషుల‌కు ఉండే ల‌క్షణంతో.. కింద‌ప‌డ్డా పైచేయి మాదేన‌ని చెప్పుకొంటూ.. క‌న్నా వారు రాజ‌కీయాలు చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే ప్రత్యామ్నాయం తామేన‌ని, కాంగ్రెస్ ప‌ని, చంద్రబాబు టీడీపీ ప‌ని అయిపోయింద‌ని ప్రచారం చేసుకున్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఎన్నిక‌ల్లో పిల్లిమొగ్గలు వేయ‌డం అంద‌రూ చూసిందే.

ఏడాది తర్వాత…?

ఇక‌, ఏడాది గ‌డిచిపోయింది. ఈ క్రమంలో ఆయ‌న ఆరు మాసాల కింద‌ట ఇంకేముంది.. పార్టీ అజెండాను ప్రజ‌ల్లోకి భారీ ఎత్తున తీసుకు వెళ్తాన‌ని, స‌భ్యత్వాల‌ను పెంచుతాన‌ని, ప్రతి ఇంటిపైనా పార్టీ ప‌తాకం ఎగిరేలా చేస్తాన‌ని భీష‌ణ ప్రతిజ్ఞలు చేశారు. కానీ, ఇది కూడా స‌క్సెస్ కాలేదు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. “రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయ రాజ‌కీయ పార్టీ లేదు“- అని సాక్షాత్తూ బీజేపీ జాతీయ నేత‌, ఏపీకి చెందిన రాం మాధ‌వ్ కుండ‌బ‌ద్దలు కొట్టారు. మోడీ ఏడాది పాల‌న పూర్తయిన సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా బీజేపీ నేత‌లు పండ‌గ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా జ‌రిగిన కార్యక్రమంలో రాం మాధ‌వ్ ఏపీలో బీజేపీ ప‌రిస్థితిని క‌ళ్లకు క‌ట్టారు. ఏపీలో చంద్రబాబు ప్రతిప‌క్ష నేత‌గా విఫ‌ల‌మ‌య్యార‌ని దుయ్యబ‌ట్టారు.

ఏటికి ఎదురీత……

అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు తిరుగులేకుండా పోయింద‌ని, ప్రత్యామ్నాయ శ‌క్తిగా ఎదిగే ప్రయ‌త్నం ఏ పార్టీ కూడా చేయ‌డం లేద‌ని అనేశారు. దీంతో బీజేపీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. ముఖ్యంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను విమ‌ర్శిస్తున్న తెర‌చాటు నాయ‌కులు ఇప్పుడు వీధిన‌ప‌డ్డారు. అయితే, ఇన్నాళ్లు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ చెప్పిందంతా.. వృథాయేనా..? అంటూ చాటు మాటు విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా ఏపీలో బీజేపీ మ‌రో నాలుగేళ్లకు కూడా ఎదిగే అవ‌కాశం లేద‌ని స్పష్ట‌మ‌వుతోంద‌ని అంటున్నారు. ఇక ఇప్పుడు నాలుగైదు శాతం ఓటు బ్యాంకుతో పాటు కాపు వ‌ర్గం అండ‌దండ‌లు కాస్తో కూస్తో ఉన్న జ‌న‌సేన తోక ప‌ట్టుకుని బీజేపీ ఏటికి ఎదరు ఈదుతోంద‌న్న విమ‌ర్శలు కూడా వ‌స్తున్నాయి.

Tags:    

Similar News