ఆ సామాజిక వర్గం వైసీపీకి ఇక ఎప్పటికీ దూరమేనా.. ?

ఏపీలో రెండు సామాజిక వర్గాలే రాజకీయ ఆధిపత్యాన్ని చూపిస్తున్న సంగతి విదితమే. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక మూడు దశాబ్దాల పాటు రెడ్లు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ముఖ్యమంత్రులుగా [more]

Update: 2021-05-27 00:30 GMT

ఏపీలో రెండు సామాజిక వర్గాలే రాజకీయ ఆధిపత్యాన్ని చూపిస్తున్న సంగతి విదితమే. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక మూడు దశాబ్దాల పాటు రెడ్లు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ముఖ్యమంత్రులుగా శాసించారు. వారి గుత్తాధిపత్యాన్ని బద్ధలు కొట్టాలని మొదట వామపక్ష పార్టీలలో ఉంటూ పోరాడిన కమ్మలకు అది సాధ్యపడలేదు. మొత్తానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడంతో వారి కల సాకారం అయింది. తమకంటూ ఒక పార్టీ, రాజకీయ గుర్తింపు దక్కాయని వారంతా సంతోషించారు.

ఆ రోజులే వేరు…?

ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా టీడీపీకి, దాన్ని అట్టేపెట్టుకుని ఉన్న సొంత సామాజిక వర్గానికి ఇబ్బందులు ఏవీ తలెత్తేవి కావు. ఆ పార్టీలోనూ ఈ వర్గం ఉండేవారు. వారు మాట చెల్లుబాటు అయ్యేది. అదే విధంగా కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో ముఖ్యమంత్రులకు అంత పవర్స్ లేవు. ఫలితంగా విపక్షంలో ఉంటూ కూడా తన హవా చాటుకునేవారు. అయితే ఫస్ట్ టైమ్ వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడంతోనే కమ్మలకు కొన్ని విషయాల్లో చికాకులు వచ్చాయి. రెండే పత్రికలు అంటూ వైఎస్సార్ సొంత పత్రిక పెట్టడం, అలాగే రామోజీరావు మార్గదర్శి మీద తన పార్టీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా కేసులు వేయించడం వంటి వాటితో కొంత కార్నర్ చేశారు.

టార్గెట్ అదే…?

ఇక జగన్ అయితే అసలే మొండివారు. పైగా సొంత పార్టీ. అక్కడ ఆయనే రాజు. ఆయనే మంత్రి. ఎదురు చెప్పేవారు లేరు. దాంతో గత రెండేళ్ళుగా కమ్మ సామాజికవర్గం టార్గెట్ అయిందా అన్న చర్చ అయితే వస్తోంది. జగన్ కి ఆ సామాజికవర్గం మీద వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం లేదు కానీ టీడీపీ ఆర్ధిక మూలాలు బద్ధలు కొట్టి తన రాజకీయానికి ఎదురులేదు అనిపించుకోవాలన్న అలోచనతోనే దూకుడు చేస్తున్నారు. ఫలితంగా అమరావతి రాజధాని మీద తొలి దెబ్బ పడింది. ఇపుడు సంగం డైరీ వంటి వాటి మీద కూడా కొరడా ఝలిపించారు. మరో వైపు ఆ సామాజికవర్గంలో బలంగా ఉంటూ టీడీపీకి మద్దతు ఇచ్చే వారి విషయంలో సీరియస్ గానే దృష్టి సారిస్తున్నారు. దాంతో ఎన్నడూ లేని సంకట పరిస్థితులు తమకు ఎదురవుతున్నాయని టీడీపీకి చెందిన సొంత సామాజిక వర్గంలో ఒక చర్చ పెద్ద ఎత్తున సాగుతోందిట.

కుదిరేది కాదుగా..?

జగన్ తో ఇక కుదిరేది కాదు అని టీడీపీ సానుభూతిపరులుగా ఉంటున్న కమ్మలు భావిస్తున్నారుట. గతంలో టీడీపీకి జై కొట్టినా కొత్త ప్రభుత్వం ఎవరిది వచ్చినా సులువుగా పనులు చేసుకునేవారు. కానీ ఇపుడు జగన్ సర్కార్ విషయంలో అలాంటిది ఏదీ కనిపించడంలేదు. తాజాగా కొత్త సినిమాలకు టికెట్ల రేట్లు అధికంగా పెంచడం మీద కూడా వైసీపీ సర్కార్ కన్నెర్ర చేసింది. ఈ పరిణామాలతో అంతా ఫుల్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. అన్నీ బాగుంటే టీడీపీ మళ్ళీ పవర్ లోకి వస్తేనే తమకు మంచి రోజులు వస్తాయన్న ఒకే ఒక్క ఆశతో ఆ సామాజిక వర్గం ఉందిట. దీంతో మొదట్లో జగన్ వైపు రావాలని చూసిన ఈ వర్గంలోని నాయకులు, కీలకమైన వారు కూడా ఇపుడు తమ ఆలోచనలు పూర్తిగా మార్చుకున్నారని అంటున్నారు.

Tags:    

Similar News