వైసీపీకి ఒకే ఒక్క క‌మ్మ నేత మిగిలాడే?

క‌మ్మ సామాజిక వ‌ర్గం గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా తెలుగు రాజ‌కీయాల్లో కీ రోల్ ప్లే చేస్తోంది. 2014 రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో ఈ వ‌ర్గం హ‌వా [more]

Update: 2021-01-23 02:00 GMT

క‌మ్మ సామాజిక వ‌ర్గం గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా తెలుగు రాజ‌కీయాల్లో కీ రోల్ ప్లే చేస్తోంది. 2014 రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో ఈ వ‌ర్గం హ‌వా ఖ‌మ్మంతో పాటు మ‌రో ఒక‌టి రెండు జిల్లాల‌కు పాక్షికంగా ప‌రిమితం అయ్యింది. ఏపీలో మాత్రం టీడీపీలో అధికారంలో ఉండ‌డంతో ఐదేళ్లు ఈ వ‌ర్గం వాళ్లకే ఎక్కువ ప‌ద‌వులు క‌ట్టబెట్టార‌న్న విమ‌ర్శలు తీవ్రంగా వ‌చ్చాయి. వాస్తవానికి చంద్రబాబు చేసింది కూడా అదే ? ఆ మాట‌కు వ‌స్తే తెలుగుడ్డపై నాటి స‌మైక్య రాష్ట్రంలో క‌మ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌, టీడీపీ.. చివ‌ర‌కు బీజేపీ ఏ పార్టీలో అయినా ఈ వ‌ర్గం వాళ్లదే ఆధిప‌త్యం. అలాంటి వ‌ర్గం ఆధిప‌త్యం ఎక్కువుగా ఉండే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే కాకుండా కాపు సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యం ఉన్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోనూ క‌మ్మలు ద‌శాబ్దాలుగా పార్టీల‌తో సంబంధం లేకుండా కీల‌క పాత్ర పోషించారు.

అనేక నియోజకవర్గాల్లో…

టీడీపీ ఎప్పుడూ ఏలూరు సీటును క‌మ్మల‌కు మిన‌హా మ‌రొక‌రికి ఇవ్వలేదు. ఇక పున‌ర్విభ‌జ‌న‌తో జిల్లాలో స‌గం వ‌ర‌కు విస్తరించి ఉన్న రాజ‌మ‌హేంద్రవ‌రం సీటును కూడా ఎక్కువుగా క‌మ్మల‌కే ఇస్తూ వ‌స్తోంది. వీటితో పాటు దెందులూరు, ఉంగుటూరు, త‌ణుకు, నిడ‌ద‌వోలు సీట్లను సైతం ఈ వ‌ర్గం వాళ్లకే ఇస్తూ వ‌స్తోంది. ఇక పునర్విభ‌జ‌న‌కు ముందు వ‌ర‌కు కొవ్వూరు సీటులో కూడా క‌మ్మ నేత అయిన మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు పోటీ చేశారు. టీడీపీ అంటేనే క‌మ్మల పార్టీ అన్న ముద్ర ఉంది. ఆ పార్టీని ప‌క్కన పెడితే నాడు కాంగ్రెస్‌లో.. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చింత‌ల‌పూడి, దెందులూరు, త‌ణుకు ఎమ్మెల్యేలు క‌మ్మ వ‌ర్గం వారే. ఏలూరు ఎంపీ సీటును క‌మ్మ వ‌ర్గానికే చెందిన కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబ‌శివ‌రావుకు కేటాయించారు.

2009లో కాంగ్రెస్ నుంచి ఒకే ఒక్కడు….

అప్రతిహ‌తంగా కొన‌సాగుతూ వ‌స్తోన్న కమ్మ వ‌ర్గానికి కాంగ్రెస్ పార్టీలో షాక్ 2009లో త‌గిలింది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో ఈ వ‌ర్గానికి ప‌ట్టున్న సీట్లు రిజ‌ర్వ్ కావ‌డంతో నాడు వైఎస్ దెందులూరు సీటు మాత్రమే ఈ వ‌ర్గానికి కేటాయించారు. ప్రస్తుత దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌద‌రి తండ్రి కొఠారు రామ‌చంద్రరావు నాడు కాంగ్రెస్ సీటు ద‌క్కించుకున్న ఏకైక క‌మ్మ నేత‌గా నిలిచినా.. ఆ ఎన్నిక‌ల్లో చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌పై ఓడిపోయారు.

2014లో వైసీపీ నుంచి …

ఇక వైసీపీ ఆవిర్భావం త‌ర్వాత జ‌రిగిన 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో జిల్లాలో ఒకే ఒక సీటు జ‌గ‌న్ ఈ వ‌ర్గానికి కేటాయించారు. అప్పటి వ‌ర‌కు కాంగ్రెస్ కూడా ఇస్తోన్న ఏలూరు ఎంపీ సీటును కాపు వ‌ర్గానికి చెందిన తోట చంద్రశేఖ‌ర్‌కు ఇవ్వగా.. నిడ‌ద‌వోలు సీటు మాత్రమే పార్టీ సీనియ‌ర్ నేత మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు చ‌నుమోలు రాజీవ్ కృష్ణకు కేటాయించారు. ఆ ఎన్నిక‌ల్లో రాజీవ్ ఓడిపోయాక ఆయ‌న పార్టీకి దూరంగా ఉండ‌డంతో జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచాక ఓ నామినేటెడ్ డైరెక్ట‌ర్ ప‌ద‌వి ఇచ్చి స‌రిపుచ్చారు.

2019లో గెలిచి….

ఇక గ‌త ఎన్నిక‌లకు ముందు నుంచే జ‌గ‌న్ క‌మ్మ సామాజిక వ‌ర్గంపై దుమ్మెత్తి పోస్తూ వ‌చ్చారు. 2014 ఎన్నిక‌ల్లో నిడ‌ద‌వోలులో త‌న స్నేహితుడు రాజీవ్‌కు సీటు ఇచ్చిన జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌రో స‌న్నిహితుడు అయిన అబ్బయ్య చౌద‌రికి మాత్రమే దెందులూరు సీటు ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో అబ్బయ్య చౌద‌రి ఏకంగా టీడీపీ ఫైర్‌బ్రాండ్ చింత‌మ‌నేనిప్ర‌భాక‌ర్‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. ప్రస్తుతం జ‌గ‌న్ బాగా ప్రయార్టీ ఇచ్చే క‌మ్మ నేత‌ల్లో అబ్బయ్య చౌద‌రి కూడా ఉన్నారు.

టీడీపీలో మాత్రం…..

ఇక టీడీపీ ఇప్పట‌కీ ఏలూరు, రాజ‌మ‌హేంద్రవ‌రం ఎంపీ సీట్లతో పాటు దెందులూరు, ఉంగుటూరు, త‌ణుకు, నిడ‌ద‌వోలు సీట్లను క‌మ్మల‌కే ఇస్తోంది. వైసీపీ త‌ర‌పున జిల్లాలో ఒకే ఒక్క క‌మ్మ ఎమ్మెల్యేగా ఆ వ‌ర్గానికి ఆశాకిర‌ణంగా ఉన్నారు. అయితే ప్రభాక‌ర్ లాంటి బ‌ల‌మైన ప్రత్యర్థి ఉండ‌డంతో అబ్బ‌య్య చౌద‌రి ఫ్యూచ‌ర్ రాజ‌కీయం మ‌రీ అంత సులువైతే కాదు… మ‌రి ఈ వైసీపీ క‌మ్మ ఆశాకిర‌ణం దెందులూరులో ఎలా ? నిల‌దొక్కి రాజ‌కీయం చేస్తాడో ? చూడాలి.

Tags:    

Similar News