పూర్తిగా మార్చేశారా? చరిత్ర సృష్టిస్తారా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంటోంది. మరో రెండు నెలల్లో జరగనున్న ఈ ఎన్నికలపై సహజంగానే అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. తాజాగా డెమొక్రటిక్ పార్టీ [more]

Update: 2020-08-28 16:30 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంటోంది. మరో రెండు నెలల్లో జరగనున్న ఈ ఎన్నికలపై సహజంగానే అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. తాజాగా డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ప్రకటించడంతో ఆసక్తి రెట్టింపయింది. భారతీయ, ఆఫ్రికా మూలాలున్న ఆమె రంగంలోకి దిగడంతో ఎన్నిక స్వరూపమే మారిపోయింది. ఒక మహిళ ఇంతవరకు అగ్రదేశం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక కాలేదు. ఒక్క హిల్లరీ క్లింటన్ మాత్రమే 2016లో అధ్యక్ష బరిలోకి దిగారు. ఆమె ఓడిపోయింది. ఇక ఉపాధ్యక్ష పదవికి ఇప్పటివరకు ఇద్దరు పోటీ చేసినప్పట్టికీ విజయం సాధించలేకపోయారు. తొలిసారిగా 1984లో గెరాల్డ్ ఫెరారో డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగినప్పట్టికీ ఓటమి తప్పలేదు. 2008లో రిపబ్లికన్
పార్టీ ఉపాధ్యక్ష్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సారా పాలిన్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు కమలా హారిస్ బరిలోకి దిగడంతో సహజంగానే ఆమె విజయావకాశాలపై అంతటా ఆసక్తి నెలకొంది.

చరిత్రను తిరగ రాస్తారా?

కమలా హారిస్ భారత్, ఆఫ్రికా మూలాలున్న వ్యక్తి కావడంతో ఆ ఆసక్తి అధికమైంది. కమలా హారిస్ అభ్యర్థిత్వం ప్రకటనతో విరాళాలు పార్టీకి వెల్లువెత్తాయి, ఒక్కరోజులోనే పార్టీకి 26 మిలియన్ల డాలర్ల విరాళాలు రావడం ఆమె అభ్యర్థిత్వంపై ప్రజలకు గల క్రేజ్ కు నిదర్శనం. తమది స్వేచ్ఛా సమాజమని, వివక్ష కు తావులేని సమాజమని, ప్రతిభకే పెద్దపీట వేస్తామని అమెరికన్లు ఎంత గొప్పగా చెప్పుకున్నప్పటికీ అగ్ర దేశంలోని లోపాలు అందరికీ ఎరుకే. రెండు శతాబ్దాల స్వాతంత్య్ర చరిత్రలో ఇంతవరకు ఒక్క మహిళ అత్యున్నత పదవికి ఎన్నిక కాకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ చరిత్రను కమలా హారిస్ తిరగరాస్తారని ప్రవాస భారతీయులు , ప్రవాస ఆఫ్రికన్ అమెరికన్లు ఆశిస్తున్నారు. కేవలం ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కావడమే కాకుండా 2024లో అధ్యక్ష పదవికి కూడా ఆమె ఎన్నికవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే ప్రవాస భారతీయులు, ప్రవాస ఆఫ్రికన్లు ఇతర నల్లజాతి ఓట్లు కమలా హారిస్ కే దక్కుతాయని అంచనా.

ఆమె పేరు ప్రకటించగానే….

అమెరికాలో దాదాపు 14 లక్షల ప్రవాస భారతీయుల ఓట్లున్నాయి. అదే సంఖ్యలో ఆఫ్రికన్ల ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా న్యూయార్క్, ఫ్లోరిడా, టెక్సాస్, పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, వర్జీనియా తదితర రాష్టాలలో ప్రవాస భారతీయులు ఎక్కువ. వీరి ఓట్లన్నీ కమలా హారిస్ కే లభిస్తాయని అంచనా. గత ఏడాది టెక్సాస్ లో మోడీ…హౌడీ కార్యక్రమంలో నరేంద్రమోదీ, ట్రంప్ పాల్గొన్నప్పుడు ప్రవాస భారతీయులు ఓట్లు ట్రంప్ కే గంపగుత్తగా పడుతాయని అందరూ భావించారు. కానీ కమలా హారిస్ పేరు ప్రకటనతో ఒక్కసారి పరిస్థితి మారిపోనుందని చెబుతున్నారు. సహజంగా ప్రవాస భారతీయులు డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు. వారు మొదటి నుంచీ ఆ పార్టీకి వెనుదన్నుగా నిలుస్తున్నారు. డెమొక్రాట్లు కూడా భారత పట్ల సానుకూలంగా ఉంటారన్న పేరుంది. దీనికితోడు వీసాలకు సంబంధించి ట్రంప్ విధానాలపై ప్రవాస అమెరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. అమెరికా ఫస్ట్ అన్న ఆయన వైఖరి తమ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. వీసాలకు సంబంధించి తమ పార్టీ ఏకపక్షంగా వ్యవహరించబోదని, హేతుబద్ధంగా వ్యవహరిస్తామన్న కమలా హారిస్ ప్రకటన ప్రవాస అమెరికన్లలో ముఖ్యంగా ప్రవాస భారతీయుల్లో ఊరట నింపింది. ఈ విధానం తమకు మేలు చేకూరుస్తుందని డెమొక్రట్లు నమ్ముతున్నారు. అసలు అమెరికా ప్రగతి ప్రవాసులపై ఆధారపడిందని, వారిని దూరం చేసుకోవడం సరైన విధానం కాదని పార్టీ బలంగా విశ్వసిస్తోంది.

14 మంది ఉపాధ్యక్షులు అధ్యక్షులుగా…

ట్రంప్ దుందుడుకు విధానాలు ప్రతి ఒక్కరికీ ప్రమాదకరమేనని, ఆఖరికి అమెరికన్లకు కూడా మేలు చేయదని డెమొక్రట్లు భావిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయంగా బలహీనపడ్డామని, చైనా దూసుకువస్తోందని ఈ పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరించాలన్నది పార్టీ విధానంగా ఉంది. రెండువందల సంవత్సరాల అమెరికా చరిత్రలో 14మంది ఉపాధ్యక్షులు అధ్యక్ష్లులుగా ఎన్నికయ్యారు. వీరిలో ఏడుగురు గత శతాబ్దంలో అత్యున్నత పదవిని అందుకున్నారు. మిగిలిన ఏడుగురు తరవాత రోజుల్లో అధ్యక్ష పదవిని చేపట్టారు. 1901లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన థియోడర్ రూజ్ వెల్ట్ తరవాత రోజుల్లో అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. నాటి అధ్యక్ష్డుడు విలియమ్ మెకిన్లీ హత్యకు గురవడంతో రూజ్ వెల్ట్ అధ్యక్షడయ్యారు. 1921-23 మధ్యకాలంలో ఉపాధ్యక్షు డిగా ఎన్నికైన కాల్విన్ కూలిడ్జి నాటి అధ్యక్షు డు వారెన్ హార్డింగ్ మరణంతో 1924లో కాల్విన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1945లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన హారీ ఎస్ ట్రూమన్ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ మరణంతో ట్రూమన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1953-61 మధ్యకాలంలో ఉపాధ్యక్షు డిగా పనిచేసిన రిచర్డ్ నిక్సన్ అనంతరం ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తరవాత 1961-63 ల్లో ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన లిండన్ బి జాన్సన్ నాటి అధ్యక్షుడు జాన్ ఎఫ్
కెన్నడీ హత్యకు గురవడంతో 1964లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1973-74 ల్లో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన గెరాల్డ్ ఫోర్డ్ అప్పటి అధ్యక్షుడు దిగిపోవడంతో అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. 1981-89 మధ్యకాలంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జార్జి హెచ్ డబ్లూ బుష్ 1989లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన బుష్ 1993 వరకు పదవిలో కొనసాగారు.

2024 ఎన్నికల్లో హారిస్….

ఈ కోణంలో చూసినప్పుడు కమలా హారిస్ కూడా రేపటి ఎన్నికల్లో గెలవడమే కాకుండా 2024 అధ్యక్ష ఎన్నికల్లో విజయఢంకా మోగించగలరని ఆమె అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. అత్యున్నత పదవి చేపట్టడానికి గల అన్ని అర్హతలు ఆమెకు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఒక ఆఫ్రో అమెరికన్ అయిన బరాక్ ఒబామా రెండుసార్లు అధ్యక్షుడు అయినప్పుడు కమలా హారిస్ ఎందుకు కాలేరని వారు వాదిస్తున్నారు. ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చలేం. అప్పటి పరిస్థితులు ఆమె అవకాశాలను నిర్ణయిస్తాయి. కమలా హారిస్ అగ్రస్థానాన్ని అందుకోవాలని ప్రతి భారతీయుడూ కోరుకుంటాడు. అదే సమయంలో ప్రతి ప్రవాస అమెరికన్ కోరుకుటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా జరిగితే అమెరికా అత్యున్నత పీఠం అందుకున్న తొలి మహిళ ఆమే అవుతుంది. తొలి నల్లజాతి మహిళ కూడా కమలా హారిస్ నే అవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News