గెలుపు ఎవరనేదానికన్నా….ఓటమి పైనే టెన్షన్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ రేపు బలపరీక్షను ఎదుర్కొననున్నారు. బలపరీక్షకు గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించడంతో ఇక ఈ నెల 16వ తేదీన జరిగే సమావేశాల్లో కమల్ [more]

Update: 2020-03-15 17:30 GMT

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ రేపు బలపరీక్షను ఎదుర్కొననున్నారు. బలపరీక్షకు గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించడంతో ఇక ఈ నెల 16వ తేదీన జరిగే సమావేశాల్లో కమల్ నాధ్ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. స్పీకర్ ప్రజాపతి సయితం బలపరీక్ష నిర్వహించాలని రెడీ అయ్యారు. దీంతో కమల్ నాధ్ ప్రభుత్వం ఈ బలపరీక్షలో నెగ్గుతుందా? లేక విశ్వాసాన్ని కోల్పోతుందా? అన్నది తేలిపోనుంది.

బలం లేదని….

మధ్యప్రదేశ్ లో మొత్తం 230 మంది ఎమ్మెల్యేలుండగా ప్రస్తుతం కాంగ్రెస్ బలం 98 మాత్రమే ఉంది. 22 మంది ఎమ్మెల్యేలు జ్యోతిరాదిత్య సింధియాతో కలసి నడవడటంతో కమల్ నాధ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అయితే 22 మంది ఎమ్మెల్యేలతో స్పీకర్ వ్యక్తిగతంగా కలవాలని నోటీసులు జారీ చేశారు. వీరిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరో వైపు బలపరీక్షకు సిద్ధమవ్వాలని గవర్నర్ చెప్పడంతో కాంగ్రెస్ అప్రమత్తమయింది.

చివరి నిమిషంలోనైనా….

సీనియర్ నాయకుడు కమల్ నాధ్ చివరి నిమిషంలోనైనా తన ప్రభుత్వాన్ని కాపాడుకో గలుగుతారన్న విశ్వాసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కన్పిస్తుంది. ఇప్పటికే సింధియాతో వెళ్లిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు. చివరి నిమిషంలో తమ వైపుకే మొగ్గుతారని, బీజేపీని వారు నమ్మరని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావత్ అన్నారు. బలపరీక్షను సమర్థవంతంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.

అవకాశం వదులుకోకూడదని…..

ఇక భారతీయ జనతా పార్టీ సయితం వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకుంది. జైపూర్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ భోపాలకు రప్పించింది. నేరుగా వారిని అసెంబ్లీ హాలులోకి తీసుకెళ్లనున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే వద్ద ఒక్కో నేతను ఉంచారు. వారు ఫోన్ సంభాషణలను కూడా నిశితంగా గమనిస్తున్నారు. అయతే 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్ నాధ్ ప్రభుత్వం కుప్పకూలిపోయినట్లేనని బీజేపీ చెబుతోంది. రేపు బలపరీక్షలో తామే విజయం సాధించబోతున్నట్లు కమలనాధులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News