కమల్ కుంగిపోలేదు… కింగ్ అవ్వాలనే?

తమిళనాట రాజకీయాలు అంత ఆషామాషీగా ఉండవు. కొన్ని దశాబ్దాలుగా రెండు పార్టీల మధ్యే అధికార పంపిణీ జరుగుతుంది. అన్నాడీఎంకే, డీఎంకేలే అధికారంలోకి వస్తున్నాయి. ఇక్కడ జాతీయ పార్టీలైన [more]

Update: 2021-09-09 16:30 GMT

తమిళనాట రాజకీయాలు అంత ఆషామాషీగా ఉండవు. కొన్ని దశాబ్దాలుగా రెండు పార్టీల మధ్యే అధికార పంపిణీ జరుగుతుంది. అన్నాడీఎంకే, డీఎంకేలే అధికారంలోకి వస్తున్నాయి. ఇక్కడ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఏమాత్రం అవకాశం లేదు. అవి కూడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిందే. అయితే మరో ప్రాంతీయ పార్టీ అధినేత కమల్ హాసన్ కు మాత్రం రాజకీయాలపై ఆశలు చావలేదనే అనిపిస్తుంది. వరస ఓటములు ఎదురైనా కమల్ హాసన్ నిరుత్సాహ పడకపోవడం విశేషం.

పార్టీ పెట్టిన తర్వాత…

తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందని భావించిన కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి భంగపడ్డారు. మరోసారి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఆయన పోటీకి దిగి ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయారు. కమల్ హాసన్ తాను స్వయంగా పోటీ చేసిన కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా ఆయన రాజకీయాల పట్ల విసుగు చెందలేదు.

నేతలు వెళ్లిపోయినా…?

ఎప్పటికైనా తమిళనాడు పీఠం తనదేనన్న నమ్మకంతో కమల్ హాసన్ ఉన్నట్లే కన్పిస్తుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూడటంలో కమల్ హాసన్ ఆ పార్టీ నేతలు వీడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనేక మంది రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయినా కమల్ హాసన్ కుంగిపోలేదు. ఆయన టార్గెట్ అంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. వచ్చే ఎన్నికల నాటికి డీఎంకేకు ప్రత్యామ్నాయం తానేనని కమల్ హాసన్ భావిస్తున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి….

అన్నాడీఎంకే ఇప్పటికే నాయకత్వ లేమితో అల్లాడి పోతుంది. గ్రూపు విభేదాలు పెరిగిపోయాయి. శశికళ ఆ పార్టీని మళ్లీ చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కంటే తానే బలవంతుడినని కమల్ హాసన్ నిరూపించుకోదలిచారు. అందుకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తున్నారు. తరచూ పార్టీ నేతలతో సమావేశమై వారిలో జోష్ నింపుతున్నారు. ఫలితాల పట్ల కమల్ హాసన్ కుంగిపోకుండా వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుండటం విశేషం.

Tags:    

Similar News