కాకాణి కాక మీదున్నట్లుందే? రీజ‌న్ ఇదేనా?

నెల్లూరు జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి గురించి నెల్లూరు జిల్లా రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య తీవ్రమైన చర్చ సాగుతోంది. ఫైర్ [more]

Update: 2020-04-10 15:30 GMT

నెల్లూరు జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి గురించి నెల్లూరు జిల్లా రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య తీవ్రమైన చర్చ సాగుతోంది. ఫైర్ బ్రాండ్ కాక‌పోయినా ఆ రేంజ్‌లో ఆయ‌న మంచి వాగ్ధాటి ఉన్న నేత‌గా జిల్లాలోను, రాష్ట్రంలోనూ గుర్తింపు సాధించారు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డిని 2014, 2019 ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడించి రాణించారు. ఇక‌, ఏదైనా అంశంపై మాట్లాడాల్సి వ‌చ్చినప్పుడు ఏది ప‌డితే అది మాట్లాడ‌కుండా మంచి హోం వ‌ర్క్ చేసి త‌న వాగ్ధాటిని అనేక మార్లు కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి నిరూపించుకున్నారు. అసెంబ్లీలోనూ ఆయ‌న గ‌ళం విప్పితే.. స‌భ్యులు ఆశ్చర్య పోవాల్సిందే. అలాంటి నాయ‌కుడు ఇటీవ‌ల కొన్నాళ్లుగా మౌనం పాటిస్తున్నారు.

పార్టీతో అనుబంధం….

దీంతో అసలు ఆయ‌న‌కు ఏమైంది ? ఎందుకు మౌనంగా ఉంటున్నార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. జిల్లా ప‌రిష‌త్ చైర్మన్ నాటి నుంచి వైసీపీతో కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డికి మంచి అనుబంధం ఉంది. స‌ర్వేప‌ల్లిలో వైసీపీ త‌ర‌ఫున రెండు సార్లు ఆయ‌న విజ‌యం సాధించారంటే.. ఆయ‌న ఏం రేంజ్‌లో పార్టీని డెవ‌ల‌ప్ చేశారో అర్ధమ‌వుతుంది. పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు కూడా ఆయ‌న జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిల్లాలో పార్టీని ముందుండి న‌డిపించారు. అయితే కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి ప్రస్తుత జ‌గ‌న్ ప్రభుత్వంలో మంత్రి ప‌ద‌విని ఆశించారు. అయితే, కాకాణిని జ‌గ‌న్ ప‌క్కన పెట్టి ఇదే జిల్లాకు చెందిన బీసీ నాయ‌కుడు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ స‌హా మేక‌పాటి గౌతంరెడ్డిల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.

అలక వహించింది అందుకేనట…

నిజానికి ఈ ఇద్దరూ కూడా రాజ‌కీయాల్లో కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డికి జూనియ‌ర్లు. అయినా కూడా జ‌గ‌న్ వీరికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వడం.. స‌హ‌జంగానే కాకాణికి ఆగ్రహం తెప్పించింది. దీనికితోడు అనిల్‌, నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిలు ఇద్దరూ కూడా జ‌ట్టు క‌ట్టి త‌న‌పై యుద్ధం చేస్తుండ‌డాన్ని ఆయ‌న స‌హించ‌లేక పోతున్నార‌న్న చ‌ర్చలు జిల్లా రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి. ఒక‌వైపు త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డం, మ‌రోప‌క్క, ఈ ఇద్దరూ త‌నపై ఆధిప‌త్య రాజ‌కీయాలు సాగిస్తుండ‌డం, అధిష్టానం ప‌ట్టించుకోక‌పోవ‌డం వంటి ప్రధాన కార‌ణాల నేప‌థ్యంలో కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి అల‌క వ‌హించారు. త‌న‌కు స‌న్నిహితంగా ఉండే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాక‌ర్‌రెడ్డిల‌తో ఆయ‌న జ‌ట్టు క‌ట్టారు.

పట్టు పెంచుకోవాలని….

జిల్లాపైకాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి త‌న ప‌ట్టు పెంచుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉంటున్నార‌ని అంటున్నారు నెల్లూరు జిల్లా రాజ‌కీయ పండితులు. రెండున్నరేళ్ల త‌ర్వాత జ‌రిగే విస్తర‌ణ‌లో అయినా త‌న‌కు అవ‌కాశం ఉంటుంద‌నే ఆశ ఉన్నా.. అది సాధ్యం అవుతుందో కాదోన‌నే ఆవేద‌న మాత్రం ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. ఇటు జిల్లాలోనూ.. అటు రాష్ట్రంలోనూ రెడ్డి సామాజిక వ‌ర్గం ఎమ్మెల్యేలు ఎక్కువుగా ఉండ‌డంతో కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి ఆశ‌లు ఎంత వ‌ర‌కు నెర‌వేర‌తాయో ? చూడాలి.

Tags:    

Similar News