ఆ ధిక్కరింపులోనూ రాజకీయమే?

వైరస్ కట్టడి, లాక్ డౌన్ కొనసాగింపు దేశంలో దిగజారిన ఆర్ధిక పరిస్థితి ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా ఉన్న చర్చనీయమైన అంశాలు. [more]

Update: 2020-05-19 06:30 GMT

వైరస్ కట్టడి, లాక్ డౌన్ కొనసాగింపు దేశంలో దిగజారిన ఆర్ధిక పరిస్థితి ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానంగా ఉన్న చర్చనీయమైన అంశాలు. ఇప్పుడు ఈ అంశాలపైనే కేంద్ర రాష్ట్రాల నడుమ యుద్ధాలకు తెరతీసేలా చేస్తుంది. దీనికి ఆర్ధిక అంశాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ముందుగా కేంద్రంపై యుద్ధం మొదలు పెట్టింది బెంగాల్, తెలంగాణ అనే చెప్పాలి. బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఏం చేసినా రాజకీయ కోణంలోనే అంతా చూస్తారు. అయితే తెలంగాణ సర్కార్ చేస్తున్న విమర్శలు ఆరోపణలు కేంద్రంపై రాష్ట్రాల ఆగ్రహాన్ని ప్రతిఫలిస్తుంది. ఇది మరింత పెరిగి మోడీ సర్కార్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలాగే చిలికి చిలికి గాలివానగా మారడం ఖాయం గా కనిపిస్తుంది.

అలా మొదలు పెట్టి …

మోడీ అంటే ఎవరు ? దేశానికి ప్రధాని మన లీడర్. ఆయనపై చిల్లర వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టమని ఆదేశిస్తున్నా. ఇదా సమయం విమర్శలకు అంటూ… లాక్ డౌన్ మొదలైన తొలి రోజుల్లో కేసీఆర్ బిజెపి శ్రేణులకు మించి ప్రధాని నాయకత్వాన్ని ఆయన చర్యలను ప్రశంసించారు. కట్ చేస్తే తాజాగా కేసీఆర్ లాక్ డౌన్ 3 లాక్ డౌన్ 4 నుంచి తన వైఖరి మార్చుకుంటూ వచ్చారు. హెలికాఫ్టర్ మని కోసం, లేదా అప్పులపై పరిమితులు ఎత్తివేయాలని ఆశపడ్డారు. అయితే మోడీ సర్కార్ భిన్నమైన రీతిలో స్పందించింది. పేరుకు 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా రాష్ట్రాలకు ఇందులో పాత్ర పరిమితం చేశారు. అదే ఇప్పుడు ఆర్ధిక దుస్థితిలో కూరుకుపోయిన రాష్ట్రాలకు ఆగ్రహం రప్పించింది. దాంతో నెమ్మదిగా ఒక్కొక్కరి గొంతు మారుతుంది. ఇప్పుడు మీ ముష్టి ఎవరికి కావాలనే ధిక్కార స్వరం కెసిఆర్ వంటివారు అంటున్నారు అంటే ఇందులో భవిష్యత్తు రాజకీయ వ్యూహం కనిపిస్తుంది.

తెలంగాణ పై బిజెపి కన్ను …

తెలంగాణ లో ఎదగాలన్నది కమలనాధుల వ్యూహం. ఎప్పుడైతే నాలుగు పార్లమెంట్ స్థానాలు బిజెపి కి తెలంగాణ లో వచ్చాయో అప్పటినుంచి కాషాయం దళాలు కష్టపడితే తెలంగాణ లో పార్టీ ఎదుగుదల ఖాయం అన్న నమ్మకంలో ఉన్నాయి. కాంగ్రెస్, టిడిపి పూర్తిగా తెలంగాణాలో బలహీన పడటం తో కమలంలో ఆశలు చిగురించాయి. ఆ స్థానం భర్తీ కోసం దూకుడు గా ఉండే బండి సంజయ్ ని రాష్ట్ర నేతృత్వాన్ని అప్పగించారు. బిజెపి కొత్త నాయకత్వానికి బాధ్యత అప్పగించిందో లేదో కెసిఆర్ మోడీ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ కొత్త టర్న్ తీసుకుని కమలాన్ని కన్ఫ్యూజ్ చేశారు. ఇలా ప్రధాని ని, హోంమంత్రిని ప్రశంసించడం గులాబీ శ్రేణులను అయోమయానికి గురిచేశాయి. అయితే తాజాగా కెసిఆర్ మోడీ సర్కార్ పై పెదవి విరచి తన రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో రుచి చూపించి పొలిటికల్ బరిలో తమ పార్టీ కి ఎదురు ఎవ్వరూ నిలవడానికి లేకుండా చేసుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Tags:    

Similar News