లక్ష కోట్లతో మూడోసారి ముఖ్యమంత్రి….?

లక్షకోట్లు… ఈ పదం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోట వెంట వచ్చింది. ఒక్క సామాజికవర్గానికి లక్ష కోట్లు కేటాయింపులు తెలంగాణలో హాట్ హాట్ టాపిక్ అయింది. హుజూరాబాద్ [more]

Update: 2021-07-27 11:00 GMT

లక్షకోట్లు… ఈ పదం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోట వెంట వచ్చింది. ఒక్క సామాజికవర్గానికి లక్ష కోట్లు కేటాయింపులు తెలంగాణలో హాట్ హాట్ టాపిక్ అయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం దళిత బంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారు. ఒక్కొక్క దళిత కుటుంబానికి పది లక్షల ఆర్థికసాయం అందజేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం కింద లక్ష కోట్లను కేటాయిస్తానని చెప్పడం ఇప్పుడు మిగిలిన సామాజికవర్గాల్లో చర్చనీయాంశమైంది.

హ్యాట్రిక్ విజయం కోసం….

తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫా ముఖ్యమంత్రి కావాలని, హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని భావిస్తున్న కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెచ్చారు. కేసీఆర్ చెప్పినట్లే తమది ఉద్యమ పార్టీ కాదని, సన్నాసుల పార్టీ అంతకంటే కాదని, ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పకనే చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే ఈ ప్రకటన చేసినట్లు కనపడుతున్నా ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై అనుమానాలు అప్పడే వ్యక్తమవుతున్నాయి.

ఎవరూ తప్పుపట్టకపోయినా…

రాష్ట్రంలో దళితుల ప్రయోజనాలను కాపాడటాన్ని ఎవరూ తప్పుపట్టరు. వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశం ఇవ్వొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తామన్న హామీని కేసీఆర్ గాలికి వదిలేశారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానన్న వాగ్దానాన్ని మరిచారు. ఇప్పుడు ఈ పథకం అమలుపై కూడా అలాంటి సందేహాలే వ్యక్తమవుతున్నాయి.

మిగిలిన వారి మాటేమిటి?

తెలంగాణలో అట్టుడుగున ఉన్న సామాజికవర్గాలు ఎన్నో ఉన్నాయి. గిరిజనులతో పాటు ముస్లింలు, అగ్రకులాల్లోనూ పేదలున్నారు. వీరందరూ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తే వ్యతిరేకం కారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కేసీఆర్ తీరు పట్ల వ్యతిరేకత కన్పిస్తుంది. కులాల వారీగా సమాజాన్ని విభజిస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని కేసీఆర్ చూస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగినట్లు దళితబంధు కేసీఆర్ కు ఏ మేరకు పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెడుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News