జమిలి జలక్కా… జాక్ పాటా ?

అర్జంటుగా కుమార పట్టాభిషేకానికి కేసీఆర్ ఆలోచిస్తున్నారు అన్న వార్తలు తెలంగాణా రాజకీయాల్లో కొత్త వేడి పుట్టిస్తున్నాయి. దీని వెనక ఉన్న అర్ధం పరమార్ధం ఏంటి అన్నది కూడా [more]

Update: 2021-01-01 00:30 GMT

అర్జంటుగా కుమార పట్టాభిషేకానికి కేసీఆర్ ఆలోచిస్తున్నారు అన్న వార్తలు తెలంగాణా రాజకీయాల్లో కొత్త వేడి పుట్టిస్తున్నాయి. దీని వెనక ఉన్న అర్ధం పరమార్ధం ఏంటి అన్నది కూడా తెలియక ప్రత్యర్ధి పార్టీలు తల పట్టుకుంటున్నాయి. కేసీఆర్ కి పక్కా రాజకీయ వ్యూహంతోనే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. ఆయనకు ఢిల్లీ స్థాయిలో వేగంగా సాగుతున్న పరిణామాల గురించి ఎప్పటికపుడు సమాచారం అందుబాటులో ఉండడంతోనే ఈ రకమైన నిర్ణయానికి వస్తున్నారు అని కూడా అంటున్నారు.

అదే కారణమా..?

వాస్తవానికి కేంద్రం జమిలి ఎన్నికలకు వేగంగా అడుగులు వేస్తోంది. అది కూడా 2022 సమ్మర్ దాటనీయకుడదు అని గట్టిగా భావిస్తోంది. తమ అధికారానికి రెండేళ్ళు కోతపడినా కూడా ఇంతటి రిస్క్ మోడీ షా ద్వయం తీసుకుంటోంది అంటే కచ్చితంగా మరో అయిదేళ్ల అదనపు పాలనా కాలం వచ్చి వడిలోకి చేరుతుందన్న సంకేతాలు బలంగా ఉండబట్టేనని అంటున్నారు. దేశంలో కాంగ్రెస్ సహా ప్రాంతీయ శక్తులు బలపడకుండా ముందుగా ఎన్నికలు పెట్టేసి ఆ వేడిలో అధికారం నిలబెట్టుకోవాలన్నది బీజేపీ పెద్దల ఎత్తుగడ. ఈ సంగతి పసిగట్టే తెలంగాణాలో కేసీఆర్ పావులు వేగంగా కదుపుతున్నారు అని అంటున్నారు.

ఎలా చూసుకున్నా ….

ఇక మరో వైపు నుంచి ఆలోచిస్తే తెలంగాణాలో బీజేపీ దూసుకువస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ మంచి ప్రదర్శన చేసింది. తెలంగాణా సమాజానికి తానే టీయారెస్ కి అసలైన ప్రత్యామ్నాయమని బల్ల గుద్ది మరీ చాటుతోంది. దానికి తోడు జమిలి ఎన్నికలు కనుక వస్తే తెలంగాణాలో మొగ్గు ఏ వైపు ఉంటుందో ఏమో అన్న కంగారు కూడా గులాబీ శిబిరంలో ఉందని అంటున్నారు. అందుకే అర్జంటుగా కేటీయార్ కి పట్టం కట్టి సీఎం సీట్లో కూర్చోబెడితే ఆ ముచ్చట అలా తీరిపోతుందని కూడా కేసీఆర్ భావిస్తున్నట్లుగా ఉంది అని అంటున్నారు. రేపటి రోజున తెలంగాణాలో ఫలితాలు తేడా కొట్టినా మాజీ సీఎం హోదాలో ఫ్యూచర్ పాలిటిక్స్ ని నడిపేందుకు కేటీయార్ కొత్త హోదాతో టీయారెస్ కి బలమైన సారధిగా ఉంటాడని కూడా తలపోస్తూనే ఈ డెసిషన్ కి వచ్చి ఉంటారని అంటున్నారు.

కొండకు ముడి వేసి….?

జాతీయ రాజకీయాలు ఇపుడు సవ్యంగా లేవు. 1970 ల నాటి రాజకీయ వాతావరణం దేశంలో ఉంది. అంటే ఏకపక్ష రాజకీయం అన్న మాట. కాంగ్రెస్ నాడు అత్యంత బలంగా ఒక వైపు ఉంటే ఇతర విపక్షాలు చెల్లాచెదురుగా విడిగా ఉంటూ వచ్చాయి. వాటిని ఒక గాటకు చేర్చి పోరాడే శక్తి నాడు కనిపించకపోవడంతోనే ఇందిరాగాంధీ అజేయమైన‌ విజయాలు అందుకున్నారు. ఇపుడు మోడీకి కూడా దేశ రాజకీయం అలాగే అనుకూలంగా ఉంది. దాన్ని మరింత సానుకూలం చేసుకోవడానికే జమిలి మంత్రం పఠిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కుమారుడు కేటీయార్ కి తెలంగాణా సీఎం గా పట్టం కట్టి తాను జాతీయ రాజకీయాల మీద దృష్టి సారించాలని అనుకుంటున్నారు. 2022లో జమిలి ఎన్నికలు అనుకుంటే అంతకు ఏడాది ముందు నుంచే విపక్షం ఒక్క త్రాటి మీదకు వస్తేనే కానీ గట్టి పోటీ సాధ్యపడదు. ఆ పని చేయాలంటే పూర్తి సమయం కేసీఆర్ వెచ్చించాల్సిందే. అందుకే టీయారెస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చూచాయగా ఈ విషయం చెప్పేశారు. కొత్త ఏడాది మార్చిలోగా కేటీయార్ సీఎం అవడం ఖాయమని ఆయన గుట్టు విప్పేశారు. టీయారెస్ కి ఇది జమిలి గుబులా, ఫ్యూచర్ దిగులా అన్నది చూడాలి మరి.

Tags:    

Similar News