Kcr : ఎత్తుగడ అదిరింది కదా….?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై దూకుడుగా ఉన్నారు. యుద్ధానికే సిద్ధమయినట్లు కన్పిస్తుంది. బీజేపీయే తన ప్రత్యర్థిగా కేసీఆర్ భావిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ [more]

Update: 2021-11-09 09:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై దూకుడుగా ఉన్నారు. యుద్ధానికే సిద్ధమయినట్లు కన్పిస్తుంది. బీజేపీయే తన ప్రత్యర్థిగా కేసీఆర్ భావిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ బీజేపీ పై వార్ ప్రకటించినట్లే కనపడుతుంది. ప్రతి రోజూ మీడియా సమావేశాలు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని చెండాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతున్నారు. వరి నుంచి విభజన హామీల వరకూ ఏదీ వదిలిపెట్టకుండా దుమ్ముదులుపుతున్నారు.

వరస మీడియా సమావేశాలతో…

కేసీఆర్ మీడియా సమావేశాలు పెట్టడం అరుదు. ప్రత్యేక అంశం ఉంటే తప్ప ఆయన మీడియా ముందుకు రారు. కానీ వరసగా రెండు రోజుల నుంచి మీడియా సమావేశాలు పెట్టడం బీజేపీని ఇరుకున పెట్టడానికేనని అనిపిస్తుంది. ఇప్పటి వరకూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న కేసీఆర్ ప్రత్యక్ష పోరాటానికి దిగారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అధికార పార్టీ హోదాలో ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతుంది.

బలంగా లేదని తెలిసీ…

వాస్తవానికి బీజేపీ తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో బలంగా లేదు. పది నుంచి ఇరవై నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. ఈ సమయంలో కేసీఆర్ బీజేపీ యాంటీ స్టాండ్ తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఎప్పటికైనా బలం పుంజుకునే అవకాశముంది. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్, ఓటు బ్యాంకుతో పాటు నాయకత్వం కూడా ఉంది. అందుకే కేసీఆర్ కాంగ్రెస్ ను నామమాత్రంగా చేసేందుకు బీజేపీని తన శత్రువుగా చిత్రీకరిస్తున్నారనిపిస్తోంది.

కాంగ్రెస్ ను నామమాత్రం చేసేందుకేనా?

బీజేపీ తెలంగాణలో పూర్తిగా బలపడే అవకాశాలు లేవని తెలుసు. కానీ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలుండటంతో ఆయన బీజేపీపై యుద్ధానికి సిద్ధమయ్యారు. తమకు, బీజేపీకి మాత్రమే పోటీ అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే కేసీఆర్ ఈ ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు కనపడుతుంది. కాంగ్రెస్ ను తెలంగాణాలో నామమాత్రంగా చేసేందుకు బీజేపీని తన ప్రధాన శత్రువుగా సీన్ క్రియేట్ చేస్తున్నారు కేసీఆర్. ఇది కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమేనంటున్నారు.

Tags:    

Similar News