ఎక్కడ కాలుతుందో…. అక్కడే కెలుకుతున్నారు

రాజకీయాల్లో సిధ్ధాంతాలు అంటూ ఉన్నా వాటికి మించి చాణక్య రాజనీతి బాగా పనిచేస్తూంటూంది. దేశంలోని స్వాతంత్ర సమరయోధుల్లో ఒక్క జవహర్ లాల్ నెహ్రూ తప్ప మిగిలిన వారంతా [more]

Update: 2020-06-21 09:30 GMT

రాజకీయాల్లో సిధ్ధాంతాలు అంటూ ఉన్నా వాటికి మించి చాణక్య రాజనీతి బాగా పనిచేస్తూంటూంది. దేశంలోని స్వాతంత్ర సమరయోధుల్లో ఒక్క జవహర్ లాల్ నెహ్రూ తప్ప మిగిలిన వారంతా బీజేపీకి ఇష్టమే. నెహ్రూ ఒక్కరే ఎందుకు విరోధి అంటే ఆయన వారసులు కాంగ్రెస్ తరఫున ఇంకా ఎదురునిలిచి పోరాడుతున్నారు కాబట్టి. అందుకే సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయి పటేల్. ఇక మహాత్మాగాంధీ కూడా బీజేపీకి పూజనీయులుగా ఉన్నారు. అంటే అవతల వారిని ఇబ్బంది పెట్టాలంటే వారు ఉపేక్షించిన వారిని, వారు మరచిన నేతలను పెద్దవారుగా చేసి పూజిస్తే చాలు రాజకీయం సరిగ్గా బాలన్స్ అవుతుంది. ఇపుడు ఇదే ఫార్ములా తెలుగు రాష్ట్రాల్లోనూ అమలవుతోంది.

ఎక్కడ కొట్టాలో….?

కాంగ్రెస్ కి ఎక్కడ కాలుతుందో గులాబీబాస్ కేసీఆర్ కి బాగా తెలుసు. పైగా దాంతో పాటు పొలిటికల్ మైలేజ్ కూడా కావాల్సినంత రావాలంటే చేయాల్సింది చేయాలి. అందుకే తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ నేత, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించడానికి కేసీఆర్ రెడీ అంటున్నారు. పీవీ జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తారు. ఆయన కుటుంబంతో పాటు, మేధావులు, పెద్దలను కలిపి ఒక కమిటీని కేసీఆర్ సర్కార్ నియమించింది. దీనికి రాజ్య సభ ఎంపీ కేశవరావు చైర్మన్ గా ఉంటారు. కాంగ్రెస్ పీవీని దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఆఖరుకు దేశ ప్రధానిగా చేసిన ఆయనకు ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించి సమాధి కట్టేందుకు కూడా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఒప్పలేదు. అది తెలంగాణా సమాజానికి అవమానమే. ఆ బాధ వారిలో ఉందని గ్రహించిన కేసీఆర్ ఇపుడు పీవీని పూర్తిగా సొంతం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తప్పుని కెలికి మరీ ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతున్నారు.

జగన్ ఇలా…..

మరో వైపు ఏపీలో తీసుకుంటే ఏపీలో జగన్ కూడా ఇదే విధానంతో ముందుకు పోతున్నారు. ఆయన కూడా తెలుగుదేశం మూల పురుషుడు ఎన్టీఆర్ ని కీర్తిస్తున్నారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడు. ఆయన పేదల కోసం పాటుపడ్డారంటూ జగన్ అనేకసార్లు చెప్పారు. ఎన్టీఆర్ పేరిట ఒక జిల్లాను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన పుట్టిన సొంత గడ్డ మీద పాదయాత్ర వేళ హామీ కూడా ఇచ్చారు. ఇక ఆ దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఎన్టీఆర్ కి భారత రత్న ఇప్పించాలని కూడా ఆయన సతీమణి వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అంటున్నారు. ఆ విషయంలోనూ జగన్ సర్కార్ చొరవ తీసుకుంటే కచ్చితంగా టీడీపీకి ఎన్టీఆర్ గురించి చెప్పుకునే నైతికత లేకుండా పోతుంది.

శత‌జయంతి చేస్తారా…?

ఇక అసలే ఆయన్ని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మామను ఎంత బాగా కొలిచినా ఆ మచ్చ అలాగే ఉంది. పైగా ఎన్టీఆర్ తెలుగు జనానికి ఇష్టమైన నాయకుడు. దాంతో జగన్ అధికారంలో ఉండగానే 2021లో వచ్చే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని వైసీపీ సర్కార్ అధికారికంగా నిర్వహించలనుకున్నా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద చూసుకుంటే ప్రత్యర్ధులను వారి ఆయుధాలతోనే గట్టిగా కొడుతూంటే ఆ పొలిటికల్ కిక్కే వేరుగా ఉంటుందని బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ రుజువు చేస్తున్నాయి.

Tags:    

Similar News