కేసీఆర్ కు కూడా అది అంటుకుందిగా?

కరోనా మహమ్మారి జెట్ స్పీడ్ తో దూసుకువచ్చి దేశంలో మారు మూలల్లోనూ విలయతాండవం చేస్తోంది. అయితే దాన్ని మించిన వేగం భారతీయ రాజకీయ వైరస్ కి ఉంది. [more]

Update: 2020-05-06 15:30 GMT

కరోనా మహమ్మారి జెట్ స్పీడ్ తో దూసుకువచ్చి దేశంలో మారు మూలల్లోనూ విలయతాండవం చేస్తోంది. అయితే దాన్ని మించిన వేగం భారతీయ రాజకీయ వైరస్ కి ఉంది. అందుకే మొదట్లో గమ్మున్న నోర్లు ఇపుడు గట్టిగానే లేస్తున్నాయి. ఏపీ విషయానికి వస్తే మొదటి రోజు నుంచి జగన్ కి ఈ తలనొప్పి ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు సహా తమ్ముళ్ళు ఏ విషయంలోనూ జగన్ ని వదలకుండా రాజకీయ బాణాలు వేస్తూనే ఉన్నారు. ఇక బీజేపీ తీరు శృతి మించి రాగాన పడింది. ఆ పార్టీ అధినేత కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా రాపిడ్ కిట్స్ విషయమో భారీ అవినీతి జరిగిందని హాట్ కామెంట్స్ చేయడంతో ఏపీ రాజకీయం ఓ దశలో రచ్చ రచ్చ అయింది. ఇక సీపీఐ, జనసేన రాజకీయమూ డిటోగానే ఉంది.

గులాబీ బాస్ మీద…..

ఇపుడు తెలంగాణాలోనూ రాజకీయ వైరస్ గట్టిగానే ఉంది. కాంగ్రెస్ మొదలుకుని, బీజేపీ వరకూ అంతా కలసి కేసీఆర్ ని నిందిస్తున్నారు. కరోనా కట్టడి విషయంలో కేసీయార్ సర్కార్ ఫెయిల్ అనేస్తున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి లాంటి వారు అయితే ఏపీలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు జరుగుతున్నాయని అదే తెలంగాణాలో మాత్రం నెమ్మదిగా చేస్తున్నారని, దాని వల్ల కరోనా వ్యాప్తికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక బీజేపీ తెలంగాణా ప్రెసిడెంట్ బండి సంజీయ్ అయితే కేసీఆర్ సర్కార్ అన్నింటా విఫలం అయిందని అంటున్నారు. కరోనా మహమ్మారిని అదుపు చేసే విషయంలో కేంద్ర మారగదర్శకాలను సరిగ్గా అనుసరించడంలేదనికూడా అనేస్తున్నారు.

వీహెచ్ నిరసన:

ఇంకోవైపు కాంగ్రెస్ వృధ్ధ నేత వీ హనుమంతరావు తెలంగాణా రైతాంగం సమస్యల పైన ఒక రోజు నిరసన కూడా చేశారు. కేసీఆర్ వి అన్నీ ఏకపక్ష నిర్ణయాలు అంటూ ఆయన విరుచుకుపడ్డారు. గతంలో ప్రకృతి విపత్తులు వచ్చినపుడు తమ కాంగ్రెస్ ప్రభుత్వాలు విపక్షాలతో చర్చించి నిర్ణయాలు తీసుకునేవి అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రైతుల పంటలకు తగిన ధర రావడంలేదని, వారిని మోసం చేస్తున్నారని కూడా వీహెచ్ ఘాటు విమర్శలు చేశారు.

మిత్రులు కూడా…?

ఇంకోవైపు టీఆర్ఎస్ కి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కూడా ఓ దశలో విరుచుకుపడింది. అసెంబ్లీలో ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ సైతం గాంధీ ఆసుపత్రిలో సేవలు బాగులేవని, కరోనా రోగుల విషయంలో ప్రభుత్వం సరిగ్గా సదుపాయాలు చేయడంలేదని ఆరోపణలు చేశారు. ఇక కాంగ్రెస్ లో ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి లాంటి వారు అయితే కేసీఆర్ పాలన మోసాలు, అవినీతి అంటూ ఎండగడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ పరిశోధనలో కేసీఆర్, కేటీయార్ తమ బంధువులకు చెందిన కొత్త ఫార్మా కంపెనీని భారతీయ మెడికల్ కౌన్సిల్ కి సిఫార్స్ చేశారని కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో చాల పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా అంటున్నారు. మొత్తానికి టీడీపీ జాతీయ పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబు తప్ప అందరూ కేసీఆర్ మీద దండెత్తుతున్నారు. ఓ విధంగా ఇది చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటూ జగన్ మీద దూసిన రాజకీయ వైరస్ ప్రభావమేనని అంటున్నారు. మొత్తానికి కష్ట కాలంలో కూడా పాలకులను పని చేయనియ‌కుండా సొంత రాజకీయం చూసుకునే పార్టీలు దేశంలో ఉండడం కరోనా వైరస్ కంటే ప్రమాదమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News