జస్టిస్ అంటే ఎలా ఉండాలి? ఇలా కాదుగా?

న్యాయమూర్తులు…న్యాయదేవతకు ప్రతిరూపాలు, ప్రతినిధులు. న్యాయపీఠంపై ఆశీనులైనప్పుడు వారు అత్యంత నిగ్రహం పాటించాలి. సంయమనం ప్రదర్శించాలి. పారదర్శకతతో వ్యవహరించాలి. నిష్పాక్షికంగా ఉండాలి. వారి పరిశీలన అంతా న్యాయ నిర్ణయం [more]

Update: 2021-01-06 15:30 GMT

న్యాయమూర్తులు…న్యాయదేవతకు ప్రతిరూపాలు, ప్రతినిధులు. న్యాయపీఠంపై ఆశీనులైనప్పుడు వారు అత్యంత నిగ్రహం పాటించాలి. సంయమనం ప్రదర్శించాలి. పారదర్శకతతో వ్యవహరించాలి. నిష్పాక్షికంగా ఉండాలి. వారి పరిశీలన అంతా న్యాయ నిర్ణయం కోసమే ఉండాలి. నిర్వికారంగా ఉండాలి. వారి మాటలు, చేతలు ఎలాంటి అభిప్రాయాలకు తావిచ్చే విధంగా ఉండరాదు. కక్షిదారుకు న్యాయం చేయాలన్న తపన తప్ప మనసులో మరో ఆలోచనకు తావుండరాదు. న్యాయమూర్తిగా తన ముందున్న అంశాలకే పరిమితమవ్వాలి. జస్టిస్ క్రిష్ణయ్యర్, జస్టిస్ ఒ.చిన్నప్పరెడ్డి, జస్టిస్ దేశాయ్ న్యాయమూర్తులుగా న్యాయవ్యవస్థకు వన్నె తెచ్చారు. న్యాయపీఠాల పేరు ప్రతిష్ఠలను పెంచారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉందా అన్న ప్రశ్నకు సరైన సమాధానం లభించదు. ఎవరో ఒకరిద్దరు వల్ల మొత్తం న్యాయవ్యవస్థ పేరు ప్రతిష్టలే మసకబారే పరిస్థితి నెలకొంది.

అనవసర విషయాల్లో జోక్యం….

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యవహారశైలి చూసిన తరవాత ఈ అభిప్రాయం కలుగుతుందని న్యాయకోవిదులు చెబుతున్నారు. జస్టిస్ కుమార్ తన ముందున్న అంశాలకు పరిమితమవ్వకుండా, తనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ పరిధులు, పరిమితులను అతిక్రమించారన్న వాదన న్యాయవర్గాల నుంచి వినపడుతోంది. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఖైదీ నెంబరు 6093 అని వ్యాఖ్యానించడం ధర్మాసనం స్థాయిని తగ్గించడమే అవుతుంది. తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి బదిలీ వల్ల సీబీఐ కోర్టుల్లో జగన్ కేసుల విచారణలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందనడం ద్వారా న్యాయవ్యవస్థపై అనుమానాలు కలిగించే విధంగా వ్యవహరించారు.

ప్రశ్నించడం ఎంతవరకూ?

ఏపీ, తెలంగాణ ప్రధాన న్యాయమూర్తుల బదిలీలపై కొలీజియం నిర్ణయాన్ని ప్రశ్నించడం ఎంతవరకు సహేతుకం అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. తాను కూడా కొలీజియం నిర్ణయం వల్లే హైకోర్టు న్యాయమూర్తి అయ్యానన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే జస్టిస్ రాకేశ్ కుమార్ విస్మరించారు. న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా, నిజాయతీగా ఉండాలన్న భావనకు విఘాతం కలగడానికి మేము కూడా కొంతవరకు కారణమేనని పేర్కొనడం ద్వారా పరోక్షంగా ‘లోగుట్టు ’విప్పారు. ఇరు రాష్రాల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ నిర్ణయంలో పారదర్శకత ఉండాలన్న రాకేశ్ కుమార్ వ్యాఖ్య ఆయనకు కూడా వర్తిస్తుంది. తాను ఇచ్చే తీర్పులు, వెలువరించే నిర్ణయాలు, జారీచేసే ఆదేశాల్లో ఎంత పారదర్శకత అని తనను తాను ప్రశ్నించుకున్నప్పుడు, ఇతరుల నిర్ణయాల్లోని పారదర్శకతను ప్రశ్నించ డం తేలిక అవుతుంది.

జస్టిస్ చంద్రును చూసి…..

మూడు రాజధానులపై విచారణ, శాసనమండలి రద్దు, అధికార పార్టీ ఎంపీఫై ఫిర్యాదు తదితర అంశాలపై జస్టిస్ రాకేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవే. బిహార్ కు చెందిన రాకేశ్ కుమార్ పట్నా హైకోర్టులో పని చేసినప్పుడు కూడా వివాదాస్పదంగానే వ్యవహరించారు. అప్పట్లో ఆయన పనితీరును విశ్లేషించిన తరవాతే 2019లో ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. చివరగా పదవీ విరమణ సందర్భంగా అమరావతికి చెందిన కొందరు రైతులు ఆయనను సత్కరించారు. ఇంతవరకూ బాగానే ఉంది. కొందరు అనుకూలంగా ఉన్నారంటే మరి కొందరు వ్యతిరేకమనే అర్థం వస్తుందన్న విషయం జస్టిస్ రాకేశ్ కుమార్ కు తెలియదని అనుకోలేం. ఇటీవల మద్రాసు హైకోర్టుగా పదవీ విరమణ చేసిన జస్టిస్ చంద్రు ఎలాంటి హడావిడి లేకుండా విధి నిర్వహణ అనంతరం నేరుగా మెట్రో రైలెక్కి వెళ్లిపోయారు. ఇలాంటి వారి ద్వారా మాత్రమే న్యాయవ్యవస్థ పేరు ప్రతిష్టలు పెరుగుతాయనడంలో సందేహం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News